పండుగల సీజన్ ప్రారంభమైంది.. ప్రతి ఒక్కరూ షాపింగ్ చేయాలని అనుకుంటుంటారు. మరికొంత మంది ముందే షాపింగ్ చేసి దుస్తులు, సామగ్రిని కొనిపెట్టుకొని ఉంటారు. ఇదే అదనుగా భావించే పండుగ సందడిలో ఉన్న ప్రజలకు దొంగతనాల ముప్పు పొంచివున్నది. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసు అధికారులు. పండుగ పూట ఇంటికి తాళం వేసి ఊర్లకు వెళ్లే వారు జాగ్రత్తలు పాటించాలి. ముందస్తుగా సంబంధిత పీఎస్లో సమాచారం ఇవ్వడం మంచిదని చెబుతున్నారు. ఈమేరకు ఎమర్జెన్సీ డయల్ కాల్ నెంబర్లను అందుబాటులో ఉంచుతున్నారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి, తగు జాగ్రత్తలు పాటిస్తూ పండుగలను సంతోషంగా జరుపుకోవాలని సూచింస్తున్నారు.
– జహీరాబాద్/ సిద్దిపేట టౌన్, అక్టోబర్ 9
“ పండుగ పూట ఇంటికి తాళం వేసి ఊర్లకు వెళ్లే వారు జాగ్రత్తలు పాటించాలి. నిర్లక్ష్యం చేస్తే తిరిగి వచ్చే సరికి ఇల్లు గుల్లవుతుంది. ముందస్తుగా సంబంధిత పీఎస్లో సమాచారం ఇవ్వడం మంచిది. పోలీసుల సూచనలు, సలహాలు” పాటిస్తూ బతుకమ్మ, దసరా పండుగలను కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకోవాలని సిద్దిపేట సీపీ జోయల్ డెవిస్ సూచించారు. పండుగను పురస్కరించుకొని ఆయన ప్రజలకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.
పిల్లలపై ఓ కన్నేయండి..
ప్రభుత్వం దసరా పండుగ సెలవులు ప్రకటించిన నేపథ్యంలో పిల్లల భద్రతపై ఓ కన్నేసి ఉంచాలని పోలీసుశాఖ ముందస్తుగా పలు సూచనలు చేసింది.
సొంత ఊర్లకు తరలివెళ్తున్న వారు పిల్లలపై ప్రత్యేక నిఘా పెట్టాలి.
జలాశయాలు నిండుకుండలా ఉన్నాయి. వాటిల్లో ఈతకు
వెళ్లనీయకుండా చూడాలి.
వాహనాల తాళంచెవులు వారికి అందుబాటులో ఉంచితే
బైక్ రైడింగ్కు పాల్పడే అవకాశాలు లేకపోలేదు.
మొబైల్ఫోన్లకు వీలైనంత దూరంగా ఉంచి వారిపై నిఘా ఉంచాలి.
అపార్ట్మెంట్లో ఉండే పిల్లలు లిఫ్టుల్లోకి ఒంటరిగా వెళ్లనీయకుండా చూడాలి.
బటన్లు ఇష్టమొచ్చినట్లు నొక్కి లిఫ్టుల్లో ఇరుక్కునే ప్రమాదం ఉంటుంది.
సెలవు రోజుల్లో పిల్లలకు ఆసక్తి ఉన్న రంగంలో శిక్షణ ఇప్పిస్తే మంచిది.
మన సంస్కృతీ, సంప్రదాయాలు, నైతిక విలువలు తెలియజేయాలి.
మహిళలు అప్రమత్తంగా ఉండాలి..
దసరా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కావడంతో మహిళలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. జహీరాబాద్ డివిజన్లో పెట్రోలింగ్ ముమ్మరం చేశారు. ప్రస్తుతం పండుగల సీజన్ కావడంతో పోలీసులు మఫ్టీలో నిఘా ఏర్పాటు చేశారు. మహిళలు ఊర్లకు వెళ్లేటప్పుడు నగలు కనపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు. వాహనంపై వెళ్లే అపరిచితులు మాట్లాడేందుకు ప్రయత్నస్తే అందుకు అవకాశం ఇవ్వకుడదు. అనుమానం వస్తే వెంటనే 100కు ఫోన్ చేయాలని చెబుతుతున్నారు.
సీసీ కెమెరాలతో పర్యవేక్షణ…
దొంగతనాలు నివారించేందుకు ప్రత్యేకంగా పెట్రోలింగ్ ఏర్పాటు చేశాం. షాపుల వద్ద ప్రత్యేక నిఘాతో పర్యవేక్షిస్తున్నం. జాతీయ రహదారి, జహీరాబాద్ పట్టణంలోని ప్రధాన రోడ్లపై గస్తీ ముమ్మరం చేశాం. మహిళలు మార్కెట్కు వచ్చేముందు బంగారు నగలు ఇంట్లో ఉంచి రావడం మంచిది. కర్ణాటక సరిహద్దులో ఉండడంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం.