జహీరాబాద్, అక్టోబర్ 4: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతంలో చెరుకు రైతుల సమస్యను పరిష్కరించేందుకు ప్రభు త్వం కృషిచేయాలని స్థానిక ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు కోరారు. సోమవారం శాసనసభలో చెరుకు రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. జహీరాబాద్ మండలం కొత్తూర్(బి) గ్రామంలోని నిజాంషుగర్స్ ఫ్యాక్టరీని 2002లో అప్పటి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసిందన్నారు. ప్రైవేటీకరణ తర్వాత యాజమాన్యాలు మారినట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న ట్రైడెంట్ షుగర్స్ ఫ్యాక్టరీ యాజమాన్యం 2019-20లో చెరుకు క్రషింగ్ చేసిన రైతులకు బిల్లులు చెల్లించలేదన్నారు. ఆర్థిక శాఖ మంత్రి తన్నీర్ హరీశ్రావు కలిపించుకొని రైతులకు బిల్లులు ఇప్పించారన్నారు. 2020-21లో ట్రైడెంట్ యాజమాన్యం చెరుకు క్రషింగ్ చేయకపోవడంతో ఇతర ఫ్యాక్టరీలకు చెరుకు తరలించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందన్నారు. ఈ ఏడాది ఆ ఫ్యాక్టరీలో క్రషింగ్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయడం లేదన్నారు. మంత్రి కలిపించుకొని జహీరాబాద్ ప్రాంతంలో సాగుచేస్తున్న చెరుకును ఇతర ఫ్యాక్టరీలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని కోరారు. దీనికి గాను ప్రభుత్వమే రవాణా ఖర్చులు భరించాలని కోరారు. అంతేకాకుండా జాతీయ రహదారిపై ఉన్న టోల్గేటు డబ్బులు మాఫీ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేయాలన్నారు. వచ్చే ఏడాది నాటికి జహీరాబాద్ జోన్లో కొత్త చెరుకు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడమా.. లేక ఉన్న ఫ్యాక్టరీలో క్రషింగ్ సీజన్ ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.