చిన్నశంకరంపేట, సెప్టెంబర్ 12: ఎట్టకేలకు చిరుతపులి బోనులో చిక్కింది. ఏడాది నుంచి మండల పరిధిలోని కామారం గిరిజన తండా శివారులోని వల్లూరు అటవీప్రాంతంలో సంచరిస్తూ గొర్రెలు, మేకలు, పశువుల కొట్టాలపై చిరుతపులి దాడులు చేస్తూ వాటిని చంపివేసింది. తండావాసులకు పులి కంట పడడంతో అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అధికారులు పులిని బంధించేందుకు బోనును ఏర్పాటు చేశారు. బోనులో మేక పిల్లను ఎరగా వేశారు. శనివారం రాత్రి చిరుతపులి మేక కోసం వచ్చి బోనులో చిక్కుకుంది. విషయాన్ని గమనించిన కామారం గిరిజన తండావాసులు అటవీశాఖ అధికారులకు, చిన్నశంకరంపేట పోలీసులకు సమాచారం అందించగా, సంఘటనా స్థలానికి ఎస్సై మహ్మద్గౌస్, రేంజర్ మోహన్, సెక్షన్ ఆఫీసర్ బలరాం, సిబ్బంది చేరుకున్నారు. ఆదివారం చిరుతపులిని చూసేందుకు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. సంఘటనా స్థలాన్ని మెదక్ ఎస్పీ చందనదీప్తి, జిల్లా అటవీశాఖ అధికారి జ్ఞానేశ్వర్ సందర్శించి వివరాలు సేకరించారు. అనంతరం రిస్యూ వ్యాన్ను రప్పించి చిరుతను హైదరాబాద్కు తరలించారు. ఈ సందర్భంగా డీఎఫ్వో జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ బోనులో చిక్కిన చిరుతపులికి వైద్యపరీక్షలు నిర్వహించి హైదరాబాద్లోని జూపార్క్కు తరలిస్తామన్నారు. చిరుత వయస్సు సంవత్సరం ఉంటుందన్నారు. వల్లూరి అటవీప్రాంతంలో మరిన్ని చిరుతపులులు సంచరిస్తున్నాయని తెలిపారు. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో అటవీప్రాంతంలోకి వెళ్లొదని సూచించారు. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే అటవీ అధికారులకు సమాచారాన్ని అందించాలని సూచించారు. అటవీప్రాంతానికి ఆనుకొని ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కాగా, అటవీశాఖ అధికారులు చిరుతపులిని బంధించడంతో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.