మెటల్ రోడ్లను బీటీ రోడ్లుగా మార్చేందుకు రూ.20కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు
ఇబ్రహీంపట్నం, మార్చి 28 : నియోజకవర్గంలోని పంచాయతీరాజ్ రోడ్లకు మహర్దశ పట్టనుంది. ఎన్నో ఏండ్లుగా మెటల్ రోడ్లు బీటీగా మార్చడానికి ప్రభుత్వానికి రూ.20కోట్లతో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ప్రతిపాదనలు పంపారు. అలాగే, ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న పలు బీటీ రోడ్లను పునరుద్ధరించడానికి మరో రూ.8కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. త్వరలోనే ఈ ప్రతిపాదనలకు నిధులు మంజూరు కానున్నాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని పంచాయతీరాజ్ రోడ్లకు మంచిరోజులు రానున్నాయి.
ఏండ్ల సమస్యలకు పరిష్కారం..
మంచాల మండలంలోని నోముల నుంచి ఆగాపల్లి వరకు గల సుమారు 4 కిలోమీటర్ల లింకురోడ్డుకు పదిహేను ఏండ్ల కింద మెటల్ రోడ్డు వేశారు. అప్పటి నుంచి బీటీరోడ్డుకు నోచుకోలేకపోయింది. రోడ్డుపై కంకర తేలి వాహనాలు వెళ్లలేని స్థితికి చేరుకున్నాయి. రోడ్డు మరమ్మతుకు కూడా ప్రతిపాదనలు పంపారు. యాచారం మండలంలోని ధర్మన్నగూడ నుంచి తులేకలాన్ వరకు మెటల్రోడ్డు మరమ్మతులు జరుగడం లేదు. ఈ రోడ్డు కూడా బీటీ రోడ్డుగా మార్చడానికి ప్రతిపాదనలు పంపారు. యాచారం మండలంలోని గున్గల్ నుంచి మంచాల మండలంలోని జాపాల వరకు గల మెటల్ రోడ్డును కూడా బీటీ రోడ్డుగా మార్చేందుకు ప్రతిపాదనలు పంపారు. ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్మెట్ మండలాల్లోని సుమారు 20 నుంచి 25 రోడ్ల వరకు మెటల్ రోడ్లను బీటీ రోడ్లుగా మార్చడానికి ప్రతిపాదనలు సిద్ధంచేశారు. దీంతో ఎన్నో ఏండ్లుగా మరమ్మతులకు కూడా నోచుకోని మెటల్ రోడ్లు బీటీ రోడ్లుగా మారనున్నాయి.
రూ.8కోట్లతో బీటీ రోడ్ల పునరుద్ధరణ..
నియోజకవర్గంలో ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న బీటీ రోడ్ల మరమ్మతుకు కూడా రూ.8 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధ్దంచేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఆర్అండ్బీ అధికారులతో చర్చించి దెబ్బతిన్న రోడ్లను గుర్తించి వాటి మరమ్మతుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇటీవల ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం మండలాలతో పాటు ఆదిబట్ల, తుర్కయాంజాల్, పెద్దఅంబర్పేట్ మున్సిపాలిటీల్లో కూడా అనేక రోడ్లు వర్షాలకు దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న బీటీ రోడ్ల పునరుద్ధరణకు ఈ నిధులను ఖర్చుచేయనున్నారు.
మున్సిపాలిటీల్లో శాశ్వత డ్రైనేజీ నిర్మాణం..
నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం, తుర్కయాంజాల్ మున్సిపాలిటీల్లో శాశ్వత డ్రైనేజీల నిర్మాణానికి రూ.10కోట్ల నిధులు కేటాయించారు. ఇందులో తుర్కయాంజాల్ మున్సిపాలిటీలో డ్రైనేజీల ఏర్పాటుకు రూ.6 కోట్లు, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో శాశ్వత డ్రైనేజీ నిర్మాణానికి రూ.4కోట్లు కేటాయించారు.
త్వరలోనే పూర్తిస్థాయిలో మరమ్మతులు
నియోజకవర్గంలో ఎన్నో ఏండ్లుగా మరమ్మతుకు నోచుకోని మెటల్ రోడ్లను బీటీ రోడ్లుగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఆయా మండలాల్లో ఉన్న మెటల్ రోడ్లను గుర్తించి బీటీ రోడ్లుగా మార్చడానికి సుమారు రూ.20కోట్లతో ప్రతిపాదనలు సిద్ధంచేసి పంపాం. నిధులు మంజూరు అయిన వెంటనే రోడ్ల మరమ్మతులు చేపడుతాం. ఇటీవల వానలకు దెబ్బతిన్న ప్రధాన రహదారుల పునరుద్ధరణకు కూడా మరో రూ.8కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశాం. త్వరలోనే నిధులు మంజూరు కానున్నాయి. దీంతో నియోజకవర్గంలోని రోడ్లు పూర్తిస్థాయిలో మరమ్మతు కానున్నాయి.
-ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి
ఇవి కూడా చదవండి
నాన్స్టిక్ పాత్రలను ఇలా వాడితే మంచిది