165 మెట్రిక్ టన్నుల మామిడి కాయల కొనుగోలు లక్ష్యం
కులకచర్లలో ఎఫ్పీవో, మామిడి రైతులతో
కలెక్టర్ పౌసుమి బసు సమీక్ష సమావేశం
కులకచర్ల, మార్చి 24 : మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కులకచర్ల శ్రీరామలింగేశ్వర సిరిధాన్యాన్ని ఉత్పత్తిదారుల సంఘం (ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్) ఆధ్వర్యంలో మామిడి కాయలను కొనుగోలు చేయనున్నట్లు వికారాబాద్ కలెక్టర్ పౌసుమి బసు తెలిపారు. బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో శ్రీరామలింగేశ్వర ఉత్పత్తిదారుల సంఘం సభ్యులు, మామిడి రైతులకు శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. శ్రీరామలింగేశ్వర సిరిధాన్యాల ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో కులకచర్లలో 102 మంది రైతుల నుంచి 165 మెట్రిక్ టన్నుల మామిడి కాయలను కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. రైతు సంఘాల్లో చేరిన రైతుల మామిడి కాయలు కొనుగోలు చేస్తారన్నారు. మామిడి రైతులకు లబ్ధిచేకూర్చడమే కార్యక్రమ ఉద్దేశమన్నారు. రైతులకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. కులకచర్ల మండల రైతులందరూ ఎఫ్పీవో ద్వారా అందుబాటులో ఉన్న వివిధ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
గ్రేడులుగా మామిడి కాయలు..
మండలంలో చిరుధాన్యాలు ఎక్కువగా పండించడంతో రైతులకు అందుబాటులో మిల్లింగ్ సదుపాయం కల్పిస్తామని కలెక్టర్ పౌసుమి బసు అన్నారు. కులకచర్ల ఎఫ్పీవోకు ఒక మల్టీక్రాప్ హార్వేస్టర్ను కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. ఉపాధిహామీ పథకం ద్వారా మామిడి మొక్కలను పెంచుకోవడానికి అవకాశం ఉందని వివరించారు. మామిడి రైతులకు లాభాలు వచ్చే విధంగా కనీసం మూడుసార్లు పంటను తీసే విధంగా చర్యలు తీసుకుంటారని కలెక్టర్ వివరించారు. మామిడి కాయలను ఏ,బీ,సీ గ్రేడులుగా చేసి ధర చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అధికారులు మార్కెటింగ్పై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సందర్భంగా ఎఫ్పీవో గురించి సభ్యులకు, రైతులకు సూచనలు, సలహాలు అందజేశారు. కార్యక్రమంలో డీఆర్డీవో కృష్ణన్, జిల్లా వ్యవసాయాధికారి గోపాల్, హార్టికల్చర్ అధికారి చక్రపాణి, డీపీఎం శ్రీనివాస్, ఏపీఎం శోభ, జడ్పీటీసీ రాందాస్నాయక్, కంపెనీ డైరెక్టర్ కవిత, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు అలివేలు, ఎంపీడీవో సుందర్, రైతులు, సెర్ప్ సిబ్బంది పాల్గొన్నారు.
కామునిపల్లిలో డంపింగ్ యార్డు పరిశీలన..
కులకచర్ల మండల పరిధిలోని కామునిపల్లిలో నిర్మిస్తున్న డంపింగ్ యార్డు, వైకుంఠధామం నిర్మాణం పనులను కలెక్టర్ పరిశీలించారు. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున బేసిమెంట్ పనులు పూర్తిచేయాలన్నారు. మెదటి విడుత బిల్లులు చెల్లించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు.