ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాలకు ఉద్యోగుల క్షీరాభిషేకం
స్వీట్లు పంచుకుని సంతోషం వ్యక్తం చేసిన ఉపాధ్యాయులు
ఇబ్రహీంపట్నం/ ఇబ్రహీంపట్నంరూరల్, మార్చి 22: సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటను సోమవారం అసెంబ్లీ సాక్షిగా నిలబెట్టుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు 30 శాతం పీఆర్సీతోపాటు పదవీ విరమణ వయో పరిమితి పెంపుపై ఉద్యోగుల హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పీఆర్సీ ప్రకటించడంతో ఇబ్రహీంపట్నం ఎంఈవో కార్యాలయంలో పీఆర్టీయూ మండల అధ్యక్షుడు వర్కాల పరమేశ్ ఆధ్వర్యంలో సీఎం చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులతో కలిసి మున్సిపల్ చైర్పర్సన్ స్రవంతి, వైస్చైర్మన్ ఆకుల యాదగిరి, సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి స్వీట్లు పంచుకున్నారు.
సీఎం కేసీఆర్ ఉద్యోగుల పక్షపాతి
ఆదిబట్ల, మార్చి 22: సీఎం కేసీఆర్ ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు పీఆర్సీని ప్రకటించడంతో సోమవారం ఉపాధ్యాయ సంఘల నేతలు సంబురాలు జరుపుకొన్నారు. ఆదిబట్ల మున్సిపాలిటీలోని పీఆర్టీయూ సంఘం ఆధ్వర్యంలో ఆదిబట్ల మున్సిపాలిటీ కార్యాలయంలో ఉపాధ్యాయులు పటాకులు కాల్చి, స్వీట్లు పంచుకుని సంబురాలు జరుపుకొన్నారు. ఈసందర్భంగా పీఆర్టీయూ రాష్ట్ర నాయకుడు గోవర్ధన్, ఇబ్రహీంపట్నం పీఆర్టీయూ అధ్యక్షుడు వర్కాల పరమేశ్ మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులకు 30 శాతం ఫిట్మెంట్ ఇచ్చి ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. సీఎం కేసీఆర్ ఉద్యోగుల పక్షపాతిగా పనిచేస్తున్నారన్నారు. కీలక నిర్ణయాలు తీసుకుని బంగారు బాటలు వేస్తున్నారన్నారు.
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం
సీఎం కేసీఆర్ ఉద్యోగులకు పీఆర్సీని ప్రకటించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. 30 శాతం పీఆర్సీని ప్రకటించడం సంతోషంగా ఉంది. పీఆర్సీ కోసం ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్నాం. పీఆర్సీని ప్రకటించిన సీఎంకు కృతజ్ఞతలు
-గోవర్ధన్, హెచ్ఎం, ఎంపీపటేల్గూడ, ఆదిబట్ల