ఆమనగల్లులో మినీ స్టేడియం నిర్మాణానికి కృషి
రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్రెడ్డి
ఆమనగల్లు/కడ్తాల్, ఏప్రిల్3: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభ గల క్రీడాకారులను గుర్తించి వారికి చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. ఆమనగల్లులోని వాసవీ ఫంక్షన్ హాల్లో సేవ్ ఎన్విరాన్మెంట్, సేవ్ పబ్లిక్ స్కూల్ సంస్థ సహకారంతో నిర్వహించిన అండర్-17 వాలీబాల్ పోటీలు శనివారం ముగిశాయి. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ప్రతిభ కలిగిన విద్యార్థులను ప్రొత్సహించి వారిని రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా వారికి చేయూత అందజేస్తున్నట్లు తెలిపారు. ఆమనగల్లులో క్రీడాకారుల సమస్యలను పరిష్కరించేందుకు పట్టణంలో మినీ స్టేడియం ఏర్పాటు చేసేందుకు తనవంతు సహకారం అందజేస్తానని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించేందుకు స్వచ్ఛంద సంస్థలు సహకారం అందించడం అభినందించదగ్గ విషయమని అన్నారు. పోటీల్లో భాగంగా కడ్తాల మండలంలోని బాలుర జడ్పీహెచ్ఎస్, బాలికల విభాగంలో తలకొండపల్లి మండలంలోని చంద్రధన పాఠశాలకు చెందిన విద్యార్థులు ప్రథమ బహుమతి సాధించారు. పోటీలకు ఆమనగల్లు బ్లాక్ మండలాల నుంచి పలువురు విద్యార్థులు తరలివచ్చారు. కార్యక్రమంలో శృతిలయ కల్చరల్ అకాడమీ సంస్థ నిర్వాహకుడు చిత్తరంజన్దాస్, విజయ్, అభినవ్, లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షుడు పాపిశెట్టి రాము పాల్గొన్నారు.