పూడూరు, సెప్టెంబర్ 22 : గో సేవయే గోవిందుడి సేవ, మానవ సేవయే మాధవ సేవ, వృక్షో రక్షతి రక్షితః అనే నినాదంతో గోవులు, వృక్షాల సంరక్షణ కోసం సంరక్షకులకు పెన్షన్ డబ్బులు అందజేసేందుకు హైదరాబాద్లోని లింగంపల్లి ప్రాంతంలోని ఓం అమృతాంగమయ ఎన్విరాన్ మెంట్ చారిటబుల్ ట్రస్టు ముందుకొచ్చింది. సర్వదేవతా స్వరూపంగా ఆరాధిస్తూ, మన జాతి సంపదగా గోమాతను భావిస్తారు. ఎక్కడైతే గోమాత ఉంటుందో అక్కడ సకల సంపద కలిగి ఉంటుందనే నమ్మకం ఉంది. దేశంలోనే ఎక్కడాలేని విధానాన్ని ఆలోచన చేసి ఒక్కొక్క గోమాత రక్షకులకు ప్రతి నెల రూ. 500లు, వృక్షాలను కాపాడేవారికి (ఒక్కొక్క పురాతనమైన చెట్టుకు) నెలకు రూ.100 చొప్పున ప్రతి సంవత్సరం రూ.1200లు పెన్షన్ పథకం ద్వారా ఈ ట్రస్టు సభ్యులు సంరక్షకులకు అందజేయనున్నారు. పూడూరు గ్రామంలోని 20 గోవులు, దామగుండం దేవాలయంలోని పురాతనమైన 25 పెద్ద వృక్షాలకు పెన్షన్ ఇవ్వనున్నారు. రైతులు వయస్సు పైబడిన గోవులను వధశాలకు తరలించకుండా, మృతి చెందేవరకు సంరక్షించి, అనంతరం అంత్యక్రియలు చేస్తే ఆ రైతుకు ట్రస్టు ద్వారా రూ.35 వేలు అందజేయనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. మొదటగా పూడూరు మండల కేంద్ర సమీపంలోని దామగుండం రామలింగేశ్వరస్వామి దేవాలయ అటవీ ప్రాంతంలో వృక్షా ల సంరక్షణ, పూడూరు గ్రామంలోని గో పాలకులకు గోమాత పెన్షన్తో పాటు ఇన్సూరెన్స్ పథకాన్ని ట్రస్టు సభ్యుల ఆధ్వర్యంలో ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే కె.మహేశ్రెడ్డి ప్రారంభించారు. జీవరాశి మనుగడకు మూలమైన పర్యావరణ సమతుల్యతకు కారణమైన వృక్షాలను నరికివేయకుండా కాపాడేందుకు ట్రస్టు కృషి చేస్తున్నది. ఈ ప్రాంతంలో సుమారుగా 2,900 ఎకరాల భూమిలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న నేవి రాడార్ కేంద్రంతో రేడియేషన్ ద్వారా ప్రాణాపాయం ఉంటుందని, ఆ పనులను ప్రారంభించకుండా అడ్డుకునేలాప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. దామగుండం అటవీ ప్రాంతంలో ఉన్న ఆయుర్వేద ఔషధ మొక్కలతో పాటుగా ఔషధ మొక్కల ఉద్యానవనం ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దామగుండం అటవీ ప్రాంతం లో జంతువులు, పక్షులకు ఆహారం అందించే పలు రకాల పండ్ల, ఆయుర్వేద మొక్కలను నాటించారు. వృక్ష, గోమాత సంరక్షణ కోసం ట్రస్టు చైర్మన్ సత్యానందస్వామి అన్ని విధాలా కృషి చేస్తున్నారు.
పెన్షన్ విధానం అభినందనీయం
దేశంలోనే ఎక్కడా లేని విధంగా స్వచ్ఛంద సంస్థ గోమాత, వృక్షాల సంరక్షణకు ముందుకు రావడం సంతోషమైన విషయం. దామగుండం అటవీలో ఎన్నో యేండ్ల నాటి వృక్షాలు ఉన్నాయి. ట్రస్టు వారు ముందుకొచ్చి పెన్షన్ ఇవ్వడంతో రైతుల్లో నూతన ఉత్తేజం నెలకొంది. దామగుండం రామలింగేశ్వరస్వామి దేవాలయం ఎంతో పురాతనమైంది. ఈ ప్రాంతాన్ని ప్రభుత్వం పర్యాటక కేంద్రంగా గుర్తించి అభివృద్ధి చేయాలి.
నవ్యానర్సింహారెడ్డి, సర్పంచ్ పూడూరు గోమాతను వధకు తరలించొద్దు
రైతులు గోమాతలను వధకు తరలించకుండా రక్షించేందుకు మా ట్రస్టు ద్వారా కృషి చేస్తున్నాం. దామగుండం అటవీ ప్రాంతంలో అనేక ఆ యుర్వేద, ఔషధ మూలికలు ఉన్నాయి. గోవులను పోషించిన వ్యక్తులకు ట్రస్టు ద్వారా నెలకు రూ.500లు అందజేస్తున్నాం. గోమాత మృతి చెందిన తర్వాత అంత్యక్రియలు చేస్తే రూ.35 వేలు రైతుకు అందజేస్తాం. దామగుండం అటవీ ప్రాంతం లో నేవీ రాడార్ కేంద్రం ఏర్పాటు చేయకుండా ప్రజాప్రతినిధులు కృషి చేయాలి.
సత్యానందస్వామి ట్రస్ట్ చైర్మన్, దామగుండం దేవాలయం, పూడూరు