రంగారెడ్డి, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ) : సదరం క్యాంపులకు వచ్చే దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించొద్దని.. వారికి సంబంధించి తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ అమయ్ కుమార్ అదేశించారని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి పి.ప్రభాకర్ తెలియజేశారు. కలెక్టర్ ఆదేశాల ప్రకారం, అక్టోబర్ నుంచి డిసెంబర్ 2022 వరకు అంటే మూడు నెలలకు సంబంధించిన సదరం క్యాంపులు నిర్వహించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఆన్లైన్ సదరం బుకింగ్ స్లాట్లు విడుదల చేసినట్లు తెలిపారు. దివ్యాంగులు వికలాంగత్వ నిర్ధారణ పరీక్షల కోసం మీ సేవ ద్వారా స్లాట్ బుక్ చేసుకొని, నిర్ణయించిన తేదీల్లో కొండాపూర్ జిల్లా దవాఖాన, వనస్థలిపురం ఏరియా దవాఖానలో జరుగు సదరం క్యాంపులకు హాజరు కావాలని తెలిపారు. ఈ పరీక్షల కోసం కొత్తగా వచ్చేవారు, పరిమిత కాలానికి సదరం సర్టిఫికెట్ కలిగి ఉండి రెన్యువల్ కోసం రావాలనుకున్నవారు మీ సేవ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలన్నారు. స్లాట్ బుక్ చేసుకున్న దరఖాస్తుదారులకు మాత్రమే సదరం క్యాంపు నందు, అర్హత కలిగిన వారికి మాత్రమే సంబంధిత డాక్టర్ పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించనున్నారని పేర్కొన్నారు. క్యాంపు నిర్వహించే రోజు కేవలం రంగారెడ్డి జిల్లాకు చెందినవారు మాత్రమే అర్హులుగా పేర్కొన్నారు.
కొండాపూర్ జిల్లా దవాఖానలో ఈ నెల 11, 18, నవంబర్ 1, 15, 22, 29, డిసెంబర్ 6, 13, 20, 27 తేదీల్లో శారీరక వికలాంగత్వం – 300, అంధత్వం – 125, వినికిడి లోపం – 125, మానసిక, బుద్ధిమాంద్యం – 125 స్లాట్స్ అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. వనస్థలిపురం ఏరియా దవాఖాలో ఈ నెల 14, 21, 28, నవంబర్ 4, 11, 18, 25, డిసెంబర్ 2, 16, 23, 30 తేదీల్లో శారీరక వికలాంగత్వానికి 385 స్లాట్స్ అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు.
ఇందుకు సంబంధించి అర్హులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి పేర్కొన్నారు. దరఖాస్తుదారులకు సంబంధిత డాక్టర్ బృందం పరీక్షలు నిర్వహించి వికలాంగత్వ శాతాన్ని నిర్ధారణ చేసిన తర్వాతే సదరం సర్టిఫికెట్ ఇవ్వనున్నట్లు తెలియజేశారు. మీ సేవలో బుకింగ్ చేసుకున్న స్లిప్ నిర్ధారించిన తేదీలో వారికి సంబంధించిన ధ్రువపత్రాలతో (ఆధార్ కార్డు, ఫొటో, రేషన్ కార్డు, ఓటర్ కార్డు), అలాగే వినికిడి లోపం గలవారు ప్రభుత్వ ఈఎన్టీ – హైదరాబాద్ వారి బెరా సర్టిఫికెట్, సంబంధిత డాక్టర్ రిపోర్ట్, అంధత్వం గలవారు సరోజినీదేవి కంటి దవాఖాన నుంచి టెస్ట్ రిపోర్ట్స్, బుద్ధిమాంద్యం, మానసిక వికలాంగులు ఎన్ఐఎంహెచ్ బోయిన్పల్లి, సికింద్రాబాద్, మెంటల్ హాస్పిటల్ ఎర్రగడ్డలో రిపోర్ట్స్ తీసుకొని సదరం క్యాంపులకు హాజరు కావాలని డీఆర్డీవో సూచించారు.