ఉమ్మడి జిల్లాలోని ప్రైవేట్ దవాఖానల్లో అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. అనుమతుల్లేకుండా, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లాలో 17 దవాఖానలకు షోకాజ్ నోటీసులు ఇవ్వడంతోపాటు ఏడు ఆస్పత్రులను సీజ్ చేశారు. అలాగే వికారాబాద్ జిల్లాలో పదకొండింటికి నోటీసులు ఇవ్వగా, నాలుగింటిని సీజ్ చేశారు. తనిఖీల సమాచారం అందడంతో చాలా క్లినిక్లు మూసివేసినట్లు అధికారులు తెలిపారు.
రంగారెడ్డి, సెప్టెంబర్ 23, (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లాలో అనుమతుల్లేకుండా, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు షురూ అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో శుక్రవారం జిల్లా అంతటా ప్రత్యేక వైద్య బృందాలతో ప్రైవేట్ దవాఖానల్లో తనిఖీలు చేశారు. వైద్యాధికారులు తనిఖీలు చేస్తారనే సమాచారంతో జిల్లాలోని చాలా క్లినిక్లు, నర్సింగ్ హోంలు, డయాగ్నోస్టిక్ కేంద్రాలను మూసివేసినట్లు తనిఖీ అధికారులు గుర్తించారు. జిల్లాలోని చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, షాద్నగర్ డివిజన్లలో ప్రత్యేక వైద్య బృందాలు ప్రైవేట్ దవాఖానలను తనిఖీ చేశారు. మొదటి రోజు జిల్లావ్యాప్తంగా 13 ప్రత్యేక వైద్య బృందాలు తనిఖీలు చేపట్టి ఎలాంటి అనుమతిలేని, గుర్తింపులేని, అర్హతలేని వైద్యులతో నిర్వహిస్తున్న 7 ఆస్పత్రులను సీజ్ చేయడంతోపాటు నిర్వహణ లోపం కారణంగా 17 దవాఖానలకు షోకాజు నోటీసులు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు జారీ చేశారు.
జిల్లాలో గుర్తింపులేని, అర్హతలేని వైద్యులతో కొనసాగుతున్న పలు ప్రైవేట్ ఆస్పత్రులపై జిల్లా వైద్యారోగ్య శాఖ చర్యలు చేపట్టింది. జిల్లాలో 7 దవాఖానలను సీజ్ చేశారు. సీజ్ చేసిన ప్రైవేట్ ఆస్పత్రుల్లో అత్యధికంగా ఇబ్రహీంపట్నం డివిజన్లో ఆరు దవాఖానలున్నాయి. జిల్లా వైద్యారోగ్య శాఖ బృందాలు సీజ్ చేసిన ఆస్పత్రుల్లో చేవెళ్లలో అర్హతలేని వైద్యుడు, నిర్వహణ లోపాలున్న కారణంతో ప్రజా వైద్యశాలను, మంచాల మండలం నోముల గ్రామంలో ఎలాంటి గుర్తింపు లేని తిరుమల క్లినిక్, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలో గుర్తింపులేని, అర్హతలేని వైద్యులతో నిర్వహిస్తున్న సాయి డెంటల్ క్లినిక్, నర్మద ఫస్ట్ ఎయిడ్ సెంటర్, ఆర్ఆర్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్, రాయ్ క్లినిక్, చైతన్య ఆస్పత్రులను సీజ్ చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా, నిర్వహణ లోపం కారణంగా రాజేంద్రనగర్ డివిజన్లోని శ్రీశ్రీనివాస, ప్రాణమ్, శ్రీకర్, హోప్వెల్ మెటర్నిటీ, సాయి అనురాగ్, లక్ష్మి, శ్రేయా, డిమ్స్, ధనుష్ దవాఖాలతోపాటు కడిమి నర్సింగ్ హోం, సిటీ నర్సింగ్ హోంలకు షోకాజు నోటీసులు జారీ చేశారు. ఇబ్రహీంపట్నం డివిజన్లో సేవా క్లినిక్, వరుణ్ ఆస్పత్రి, రవికృష్ణ చిల్డ్రన్స్ దవాఖాన, జై డాక్టర్ క్లినిక్, అరుణ ఆస్పత్రులకు, షాద్నగర్ పట్టణంలోని రవి దవాఖాన, మహబోధి డయాగ్నోస్టిక్ కేంద్రాలకు సరైన అనుమతులు లేకపోవడంతోపాటు నిర్వహణ లోపం కారణంగా షోకాజు నోటీసులు జారీ చేశారు. జిల్లా వైద్యారోగ్య శాఖ జారీ చేసిన షోకాజు నోటీసులకు వారం రోజుల్లో నిర్వహణ లోపాలకు సంబంధించి సరైన వివరణ ఇవ్వకపోతే వైద్యారోగ్యశాఖ అధికారులు చర్యలు తీసుకోనున్నారు.
ఇబ్రహీంపట్నం/తుర్కయాంజాల్ : డిప్యూటీ డీఎంహెచ్వో నాగజ్యోతి ఆధ్వర్యంలో తుర్కయాంజాల్ మున్సిపాలిటీలో.. ఎలిమినేడు, మంచాల వైద్యాధికారుల ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం, మంచాలలో పలు ప్రైవేట్ దవాఖానాలపై తనిఖీలు నిర్వహించారు. తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని కమ్మగూడలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న రాజర్షి క్లినిక్ను జిల్లా వైద్యాధికారి ఆదేశాల మేరకు ఆమె సిబ్బందితో కలిసి సీజ్ చేశారు. అనుభవం లేని డాక్టర్లు అబార్షన్లు సైతం నిర్వహిస్తున్నట్లు విచారణలో బయటపడుతున్నాయి. ఇబ్రహీంపట్నానికి చెందిన ఓ ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యం ఏకంగా తనిఖీ చేస్తున్న వైద్యబృందాలతోనే వాగ్వాదానికి దిగి వారిని భయపట్టించేందుకు ప్రయత్నించారు. దీన్ని సీరియస్గా తీసుకున్న తనిఖీ బృందం వెంటనే ఆస్పత్రిని సీజ్ చేశారు. మరో నాలుగు రోజులు తనిఖీలు నిర్వహిస్తామని డిప్యూటీ డీఎంహెచ్వో నాగజ్యోతి తెలిపారు.
చేవెళ్లటౌన్ : ఆస్పత్రిలో ఉన్న లోపాలను సరిచేసుకునేవరకు చేవెళ్లలోని ప్రజా వైద్యశాలను సీజ్ చేస్తున్నట్లు డిప్యూటీ డీఎంహెచ్వో దామోదర్ తెలిపారు.
షాద్నగర్ : ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రైవేట్ దవాఖానలను నిర్వహించకుంటే శాఖాపరమైన కఠిన చర్యలుంటాయని అసిస్టెంట్ డీఎంఅండ్హెచ్వో డాక్టర్ జయలక్ష్మి హెచ్చరించారు.