షాద్నగర్, సెప్టెంబర్ 25 : పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు క్రీడల్లో రాణించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించాలని మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. ఆదివారం ఫరూఖ్నగర్ మండలం కమ్మదనం గ్రామంలో సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో జోనల్ స్థాయి క్రీడా పోటీలను గురుకుల సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి రొనాల్డ్ రోస్తో కలిసి ప్రారంభించారు. నేటి తరం విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా ముఖ్యమేనన్నారు. పాఠశాల స్థాయిలోనే బాలికలు ఖోఖో, వాలీబాల్, కబడ్డీ తదితర క్రీడల్లో రాణించడం అభినందనీయమన్నారు. రానున్న రోజుల్లో గొప్ప క్రీడాకారులుగా ఎదగాలని ఆకాంక్షించారు. అదేవిధంగా గురుకుల సంక్షేమ శాఖ కార్యదర్శి రొనాల్డ్ రోస్ మాట్లాడుతూ క్రీడా ప్రతిభను బయటి ప్రపంచానికి పరిచయం చేసేందుకు క్రీడా పోటీలను నిర్వహించి ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. జోనల్లతో పాటు డివిజన్, రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు కూడా త్వరలో ఉంటాయన్నారు. పోటీల ప్రారంభోత్సవాల్లో భాగంగా విద్యార్థినులు చేసిన నృత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి. పలువురి విద్యార్థినులకు జ్ఞాపికలు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో ఎంపీపీ ఖాజా ఇద్రీస్, జడ్పీటీసీ పి. వెంకట్రాంరెడ్డి, మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ నటరాజన్, పాఠశాల ప్రిన్సిపాల్ లత, పీడీలు, పీఈటీలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
అబ్దుల్లాపూర్మెట్, సెప్టెంబర్ 25 : మండలంలోని బ్రిలియంట్ ఇంజినీరింగ్ కళాశాలలో ప్రభుత్వ గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో గిరిజన ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల అండర్ 14, 17 విద్యార్థులకు మూడు రోజులుగా జరుగుతున్న క్రీడలు ఆదివారం ముగిశాయి. గెలుపొందిన విద్యార్థులకు మెరిట్ సర్టిఫికెట్లు, బహుమతులను హైదరాబాద్ గిరిజన అభివృద్ధి అధికారి కేఈ రామేశ్వరీదేవి ముఖ్య అతిథిగా హాజరై అందజేశారు. రాష్ట్రంలోని 9 జిల్లాల నుంచి 835 మంది గిరిజన క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు. క్రీడల్లో ఎంపికైన విద్యార్థులు వరంగల్ జిల్లా ఏటూరు నాగారంలో జరిగే రాష్ట్రస్థాయి క్రీడల్లో రాణించాలన్నారు. కార్యక్రమంలో స్పోర్ట్స్ ఆఫీసర్ బి జ్యోతి, పాఠశాలల ఉపాధ్యాయులు, సంక్షేమశాఖ అధికారులు, పీఈటీలు తదితరులు ఉన్నారు.
షాద్నగర్ : షాద్నగర్ మున్సిపాలిటీలో ప్రజలకు అవసరమయ్యే సకల సదుపాయాలను కల్పించేందుకు కృషి చేస్తామని ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. ఆదివారం షాద్నగర్ పట్టణంలోని ఎన్జీవో కాలనీలో రూ. 10 లక్షల నిధులతో పార్కు అభివృద్ధి, రూ. 5 లక్షలతో అంతర్గత మురుగు కాలువ నిర్మాణ పనులను ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టణాల అభివృద్ధి కోసం పట్టణ ప్రగతి చేపట్టిందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరేందర్, కౌన్సిలర్ ప్రతాప్రెడ్డి, నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.