అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి పనులతో గ్రామాల రూపురేఖలు మారాయి. ఒకప్పుడు వేరు.. ప్రస్తుతం వేరు అన్న విధంగా గ్రామాలు అభివృద్ధిపథంలో దూసుకుపోతున్నాయి. గతంలో పేరుకుపోయిన సమస్యలు పూర్తిగా తొలగిపోయాయి. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తూ అభివృద్ధిలో దూసుకెళ్తూ ఆదర్శంగా నిలుస్తున్నది రేగడి ఘనాపూర్ గ్రామం.
గ్రామంలో 1913 జనాభా ఉండగా 1244 మంది ఓటర్లు ఉన్నారు. ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి పనులు వైకుంఠధామం, నర్సరీ, పల్లె ప్రకృతి వనం, చెత్త డంపింగ్ యార్డు పనులు పూర్తయ్యాయి. పారిశుధ్య పనులు సక్రమంగా నిర్వహించి, మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నారు. చెత్తను డంపింగ్ యార్డుకు తరలించి తడి, పొడి చెత్తను వేరు చేసి ఎరువులను తయారు చేస్తున్నారు.
ఆహ్లాదంగా హరితహారం మొక్కలు
గ్రామంలో ఏ వీధి చూసినా సీసీ రోడ్లతో అందంగా కనిపిస్తున్నది. రోడ్లకిరువైపులా హరితహారంలో నాటిన మొక్కలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. గ్రామంలో నీటి సమస్య లేకుండా నిరంతరాయంగా మిషన్ భగీరథ నీరు సరఫరా చేస్తున్నాయి. పారిశుధ్య నిర్వహణలో పంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్ ప్రత్యేక చొరవ తీసుకొని కృషి చేస్తున్నారు.
ఆదర్శంగా తీర్చిదిద్దుతా..
గ్రామ అభివృద్ధిలో ముందస్తు ప్రణాళికలు రచించి ముందుకు సాగడంతోనే అభివృద్ధి సాధ్యమైంది. పల్లె ప్రగతి పనులతో గ్రామాలు అందంగా ముస్తాబయ్యాయి. గతంలోని సమస్యలన్నీ పరిష్కారమయ్యాయి. గ్రామస్తులు, ప్రజా ప్రతినిధుల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేశాం. మున్ముందు ప్రభుత్వ సహకారంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా.
-రాయికంటి నర్సింహులు, సర్పంచ్
పెండింగ్ సమస్యలు పూర్తి ..
పల్లె ప్రగతి పనులతో గతంలో పేరుకుపోయిన సమస్యలు పరిష్కరించబడ్డాయి. గ్రామంలో పారిశుధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. హరితహారం మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నాం. ఇంటింటికీ చెత్త సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నాం.