ఇబ్రహీంపట్నంరూరల్, సెప్టెంబర్ 23: సీతాఫలం.. పుష్కలమైన పోషకాలకు నిలయం. పేదోడి ఆపిల్గా కూడా పిలుస్తుంటారు. ఈ పండు తియ్యదనంతోపాటు పేదల జీవితాల్లో ఉపాధి కల్పించే ప్రకృతి వర ప్రసాదమవుతున్నది. సీజన్లో మాత్రమే కాసే ఈ సీతాఫలాలు అందరికీ అందుబాటులో లభిస్తాయి. గుట్టలు, కొండలు, పెరటి చెట్లుగా కూడా ఇవి పెరుగుతుంటాయి. ఈసారి వానలు బాగానే కురువడంతో ఈ చెట్లు ఎక్కడబడితే అక్కడ విరివిగా పెరిగాయి.
పల్లెల్లో సీతల్పండు
సీతాఫలాన్ని తెలంగాణ గ్రామాల్లో సీతల్పండు అని పిలుస్తారు. శాస్త్రీయంగా సీతాఫల చెట్టు ‘అనోనాసియా’ అనే కుటుంబానికి చెందింది. ఇందులో ప్రపంచ వ్యాప్తంగా రెండు వేలకుపైగా రకాలున్నాయి. చెట్టుకు పూచే పూలన్నీ కాయలుగా కాసే ఏకైక చెట్టు. అవి ఎదిగి పక్వానికి రావడానికి సుమారు ఇరవై ఐదు వారాల సమయం పడుతుంది. కాయ పండు అయ్యాక గుజ్జు ఏర్పడి ఒక్కో గింజ చుట్టూ విడివిడిగా అది అత్తుకునిపోతుంది. పండులోని గింజల సంఖ్యలను బట్టి దాని చర్మంపై గుండ్రని భాగాలుంటాయి. సీత్పలకాయలను తెంపి, తీసుకొచ్చి మక్కబెడుతారు. అవి పండుగా మారిన తరువాత తినటం, అమ్మటం జరుగుతుంది. గ్రామాల్లో అడవులు, గుట్టలు, కొండలకు వెళ్లి పెద్దఎత్తున ఈ కాయలు సేకరించి, వాటిని ఆకుల్లో కమ్మేసి కొద్దిరోజుల్లో వాటిని మాగేలా చేస్తారు. అలా మాగిన తర్వాత వాటిని మార్కెట్లో అమ్మకానికి తీసుకొస్తారు. మరికొందరు సీత్పలకాయలను కాల్చి, అందులోని గుజ్జును తినడానికి ఇష్టపడుతుంటారు.
ఉపాధి పొందుతున్న గ్రామీణులు
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఈ ఏడాది అనుకున్న స్థాయిలో వర్షాలు కురువడంతో అటవీప్రాంతాలు, గుట్టలు పూర్తిగా పచ్చదనంతో నిండిపోయాయి. దీంతో ఎక్కడ చూసినా సీతాఫలాలు విరివిగా కాశాయి. నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో కొండలు, గుట్టలు ఉండడంతో ఈ కాయలు విరివిగా కాశాయి. ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం మండలాల్లో సీతాఫలాలు ఈ ఏడాది పుష్కలంగా కాసాయి. దీంతో సమీప గ్రామాల వారు వాటిని తెంపుకొని తీసుకొచ్చి, మాగబెట్టి, వాహనాల ద్వారా నగరానికి తరలిస్తున్నారు. అటవీ ప్రాంతాల్లో ప్రత్యేకంగా సీతాఫల చెట్లకు కాపలా ఉండి, వచ్చిన పండ్లను నగరానికి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.
సీజన్లో డిమాండ్ ఎక్కువ
ఈ సీజన్లో సీతాఫలాలకు అధిక డిమాండ్ ఉంటుంది. సీతా ఫలాల బుట్టకు రూ.300 నుంచి రూ.400ల వరకు మార్కెట్లో విక్రయిస్తున్నారు. సీతాఫలాల విక్రయానికి సాగర్ రహదారి కేరాఫ్గా మారింది. హైదరాబాద్ నుంచి సాగర్వైపు, సాగర్ నుంచి నగరం వైపు రాకపోకలు సాగించే ప్రయాణికులు పెద్దఎత్తున పండ్లు కొనుగోలు చేస్తుంటారు. దీంతో యాచారం నుంచి ఇబ్రహీంపట్నం వరకు ఇబ్రహీంపట్నం నుంచి బీఎన్రెడ్డి వరకు పెద్ద ఎత్తున కొందరు సీతాఫలాలు విక్రయించి జీవనోపాధి పొందుతున్నారు.
వానలు పడటంతో బాగా కాశాయి
వర్షాలు సమృద్ధిగా కురువడంతో సీతాఫలాలు ఈసారి బాగా కాశాయి. అడవిలో ఉన్న చెట్లకు విరివిగా కాయలు వచ్చాయి. సీతాఫలాలు ఎక్కువగా దొరుకుతుండటంతో వాటిని తెంపుకొని, మాగబెట్టి నగరానికి తరలించి, ఉపాధి పొందుతున్నాం. నగరంలోని మార్కెట్లో సీతాఫలాలు బుట్టకు రూ.300ల నుంచి రూ.400ల వరకు విక్రయిస్తున్నాం.
బుట్టి సత్తయ్య, ఎలిమినేడు
పండ్లమ్మి కుటుంబం నడిపిస్తున్నా..
ఈ ఏడు వానలు మంచిగా కురిసి, సీతల్పండ్లు బాగా కాసినయి. ప్రతిరోజు ఐదారు వందల వరకు సీతల్పండ్లు అమ్ముకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నా. సాగర్ రోడ్డు పక్కనే పొలం పట్టుకుని, కాసిన పండ్లు అమ్ముకుంటాం. మా భర్త నగరానికి సీతల్పండ్లు తీసుకుపోయి అమ్ముకొస్తుండు. ఈ ఏడు మంచిగా పండ్లు వచ్చినవి. నాలుగు పైసలు కనబడుతున్నవి.
పెంటమ్మ, ఇబ్రహీంపట్నం