కోట్పల్లి, సెప్టెంబర్22: గ్రామాల్లో పరిశుభ్రత, పారిశుధ్యం, పచ్చదనంపై దృష్టి పెట్టడంతోపాటు మౌలిక వసతులు కల్పించి, అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. దీం తో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయి. అదేబాటలో మోత్కుపల్లి గ్రామం కూడా అభివృద్ధిలో దూసుకెళ్తున్నది. పరిశుభ్రత, పచ్చదనంలో పరుగులు తీస్తున్నది. పల్లె ప్రగతిలో భాగంగా పంచాయతీ ట్రాక్టర్తో ఇంటింటికీ తిరిగి తడి, పొడి చెత్త సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసి అందులో వాకింగ్ ట్రాక్లు, పచ్చని చెట్లతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నెలకొల్పేందుకు శ్రద్ధ తీసుకుంటున్నారు. గ్రామంలోని రోడ్లకు ఇరువైపులా పచ్చని చెట్లు అందంగా కనిపిస్తున్నాయి.
అభివృద్ధిలో పరుగులు
మండలంలోని మోత్కుపల్లి గ్రామంలో ప్రభు త్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. గ్రామంలో మొత్తం 560 ఇండ్లు, 620 కుటుంబాలు, 3500 జనాభా ఉంది. పరిశుభ్రత, పారిశుధ్యం, పచ్చదనం వంటి ప్రగ తి కార్యక్రమాలపై దృష్టి పెట్టి అభివృద్ధి వైపు దూసుకెళ్తున్నారు. గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీని ఏర్పాటు చేశారు. సీసీ రోడ్లు, నూరుశాతం మరుగుదొడ్ల నిర్మా ణం పూర్తిచేశారు. గ్రామంలో ని రోడ్లకు ఇరువైపులా మొక్క లు నాటి, టీగార్డులు ఏర్పాటు చేసి సంరక్షిస్తున్నారు.
రూ.1.29కోట్లతో ప్రగతి పనులు
గ్రామంలో మొత్తం రూ.1.29 కోట్ల తో అభివృద్ధి పనులు నిర్వహించా రు. జడ్పీ, ఎమ్మెల్యే, ఎంపీ, జీపీ నిధులు రూ.41 లక్షలతో సీసీ రోడ్లు, రూ.2లక్షలతో ఫార్మేషన్ రోడ్లు, రూ.11 లక్షలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎన్ఆర్ఈజీఎస్ కింద రూ.3.50 లక్షలతో సీసీ రోడ్లు, రూ.16 లక్షల తో పంచాయతీ భవన నిర్మాణం, రూ.2.50 లక్షలతో డంపింగ్ యార్డు, రూ.4లక్షలతో పల్లె ప్రకృతి వనం, రూ.11లక్షలతో వైకుంఠధా మం, రూ.9.53 లక్షలతో ట్రాక్టర్, ట్రాలీ కొ నుగోలు, రూ.12 లక్షలతో మట్టి పను లు, రూ.2లక్షలతో బోర్ తవ్వకం, రూ.లక్షతో విద్యుత్ స్తంభాల ఏర్పాటు, రూ.4లక్షలతో విద్యుత్ బల్బులు, రూ.10 లక్షలు దాత సాయంతో మరో ఫార్మేషన్ రోడ్డు పనులు చేయించారు.
ప్రకృతి వనంపై ప్రత్యేక దృష్టి
ప్రభుత్వ భూమి ఎకరం స్థలంలో పల్లె ప్రకృతి వనం ఏర్పాటుచేశారు. ఇందులో వివిధ రకాలైన 2 వేల మొక్కలు నాటారు. టేకు, చింత, జామ, నీలగిరి, దానిమ్మ, ఉసిరి, చైనాబాదాం, మందారం, కాగి, కానుగ, మొక్కలు నాటి, సంరక్షిస్తున్నారు. ప్రకృతి వనంలో వాకింగ్ ట్రాక్ ఏర్పాటుచేశారు.
ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతా..
ప్రజల సహకారంతో గ్రామాన్ని ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నా. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ గ్రామంలోని సమస్యలను పరిష్కరించుకుంటున్నాం. పారిశుధ్యం, పచ్చదనం, పరిశుభ్రతపై ప్రత్యేకంగా దృష్టి సారించాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజీని ఏర్పాటు చేశాం. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక గ్రామంలోని సమస్యలు పూర్తిగా తొలగిపోయాయి. పరిశుభ్రమైన వాతావరణాన్ని ఏర్పరచుకున్నాం. ఎటుచూసినా పచ్చని చెట్లు, పరిశుభ్రతతో గ్రామం కళకళలాడుతున్నది.
పాండురంగారెడ్డి, సర్పంచ్, మోత్కుపల్లి
అందరి సహకారంతోనే అభివృద్ధి
గ్రామస్తులు, ప్రజాప్రతినిధుల సహకారంతో గ్రామంలో అభివృద్ధి పనులు చేస్తున్నాం. సమస్యలపై అందరితో చర్చించి, పరిష్కరిస్తున్నాం. పారిశుధ్యం, పచ్చదనంపై ప్రత్యేకంగా దృష్టి సారించాం. ఇంటింటికీ చెత్తబుట్టలు పంపిణీ చేశాం. చెత్త సేకరించి డంపింగ్ యార్డుకు తరలించి, ఎరువులు తయారు చేస్తున్నాం. ప్రజల సహకారంతో పంచాయతీని ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యంతో పని చేస్తున్నాం..
రాఘవేందర్, పంచాయతీ కార్యదర్శి, మోత్కుపల్లి