మర్పల్లి, అక్టోబర్ 20 : మర్పల్లి మార్కెట్ పచ్చదనంతో దర్శనమిస్తున్నది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న హరితహారం కార్యక్రమంలో భాగంగా పల్లెలతో పాటు మండలంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో పచ్చని చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పంచుతున్నాయి. మార్కెట్ కార్యాలయ ఆవరణలో మార్కెట్ అధికారులు, సిబ్బంది పూలు, పండ్లు, నీడనిచ్చే సుమారుగా 1300 వందల మొక్కలను గతంలో నాటడంతో అవి ఏపుగా పెరిగి నీడనిస్తున్నాయి. దీంతో పాటు 5 వందలకు పైగా మొక్కలను 7వ విడుత హరితహారం కార్యక్రమంలో నాటినట్లు అధికారులు తెలిపారు. ప్రతి మంగళవారం వ్యవసాయ మార్కెట్లో ధాన్యం అమ్ముకునేందుకు వచ్చిన రైతులు ఎండ తీవ్రత ఉన్న సమయంలో చెట్లకింద కూర్చొని సేదతీరుతున్నారు. మార్కెట్ సిబ్బంది మొక్కలను బాధ్యతగా సంరక్షిస్తున్నారు. మార్కెట్ కార్యాలయ ఆవరణలో నాటిన గన్నేరు, గులాబీ వివిధ రకాల పూల మొక్కలు ఏపుగా పెరిగి కార్యాలయంలో అందంగా కనిపిస్తున్నాయి.
పనులు బాగున్నాయి
ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా మార్కెట్ కార్యాలయం ఆవరణలో సుమారుగా గతంలో 1300 వందలు వివిధ రకాల మొక్కలు నాటాం. వాటికి ట్రీగార్డులు ఏర్పాటుచేశాం. మొక్కలు ఏపుగా పెరిగి మంచివాతావరణాన్ని అందిస్తున్నాయి. 7వ విడుత హరితహారంలో 5 వందలకు పైగా మొక్కలు నాటాం. సిబ్బంది ఎప్పటికప్పుడు మొక్కలకు నీరు పోసి రక్షిస్తున్నారు.
-దుర్గం చెరువు మల్లేశం, మార్కెట్ కమిటీ చైర్మన్ మర్పల్లి