షాబాద్, అక్టోబర్19: భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా.. ఈ ప్రాంత ప్రజలకు చిన్న తిరుపతిగా పేరుగాంచిన చేవెళ్ల లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవాలయం దినాదినాభివృద్ధి చెందుతున్నది. రెండెకరాల స్థలంలో నిర్మించిన ఈ దేవాలయం సుమారు 700 ఏండ్ల చరిత్ర గలది. ప్రతి ఏడాది దసరా, శివరాత్రి పండుగలకు పది రోజుల పాటు జాతర, బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. దేవాలయానికి సంబంధించి నాలుగు జిల్లాల్లోని 31 గ్రామాల్లో 277 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని కౌలుకు ఇచ్చి వచ్చే ఆదాయంతో దేవాలయాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారు. దాతల సహకారంతో దేవాలయ ఆవరణలోని పుష్కరిణిని అభివృద్ధి చేసి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయించారు. లక్ష్మీ వేంకటేశ్వస్వామిని దర్శించుకునేందుకు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అత్యధికంగా వస్తుంటారు.
700 ఏండ్ల చరిత్ర..
చేవెళ్ల మండల కేంద్రంలో ఉన్న లక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవాలయానికి 700 ఏండ్ల చరిత్ర ఉంది. భట్టు అనే అర్చకుడికి పక్కనే ఉన్న పుష్కరిణిలో వేంకటేశ్వస్వామి విగ్రహం దొరకడంతో వెంటనే ఇక్కడ ఆలయం నిర్మించాడు. ఒక రోజు అన్ని కులాల వారిని పిలిపించి సమావేశం ఏర్పాటు చేసి దేవాలయంలో ఒక్కొక్కరు ఒక పని చేయాలని నిర్ణయించుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతి ఏడాది జరిగే శివరాత్రి జాతర, దసరా ఉత్సవాల్లో నిర్వహణ బాధ్యతలు వారే చూసుకుంటున్నారు. దేవాలయంలో విగ్రహాలు, గోపురం ఏర్పాటుచేశారు. చిన్న తిరుపతిగా భావించే భక్తులు ఇక్కడికి వచ్చి కోనేరులో స్నానం చేసి రాత్రి ఇక్కడే భస చేసి, మరుసటి రోజు వెళ్లిపోతారు. దీంతో వారు కోరుకున్న కోరికలు తీరుతాయని నమ్మకం. ప్రతి ఏడాది శ్రావణమాసంలో చివరి ఆదివారం గంప జాతర నిర్వహిస్తారు.
అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నది
చిన్న తిరుపతిగా పేరుగాంచిన లక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవాలయం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నది. వందల ఏండ్ల చరిత్ర గల ఈ దేవాలయానికి నేటికీ ఆదరణ తగ్గలేదు. ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. శివరాత్రి, దసరా పండుగలకు జాతర, బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాం.