కులకచర్ల, అక్టోబర్ 19 : ప్రభుత్వం బ్యాంకింగ్ సేవలను గ్రామాల్లో అందుబాటులోకి తీసుకురావడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పాయి. ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రారంభించిన పల్లె సమగ్రసేవా కేంద్రాలతో గ్రామీణ ప్రజలకు బ్యాంకులకు వెళ్లే పాట్లు తప్పుతున్నాయి. తమ అవసరాల కోసం రోజుల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే బాధలు తీరుతున్నాయి. బ్యాంకింగ్ లావాదేవీలతో పాటు ప్రభుత్వానికి సంబంధించిన 60 రకాల సేవలు అందేవిధంగా ఈ పల్లె సమగ్రసేవ కేంద్రాలు పనిచేస్తున్నాయి. పల్లెల్లో ఏర్పాటు చేసిన సమగ్రసేవ కేంద్రాల్లో ముఖ్యంగా పంచాయతీరాజ్, రెవెన్యూ, బ్యాంకింగ్, ఫైనాన్స్తో పాటు మీసేవ కేంద్రాల్లో లభించే 60 రకాల సేవలను ఈ కేంద్రాల ద్వారా పొందవచ్చు. దీంతో దూర భారంతో పాటు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే కష్టం ప్రజలకు తప్పుతుంది. ఏ ఆర్థిక లావాదేవీలు నిర్వహించాలన్నా తప్పనిసరిగా బ్యాంకులకు వెళ్లే వారు. కానీ నేడు గ్రామాల్లో ఏర్పాటు చేసిన పల్లె సమగ్రసేవ కేంద్రాల వలన డబ్బుల కోసం బ్యాంకుల దగ్గరకు వెళ్లాల్సిన ఇబ్బంది చాలావరకు తగ్గాయి. తమకు అవసరమున్న మేరకు పల్లె సమగ్రసేవా కేంద్రాల నిర్వాహకులు డబ్బులు బ్యాంకుల దగ్గర నుంచి తీసుకువచ్చి వినియోగదారుల ఇబ్బందులు తీరుస్తున్నారు. మండలంలో పల్లె సమగ్రసేవా కేంద్రాలు సక్రమంగా నిర్వహిస్తున్న తీరును చూసి అంతారం గ్రామానికి చెందిన పల్లె సమగ్రసేవా కేంద్రానికి కలెక్టర్ గతంలో అవార్డును కూడా ప్రదానం చేశారు.
కేంద్రాల పనితీరు..
గ్రామంలో వృద్ధులు, దివ్యాంగులు, వితంతు పెన్షన్లను గ్రామంలోనే అందించడం, ఉపాధిహామీ కూలీలకు డబ్బులు చెల్లించడం, స్వయం సహాయక సంఘాల నుంచి పొదుపు నగదు, రుణాలను స్వీకరించి బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయడం, గ్రామస్తులకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడం లాంటి పనులు చేస్తారు. గ్రామంలో ఉండే ప్రజలు ప్రభుత్వ సేవల కోసం మండలానికి వెళ్లకుండా మీసేవా కేంద్రాల్లో లభించే 60 రకాల సేవలను గ్రామ స్థాయిలోనే అందిస్తారు. జనన, మరణ, కులం, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, భూమికి సంబంధించిన పహాణీ నకలు జారీ లాంటివి పల్లె సమగ్రసేవా కేంద్రాల ద్వారా గ్రామ స్థాయిలోనే పొందవచ్చు. కానీ ప్రస్తుతం ఆ పనులు ఇంకా పల్లె సమగ్ర సేవా కేంద్రాలకు అప్పగించలేదు.
మండలంలో 9 సెంటర్లు
ఉమ్మడి కులకచర్ల మండలంలో44 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 9 పల్లె సమగ్రసేవా కేంద్రాల లావాదేవీలు నిర్వహిస్తున్నారు. మండలంలో అంతారం, బండవెల్కిచర్ల, కుస్మసముద్రం, ఇప్పాయిపల్లి, తిర్మలాపూర్, ముజాహిద్పూర్, లింగంపల్లి, కులకచర్ల, సాల్వీడ్ గ్రామాల్లో పల్లె సమగ్రసేవ కేంద్రాలు కొనసాగుతున్నాయి. ఈ గ్రామాల్లో సమగ్రసేవా కేంద్రాలు సక్రమంగా కొనసాగితే ఇతర గ్రామాల్లో కూడా నిర్వహించేందుకు అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే గతంలో నెలకొల్పిన పల్లె సమగ్రసేవాకేంద్రాలు విజయవంతంగా సమస్యలు లేకుండా నిర్వహిస్తున్నారు.
సేవలు సద్వినియోగం
పల్లె సమగ్రసేవా కేంద్రాలు నిర్వహించే గ్రామాల్లో ప్రజలకు బ్యాంకింగ్ సేవలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడంతో బ్యాంకుల సంబంధించిన లావాదేవీలు ఆయా గ్రామాల్లోనే సద్వినియోగం చేసుకుంటున్నారు. గతంలో రద్దీగా ఉండే బ్యాంకులు పల్లెల్లో ఏర్పాటు చేసిన ఈ సేవల కారణంగా రద్దీ తక్కువైంది.
మహిళా సంఘాల సభ్యులకు తగ్గిన దూరభారం
గ్రామాల్లో మహిళా సంఘాల సభ్యులు ప్రతి నెలా వారు జమచేసిన పొదుపులను తమ ఖాతాల్లో జమచేయడం, డబ్బులను సభ్యులకు అప్పుగా ఇచ్చేందుకు కులకచర్ల మండల కేంద్రంలో ఉన్న బ్యాంకుకు వెళ్లేవారు. కానీ నేడు ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన పల్లె సమగ్రసేవ కేంద్రాల వలన వారు నేరుగా వారి గ్రామాల్లో ఉన్న కేంద్రాలకు వెళ్లి తమ పొదుపు డబ్బులను వారి ఖాతాల్లో జమచేయడంతో పాటు డబ్బులను విత్ డ్రా చేసుకునేందుకు అనువుగా ఉందని మహిళా సంఘాల సభ్యులు పేర్కొంటున్నారు.
ఉపాధిహామీ కూలీలకు..
ఉపాధిహామీ కూలీలు కూలి డబ్బులు బ్యాంకుల దగ్గరకు వెళ్లకుండా పల్లె సమగ్రసేవా కేంద్రాలు ఉన్న గ్రామాల్లోనే తీసుకుంటున్నారు. దీంతో వారికి ప్రయాణ చార్జీలతో పాటు, సమయం కూడా ఆదాఅవుతుంది. పల్లె సమగ్రసేవా కేంద్రాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని పలువురు పేర్కొంటున్నారు.
అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేయాలి
ఇప్పటికే పల్లె సమగ్రసేవా కేంద్రాలను ఏర్పాటు చేసి బ్యాంకుల దగ్గరకు వెళ్లి ఇబ్బందులు పడకుండా గ్రామాల్లో బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన కార్యకలాపాలు నిర్వహిస్తున్న పల్లె సమగ్రసేవా కేంద్రాలను ప్రతి గ్రామంలో ఏర్పాటు చేస్తే బాగుంటుంది. దీని ద్వారా డబ్బుతో పాటు సమయం ఆదాఅవుతుంది. సంబంధిత అధికారులు మండలంలోని అన్నిగ్రామాల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేసేవిధంగా చర్యలు తీసుకోవాలి.
సద్వినియోగం చేసుకోవాలి
సమగ్రసేవా కేంద్రాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. కేంద్రంలోనే అన్నిరకాల సేవలు అందించడంతో పాటు ఉపాధిహామీ కూలీల డబ్బులు కూడా చెల్లిస్తున్నాం. మహిళా సంఘాలకు నగదును బ్యాంకులో జమచేస్తున్నాం. బ్యాంకు ఖాతాలను కూడా ఇక్కడే ఇసుస్తున్నాం.
బ్యాంకింగ్ సేవలు నిర్వహిస్తున్నారు
ప్రభుత్వ సేవలన్నీ ఒక చేటే అందించడం పల్లె సమగ్రసేవా కేంద్రాల ముఖ్య ఉద్దేశం. మీసేవా, ఈ సేవా కేంద్రాల్లో అందిస్తున్న 60 రకాల సేవలను కూడా ఇక్కడా అందించే అవకాశం ఉంది. ప్రస్తుతం బ్యాంకింగ్ సేవలు నిర్వహిస్తున్నారు. డబ్బులు డ్రాచేసుకోవడం, జమచేయడం వంటి లావాదేవీలు కేంద్రాల ద్వారా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మండలంలో 9 కేంద్రాలతో పాటు ఇతర గ్రామాల్లో కూడా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు జిల్లా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.