ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి. రంగు రంగుల కాగితాలు, పూలు, విద్యుద్దీపాలతో అలంకరించిన వాహనాల్లో వినాయక విగ్రహాల శోభాయాత్రలు కన్నుల పండువగా సాగాయి. దారి పొడవునా భజనలు, బ్యాండు చప్పుళ్లు, కోలాటాలు, నృత్యాల హోరుతో భక్తులు నీరాజనం పలికారు. జై గణేశా…జై జై గణేశా.., గణపతి బొప్ప మోరియా అంటూ నిమజ్జనానికి ముందుకు సాగారు. నిమజ్జనోత్సవంలో పలువురు ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొని ఆయా గ్రామాల సమీపంలోని వాగులు, చెరువులు, బావుల్లో ‘ బొజ్జ గణపయ్యా.. మళ్లీ రావయ్యా’ అంటూ గణనాథుడిని గంగమ్మ ఒడికి చేర్చారు.
జై బోలో గణేశ్ మహారాజ్కి జై, గణపతి బప్పా మోరియా.. అగ్లే బరస్ జల్దీ ఆ.. అంటూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ఆదివారం అంగరంగ వైభవంగా వినాయకుడి శోభాయాత్ర నిర్వహించారు. గణనాథుడికి నవరాత్రుల సందర్భంగా భక్తజనం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వినాయకుడి విగ్రహాలను పూజించి నిమజ్జనానికి తరలించారు. ఈ సందర్భంగా మండపాల వద్ద నిర్వాహకులు అన్నదానం చేశారు. తర్వాత వినాయకుడి లడ్డూకు వేలంపాట నిర్వహించారు. లడ్డూ దక్కించుకునేందుకు చాలా మంది పోటీపడ్డారు. చిన్నారులు, పెద్దలు బ్యాండుచప్పుళ్లకు డ్యాన్సులు చేస్తూ శోభాయాత్రను కొనసాగించారు. అనంతరం అందుబాటులో ఉన్న ప్రాజెక్టులు, నదులు, చెరువులు, కుంటల్లో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు. భక్తుల కోసం ప్రధాన రోడ్లలో ప్రసాదాలు, అక్కడక్కడ అన్నదానం ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.