ఘనంగా వినాయక నిమజ్జనం
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 19 : నియోజకవర్గంలో ఆదివారం ఘనంగా వినాయక నిమజ్జనం జరిగింది. ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్మెట్తో పాటు ఇబ్రహీంపట్నం, తుర్కయంజాల్, ఆదిబట్ల, పెద్దఅంబర్పేట్ మున్సిపాలిటీల్లో పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించారు. ఇబ్రహీంపట్నం గణనాథులను తట్టిఖానా, శేరిగూడ చెక్డ్యాంల్లో, ఆదిబట్ల, తుర్కయంజాల్ మున్సిపాలిటీల గణనాథులను తుర్కయంజాల్ మాసాబ్చెరువులో నిమజ్జనం చేశారు. నిమజ్జనం సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
కడ్తాల్లో..
కడ్తాల్, సెప్టెంబర్ 19 : మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో ప్రతిష్ఠించిన వినాయకుల నిమజ్జనాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణనాథుల వద్ద అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గణపతులను బ్యాండ్బాజాల మధ్య ప్రధాన వీధుల గుండా ఊరేగించి స్థానిక చెరువులో నిమజ్జనం చేశారు.
భక్తిశ్రద్ధలతో గణనాథుడికి పూజలు
ఆమనగల్లు, సెప్టెంబర్ 19 : ఆమనగల్లుబ్లాక్ మండలాల నుంచి పలువురు భక్తులు తమ గణనాథులను నిమజ్జనం చేసేందుకు సురసముద్రం చెరువు కట్టవద్దకు తరలివచ్చారు. పట్టణంలోని శ్రీనివాస కాలనీలో శ్రీభక్తియూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేశ్ మండపం వద్ద పసుపులేటి సోనీ, పరమేశ్లు వేలం పాటలో రూ.లక్షకు లడ్డును దక్కించుకొన్నారు. సీఐ ఉపేందర్, ఎస్ఐ ధర్మేశ్, మున్సిపల్ కమిషనర్ శ్యామ్సుందర్ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. పట్టణంలోని 15 వార్డు శివాలయంనగర్ కాలనీలో శివశక్తియూత్, డ్రీమ్బాయ్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథునికి మాజీ ఎంపీపీ, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు సీఎల్ శ్రీనివాస్యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
టీఆర్ఎస్ నాయకుల అన్నదానం
మంచాల సెప్టెంబర్ 19 : మండల పరిధిలోని ఆరుట్ల గ్రామంలోని వరసిద్ధి వినాయక సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమేశ్, ఎంపీటీసీ శ్రీనివాస్ పాల్గొన్నారు. టీఆర్ఎస్ నాయకులు గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కందాల శ్రీశైలం, శేఖర్, రాము, చిందం జంగయ్య పాల్గొన్నారు.