త్రీఆర్స్(రీడింగ్, రైటింగ్, అరిథమెటిక్)పై విద్యార్థులు పట్టు సాధించేలా జిల్లా విద్యాశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. అందులో భాగంగా ఈ నెల 14వ తేదీ నుంచి మూడు నుంచి పది తరగతులవారికి ఈ అంశాల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నది. కరోనాతో 18 నెలలు విద్యార్థులు చదువుకు దూరంగా ఉన్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోనే మొదటగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో త్రీఆర్స్ను అమలు చేస్తున్నారు. నవంబర్ 1వ తేదీ వరకు ప్రతి విద్యార్థి చదవడం, రాయడం, అంకగణితం నేర్చుకునేలా విద్యాశాఖ అధికారులు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రతి ఐదు రోజులకోసారి పరీక్షలను నిర్వహిస్తూ వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. త్రీఆర్స్పై 100 పేజీలతో తయారు చేసిన మెటీరియల్ పీడీఎఫ్ రూపంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలకు చేరవేశారు. అన్ని స్కూల్స్లో త్రీఆర్స్ తరగతులు నిర్వహిస్తున్నారా.. లేదనే దానిపై పర్యవేక్షించేందుకుగాను మండలానికి ముగ్గురు గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులను ఎంపిక చేశారు. అదేవిధంగా జిల్లా విద్యాశాఖ అధికారి, సెక్టోరియల్ అధికారితో కూడిన జిల్లా బృందం కూడా జిల్లా అంతటా తనిఖీలు చేస్తున్నారు.
రంగారెడ్డి, సెప్టెంబర్ 18, (నమస్తే తెలంగాణ): జిల్లాలో మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు త్రీఆర్స్రాని విద్యార్థులపై జిల్లా విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. కరోనా మహమ్మారి వ్యాప్తితో 18 నెలలుగా విద్యార్థులు చదువుకు దూరంగా ఉన్న నేపథ్యంలో విద్యార్థులకు బేసిక్ తప్పనిసరిగా వచ్చే విధంగా జిల్లా విద్యాశాఖ ప్రణాళికను రూపొందించింది. త్రీఆర్స్ రాని విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించేందుకుగాను జిల్లా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. చదవడం, రాయడం, గణితం(కూడిక, తీసివేత, గుణకారం, భాగహారం) రాని విద్యార్థులు ఏ దశలో ఉన్నారనే విషయాన్ని మొదటగా గుర్తించి తదనంతరం వారికి సంబంధిత అంశాలను నేర్పించేందుకు విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. తెలుగు చదవడం, రాయడం, ఇంగ్లిష్ చదవడం, రాయడంతోపాటు గణితంలో కూడికలు, తీసివేత, గుణకారం, భాగహారం అంటే భయపడే విద్యార్థులను మానసికంగా సిద్ధం చేసి వారికి త్రీ ఆర్స్ వచ్చేలా సిద్ధం చేసేందుకు సంబంధిత అధికారులు సిద్ధమయ్యారు. రాష్ట్రంలోనే జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు త్రీఆర్స్ నేర్పించడంపై చర్యలు చేపట్టారు. అదేవిధంగా నవంబర్ 1 వరకు మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు ప్రతి విద్యార్థికి త్రీఆర్స్ వచ్చేలా జిల్లా విద్యాశాఖ లక్ష్యంగా నిర్ణయించుకుంది.
ఈనెల 14 నుంచి తరగతులు షురూ..
జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లోని మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు గల విద్యార్థులందరికీ త్రీఆర్స్ వచ్చేలా జిల్లా విద్యాశాఖ ప్రణాళికను రూపొందించింది. ఈనెల 14 నుంచి త్రీఆర్స్ ప్రత్యేక తరగతులను ప్రారంభించింది. తెలుగు చదవడం, రాయడం, ఇంగ్లీష్ చదవడం, రాయడంతోపాటు గణితంలో కూడిక, తీసివేత, గుణకారం, భాగహారాన్ని విద్యార్థులను 45 రోజుల్లో నేర్పించేలా నిర్ణయించారు. అయితే 3 నుంచి 8వ తరగతుల విద్యార్థులకు 30 రోజుల్లో త్రీఆర్స్ నేర్పించాలని చర్యలు చేపట్టారు. అదేవిధంగా 9, 10 తరగతుల విద్యార్థులకు 15 రోజుల్లో త్రీఆర్స్ నేర్పించేలా కార్యాచరణను అమలు చేస్తున్నారు. అయితే 3,4,5 తరగతుల విద్యార్థులకు త్రీఆర్స్పై ఉదయం రెండు సెషన్స్, మధ్యాహ్నం తర్వాత ఒక సెషన్లో చదవడం, రాయడం, గణితంలో బేసిక్పై బోధిస్తున్నారు. అదేవిధంగా 6-10 తరగతుల విద్యార్థులకు జిల్లా విద్యాశాఖ నిర్దేశించిన తేదీ వరకు ఒక పూట మాత్రమే రెగ్యులర్ సిలబస్ బోధిస్తుండగా, మరో పూట త్రీఆర్స్పై తరగతులను బోధిస్తున్నారు. విద్యార్థులకు త్రీఆర్స్ను నేర్పించడమే కాకుండా వారికి ఎప్పటికప్పుడు పరీక్షలను కూడా నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ నిర్ణయించింది. ప్రతి ఐదు రోజులకోసారి పరీక్షలను నిర్వహించనున్నారు. 9,10 తరగతుల విద్యార్థులకు మూడు పరీక్షలు, మిగతా తరగతలు విద్యార్థులకు ఆరు పరీక్షలను నిర్వహించనున్నారు. త్రీఆర్స్లో భాగంగా తెలుగు, ఇంగ్లీష్, గణితంపై బోధిస్తున్నారు. ఒక్కో సబ్జెక్ట్కు ఐదుగురు ఉపాధ్యాయులను ఎంపిక చేసి, త్రీఆర్స్పై 100 పేజీలతో కూడిన పీడీఎఫ్ను కూడా సిద్ధం చేసి, ఇప్పటికే అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు చేరవేశారు. అదేవిధంగా పాఠశాలల్లో త్రీఆర్స్ తరగతులు నిర్వహిస్తున్నారా లేదనే దానిపై పర్యవేక్షించేందుకుగాను మండలానికి ముగ్గురు గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులను ఎంపిక చేశారు. వీరికి పక్క మండలాల పర్యవేక్షణ బాధ్యతలిచ్చారు. వారానికి ఒకసారి వీరు ఆయా పాఠశాలల్లో పర్యవేక్షించనున్నారు. అదేవిధంగా జిల్లా విద్యాశాఖ అధికారి, సెక్టోరియల్ అధికారితో కూడిన జిల్లా బృందం కూడా జిల్లా అంతటా రోజు త్రీఆర్స్పై తనిఖీలు చేస్తున్నారు.
ప్రతి విద్యార్థికి త్రీఆర్స్ రావడమే లక్ష్యం
ప్రతి విద్యార్థికి త్రీఆర్స్(చదవడం, రాయడం, గణితంలో కూడికలు, తీసివేత, గుణకారం, భాగహారం) రావడమే లక్ష్యంగా ప్రత్యేక ప్రణాళికను రూపొందించాం. రాష్ట్రంలోనే జిల్లాలో మాత్రమే త్రీఆర్స్ నేర్పించేందుకు చర్యలు చేపట్టాం. ఇప్పటికే త్రీఆర్స్ తరగతులు ప్రారంభమయ్యాయి. నవంబర్ 1 వరకు 3-10 తరగతుల విద్యార్థులకు త్రీఆర్స్ నేర్పించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం. అదేవిధంగా నవంబర్ 12న నిర్వహించే జాతీయ సాధన పరీక్షతోపాటు ప్రతి విద్యార్థికి బేసిక్ రావాలనే ఉద్దేశంతో త్రీఆర్స్ కార్యక్రమాన్ని చేపట్టాం.