తలకొండపల్లి, సెప్టెంబర్18: పల్లె ప్రగతి కార్యక్రమంతో రాంపూర్ గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నది. గ్రామంలో 1910 మంది జనాభా ఉంది. పల్లె ప్రగతి అమలుకు ముందు ఊరంతా సమస్యలతో సతమతమయ్యేది. పాడుబడిన ఇండ్లు, పాత బావులతో కొన్ని కాలనీలు కళావిహీనంగా ఉండేవి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామం రూపురేఖలు మారిపోయాయి. ఏ కాలనీలో చూసినా సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కనబడుతున్నాయి. పంచాయతీ ట్రాక్టర్తో రోజూ పారిశుధ్య నిర్వహణ చేపడుతున్నారు. దీంతో కాలనీల్లో పరిశుభ్రమైన వాతావరణం కనిపిస్తున్నది.
పల్లె ప్రగతిలో చేపట్టిన అభివృద్ధి పనులు
పల్లెప్రగతితో రాంపూర్ గ్రామానికి కొత్తందాలు వచ్చాయి. రూ.32 లక్షలతో బృహత్ పల్లె ప్రకృతివనం ఏర్పాటు చేసి, మొక్కలు నాటారు. రూ.25 లక్షలతో రైతువేదిక, రూ.12.60 లక్షలతో వైకుంఠధామం, రూ.2.50 లక్షలతో డంపింగ్ యార్డు నిర్మించారు. రూ.3 లక్షలతో పల్లె ప్రకృతి వనం ఏర్పాటుచేశారు. దీంతో పాటు గ్రామంలో ఇంటింటికీ 6 మొక్కల చొప్పున పంపిణీ చేశారు. 3 వేల మొక్కలు నాటారు. వీటిలో జామ, నిమ్మ, కొబ్బరి, తులసి, బాదం, ఉసిరితోపాటు వివిధ రకాల పూల మొక్కలు ఉన్నాయి. మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికీ నల్లాల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. రూ.5.20 లక్షలతో ప్రతి కాలనీలో ఎల్ఈడీ లైట్లు ఏర్పాటుచేశారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, జడ్పీ నిధులు రూ.14 లక్షలతో సీసీ రోడ్లు, రూ.20.60 లక్షలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు ఏర్పాటు చేశారు. రోడ్డుకిరువైపులా మొక్కలు నాటారు. పంచాయతీకి చెందిన ట్యాంకర్తో రోజూ మొక్కలకు నీరు పోసి, వాటిని సంరక్షిస్తున్నారు.
రెండేండ్లలో ఊహించని అభివృద్ధి
రెండేండ్లలో గ్రామంలో ఊహించని అభివృద్ధి జరిగింది. మా గ్రామంలో మొదటి ప్రాధ్యాన్యతగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తిచేశారు. గ్రామంలోని ఏ కాలనీలో చూసినా అభివృద్ధి పనులు జోరందుకున్నాయి. పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామం రూపురేఖలు మారిపోయాయి.
అందరి సహకారంతో గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నాం
ప్రాధాన్యత ప్రకారం సమస్యలు పరిష్కరించేందుకు ప్రతి నెలా గ్రామ సభ నిర్వహిస్తు న్నాం. గ్రామంలో వైకుంఠ ధామం, పల్లె ప్రకృతి వనం, నర్సరీ, కాలనీల్లో సీసీ రోడ్లు, కంపోస్టు షెడ్డు తదితర పనులు చేశాం. ప్రజలు, ప్రజాప్రతినిధుల సహకారంతోనే గ్రామం అభివృద్ధి చెందుతున్నది. ప్రభుత్వ నిధులను పక్కాగా అభివృద్ధి పనులకు వినియోగిస్తున్నాం. ఉన్నతాధికారుల సూచనల మేరకు గ్రామాన్ని అన్నింటా అభివృద్ధి చేస్తున్నాం.
ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా..
అన్ని రంగాల్లో గ్రామాన్ని అభివృద్ధి చేసి మండలంలోనే ఆదర్శంగా నిలుపుతా. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, జడ్పీ నిధులు తీసుకొచ్చి మరింత అభివృద్ధి కృషిచేస్తా. నా హయాంలో చేసిన అభివృద్ధి పనులు చిరస్థాయిగా నిలిచిపోయేలా చేస్తా. గ్రామస్తుల సహకారంతో అన్నివిధాలా అభివృద్ధి చేసుకుంటున్నాం.