షాద్నగర్, సెప్టెంబర్18: మారుతున్న కాలానికి అనుగుణంగా గ్రామీణ ప్రాంత రైతులు కూడా కూరగాయల సాగుపై మక్కువ పెంచుకుంటున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందేలా పంటలు పండిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూరగాయలు సాగు చేసేందుకు రైతులకు రాయితీలు ఇవ్వడంతో అన్ని వర్గాల రైతులు సాగుపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. రెండు, మూడు ఏండ్ల నుంచి రంగారెడ్డి జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో కూరగాయల సాగు విస్తీర్ణం పెరుగుతున్నది. రాష్ట్ర రాజధానికి ఆనుకుని ఉండడంతో రంగారెడ్డి జిల్లా రైతులు పండించిన పంటను సరైన రీతిలో మార్కెట్ చేసి, సొమ్ము చేసుకుంటున్నారు.అన్ని కాలాల్లో కూరగాయలకు మంచి డిమాండ్ ఉండడం కూడా రైతులకు కలిసివస్తున్నది.
జిల్లాలో 17,772 ఎకరాల్లో సాగు
తెలంగాణలోనే కూరగాయల సాగులో రంగారెడ్డి జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. టమాట, వంకాయ, పచ్చి మిర్చి వంటి పంటల సాగులో జిల్లా మొదటి స్థానంలో ఉంది. జిల్లాలోని 25 మండలాల్లో 22,003 మంది రైతులు 17,772 ఎకరాల విస్తీర్ణంలో వివిధ రకాల పంటలు సాగుచేస్తున్నారు. అత్యధికంగా చేవెళ్ల మండలంలో 4080 మంది 3,825 ఎకరాల్లో, షాబాద్ మండలంలో 2,539 మంది 2,122 ఎకరాల్లో , ఇబ్రహీంపట్నం మండలంలో 1,804 మంది 1,291 ఎకరాల్లో, మహేశ్వరం మండలంలో 1,585 మంది 1,771 ఎకరాల్లో, శంషాబాద్ మండలంలో 1,374 మంది 1,104 ఎకరాల్లో కూరగాయల పంటలు సాగుచేస్తూ ఉపాధి పొందుతున్నారు. ఫరూఖ్నగర్, కొందుర్గు, కేశంపేట, కడ్తాల్, శంకర్పల్లి, ఆమనగల్లు, తలకొండపల్లి, కొత్తూరు, నందిగామ, గండిపేట, కందుకూరు, బాలాపూర్, యాచారం, అబ్దుల్లాపూర్మెట్ మండలాల్లో కూరగాయల సాగు విస్తృతంగా కొనసాగుతున్నది. మూడు, నాలుగు ఏండ్ల నుంచి ప్రతియేటా కూరగాయల సాగు పెరుగుతున్నదని ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు. రవాణా వ్యవస్థ మెరుగుపడడం, అన్ని సమయాల్లో కూరగాయలకు ధరలు ఉండడంతో కూరగాయ పంటల సాగుపై రైతులు ఆసక్తిచూపుతున్నారు.
సాగులో రాష్ట్రంలో జిల్లాయే మేటి
కూరగాయల సాగులో రాష్ట్రంలోనే రంగారెడ్డి జిల్లా రైతులు ముందువరుసలో ఉన్నారు. టమాట, పచ్చి మిరపకాయలు, వంకాయ, బెండకాయ వంటి పంటలు సాగు చేయడంలో జిల్లా రైతులు గణనీయంగా దూసుకుపోతున్నారు. జిల్లాలోని ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకం పంటలు పండిస్తూ లాభాలు గడిస్తున్నారు. చేవెళ్ల, షాబాద్ ప్రాంతాల్లో క్యారెట్ సాగు చేస్తున్నారు. ఫరూఖ్నగర్, కేశంపేట, కొందుర్గు, చౌదరిగూడ మండలాల్లో టమాట, పచ్చి మిర్చి, బెండ, క్యాప్సికం పంటలు సాగవుతున్నాయి. శంషాబాద్, రాజేంద్రనగర్, కందుకూరు, ఇబ్రహీంపట్నం, యాచారం, మహేశ్వరం మండలాల్లో టమాట, వంకాయ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, ముల్లంగి వంటి పంటలతో పాటు తీగ జాతి పంటలు బీర, చిక్కుడు, కాకర, పొట్లకాయ, సొరకాయ, దోస వంటి పంటలు పండిస్తున్నారు. అన్ని ప్రాంతాల్లో టమాటను విస్తృతంగా సాగు చేస్తున్నారు. వీటితో పాటు గోకరి, ఉల్లి, బీర్నీస్, బీట్రూట్, మునగ, పలు రకాల ఆకుకూరల పంటలు పండిస్తున్నారు. ఇక్కడ పండిన కూరగాయలు మహారాష్ట్ర, చత్తీస్ఘడ్, ఒడిశా, తమిళనాడు వంటి రాష్ర్టాలకు ఎగుమతి చేస్తున్నారు.
రైతుకు సర్కారు సాయం
కూరగాయల పంటలు సాగుచేసే రైతులకు సర్కారు ప్రోత్సాహకాలు అందిస్తున్నది. రాయితీ ద్వారా కూరగాయల నారు, బిందు, తుంపర సేద్యం పరికరాలు అందిస్తున్నారు. సంకర జాతి వంగడాలతో పచ్చి మిర్చి, టమాట, వంకాయ నారు అందిస్తున్నారు. టమాట, పచ్చి మిర్చి, వంకాయ సాగుచేసే రైతులకు ప్రోత్సాహకంగా వెయ్యి రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నారు. 50 శాతం రాయితీతో పాలీహౌస్, నెట్ షెడ్, పందిరి నిర్మాణంలకు నిధులు విడుదల చేస్తున్నామని అధికారులు చెపుతున్నారు. 50 శాతం రాయితీతో ఫాంపాండ్ నిర్మాణానికి నిధులు విడుదల చేస్తున్నారు. మార్కెట్ డిమాండ్కు తగిన విధంగా పంటను సాగుచేసేందుకు ప్రత్యేకంగా క్రాప్ కాలనీలు ఏర్పాటుచేసిన రైతులను ప్రోత్సహిస్తున్నారు. సర్కారు సహాయాన్ని పొందుతున్న రైతులు కూరగాయల పంటలు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
లాభదాయకంగా కూరగాయల సాగు
కూరగాయల సాగు నేటి తరం రైతులకు లాభదాయకంగా ఉంటుంది. తక్కువ కాలంలో తక్కువ పెట్టుబడితో రైతు ఆశించిన స్థాయిలో లాభం పొందేందుకు అవకాశం ఉంటుంది. రంగారెడ్డి జిల్లా హైదరాబాద్కు ఆనుకుని ఉండడం, 15కు పైగా పట్టణాలు ఉండడంతో ఈ ప్రాంతంలో పండిన కూరగాయలకు అన్ని కాలాల్లో డిమాండ్ ఉంటుంది. పైగా మార్కెట్ వసతులు కూడా అందుబాటులో ఉన్నాయి. దీంతో రైతులు ధైర్యంగా పంటలు సాగుచేసుకోవచ్చు. ఉద్యానవన శాఖ అధికారుల సూచనలు పాటిస్తూ పంటలు సాగుచేస్తే రైతుకు నష్టం అనేదే ఉండదు.