ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 17: యాసంగిలో వరికి బదులుగా ఆరుతడి పంటలు వేసుకోవాలని అధికారులు సూచిస్తుండగా.. రైతుల నుంచి మంచి స్పందన వస్తున్నది. జిల్లా వ్యాప్తంగా రైతు వేదికల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి పప్పు దినుసులు, కుసుమలు తదితర ఆరుతడి పంటల వైపు దృష్టి సారించాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకా లను వివరిస్తున్నారు. జిల్లాలోని పలు మండలాల్లో క్రాప్కాలనీలను ఏర్పాటు చేసి, రైతులకు నాణ్యమైన నారును అందిస్తున్నారు.
ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 17 : వరిపంట సాగు విస్తీర్ణాన్ని తగ్గించడమే లక్ష్యంగా వ్యవసాయాధికారులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. యాసంగిలో వరికి బదులుగా ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచిస్తుండగా.. రైతుల నుంచి మంచి స్పందన లభిస్తున్నది. గత వర్షాకాలంలో వరిసాగు విస్తీర్ణం గణనీయంగా పెరగడంతో ధాన్యం కొనుగోలుకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో ఈ యాసంగిలో పప్పు దినుసులు, కుసుమలు తదితర పంటల వైపు దృష్టి సారించాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా రైతు వేదికల్లో రైతులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి వరిసాగుతో కలిగే ఇబ్బందులు, ఇతర పంటల సాగు వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నారు. ఆరుతడి పంటలు వేసుకునే రైతులకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని అన్నదాతలకు అర్థమయ్యేలా చెబుతున్నారు. కాగా రైతులు వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు సాగు చేసేందుకు సానుకూలత వ్యక్తం చేస్తున్నారు. ఈసారి వర్షాలు పెద్ద ఎత్తున కురువడంతో వరిసాగు విస్తీర్ణం భారీగా పెరిగే అవకాశమున్నందున అధికారులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నగరశివారుల్లో రంగారెడ్డిజిల్లా విస్తరించి ఉన్నందున శివారు ప్రాంతాల నుంచి నగరంలోని వివిధ మార్కెట్లకు రవాణా సౌకర్యం కూడా ఉండటంతో రైతులు పండించిన ఆరుతడి పంటలైన కూరగాయలు, ఇతరత్రా దిగుబడులను సకాలంలో మార్కెట్కు తీసుకెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో వరిసాగు విస్తీర్ణాన్ని తగ్గించి, కందులు, కూరగాయలు, కుసుమలు తదితర పంటల సాగు పెంచేలా చూస్తున్నారు.
ప్రభుత్వ ప్రోత్సాహం..
వరికి బదులుగా ఆరుతడి పంటలు వేసుకోవటం వలన నీటి వినియోగం తగ్గుతుంది. ఒక ఎకరా వరిసాగుకు అయ్యే నీటితో నాలుగు ఎకరాల ఆరుతడి పంటలు వేసుకోవచ్చునని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. మొక్కజొన్న, కూరగాయలు, కుసుమలు, మినుములు, జొన్నలు, పశుగ్రాసం వంటివి సాగు చేసుకునే రైతులకు ప్రభుత్వం తగిన ప్రోత్సాహకాలను అందిస్తున్నది. ముఖ్యంగా కుసుమలు, మినుములు వేసుకునే రైతులకు ప్రభుత్వం సబ్సిడీపై విత్తనాల కొనుగోలు, ఎరువులు అందజేస్తున్నది. హైదరాబాద్ చుట్టూ విస్తరించి ఉన్న రంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే రైతులు పెద్ద ఎత్తున కూరగాయల సాగు చేస్తున్నారు. జిల్లాలో పండించే కూరగాయలను ప్రతిరోజూ హైదరాబాద్ మార్కెట్కు తీసుకెళ్లి విక్రయించుకునేందుకు రైతు బజార్లల్లో అన్ని సదుపాయాలు కల్పించారు. అలాగే, రవాణా సౌకర్యం కూడా అందుబాటులో ఉన్నది. నగరంలో పెరిగిపోతున్న జనాభాకనుగుణంగా కూరగాయలు అందించే బాధ్యత ఎక్కువగా రంగారెడ్డి జిల్లాపైనే ఉంది. దీంతో కూరగాయల సాగును మరింత పెంచడం కోసం ఉద్యానవనశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని పలు మండలాల్లో క్రాప్కాలనీలను ఏర్పాటు చేసింది. ఈ క్రాప్కాలనీల కింద ఎంపిక చేసిన గ్రామాల్లో రైతులకు నాణ్యమైన నారును ఉద్యానవన శాఖనే అందిస్తున్నది. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం మండలాల్లో క్రాప్కాలనీల ద్వారా పంటల సాగు చేపట్టింది. క్రాప్కాలనీల రైతులను మరింత ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.
ప్రత్యేక ప్రణాళికలు..
వరిసాగు విస్తీర్ణాన్ని గణనీయంగా తగ్గించాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. గత వర్షాకాలంలో జిల్లాలో 1,21,842 ఎకరాల్లో వరిసాగు చేపట్టారు. ఈ నేపథ్యంలో దిగుబడులు కూడా పెద్ద ఎత్తున రావడంతో ధాన్యం కొనుగోలుకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది చాలావరకు వరిసాగు తగ్గించి కూరగాయల సాగు పెంచేలా అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.
వరి సాగు చేపట్టొద్దు..
రైతులు వరిసాగుకు బదులుగా ఆరుతడి పంటలైన మొక్కజొన్న, కూరగాయలు, కుసుమలు, మినుములు, జొన్నలు, పశుగ్రాసం వంటి పంటల సాగుపై దృష్టి సారించాలి. వరిసాగును పూర్తిగా తగ్గించాలన్న ప్రభుత్వం ఆదేశాలతో గ్రామాల్లో రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రంలో ఈ నెల 7న డివిజన్స్థాయి రైతు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనున్నాం. రైతులు వరికి బదులుగా ఆరుతడి పంటలతో పాటు కూరగాయల పంటలపై దృష్టి సారిస్తే అధిక దిగుబడులు పొందవచ్చు.
-సత్యనారాయణ, ఏడీఏ, వ్యవసాయశాఖ