పేదల ‘డబుల్’ ఇండ్ల కల త్వరలో సాకారం కానున్నది. రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 2600 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు పూర్తి కాగా, వచ్చే నెలలో పంపిణీ చేసేందుకు రంగం సిద్ధమవుతున్నది. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండేలా మండలాల తహసీల్దార్లకు బాధ్యతలను అప్పగించారు. వచ్చిన దరఖాస్తులలో అర్హులను గుర్తించి, లాటరీ పద్ధతితో ఇండ్లను కేటాయించనున్నారు. ఇప్పటికే జిల్లాలో 2.50 లక్షల దరఖాస్తులు రాగా, ఇంకా దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 30 వరకు జిల్లా ఉన్నతాధికారులు అవకాశం కల్పించారు. అర్హులు మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని అర్హులైన పేదలు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
రంగారెడ్డి, సెప్టెంబర్ 17, (నమస్తే తెలంగాణ): గూడులేని పేదలు సొంతింటి కల నెరవేర్చుకునేందుకు ఇదే చివరి అవకాశం. డబుల్ బెడ్రూం ఇండ్లకు సంబంధించి దరఖాస్తు చేసుకునేందుకు మరో పదిహేను రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ నెలాఖరుతో డబుల్ బెడ్రూం ఇండ్లకోసం దరఖాస్తు చేసుకునేందుకు గడువు ముగియనున్నది. ఇంకా దరఖాస్తు చేసుకోకుండా మిగిలిపోయిన అర్హులైన పేదవారుంటే ఈనెల 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు జిల్లా ఉన్నతాధికారులు అవకాశం ఇచ్చారు. మీసేవ ద్వారా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద డబుల్ బెడ్రూం ఇండ్లకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇప్పటివరకు 2.50 లక్షల దరఖాస్తులు
రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 2.50 లక్షల దరఖాస్తులు అందినట్లు జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ నెలాఖరుతో వచ్చిన దరఖాస్తులన్నింటిని రాష్ట్ర సాంకేతిక విభాగానికి అందజేసి, ఆధార్ కార్డుల ప్రకారం గతంలో ప్రభుత్వం మంజూరు చేసిన ఇండ్లను పొందారా లేదనే వివరాలు రాబట్టనున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ద్వారా ఇండ్లు మంజూరైతే సంబంధిత దరఖాస్తులను తిరస్కరించి, మిగతా వాటిని జిల్లా యంత్రాంగానికి అందజేయనున్నారు. రాష్ట్ర సాంకేతిక విభాగం అందజేసే దరఖాస్తులను ఆయా మండలాలు, మున్సిపాలిటీల వారీ గా వేరు చేసి అర్హులను ఎంపిక చేయనున్నా రు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో డబుల్ బెడ్రూం ఇండ్లకు అధిక మొత్తంలో దరఖాస్తులు వచ్చిన నేపథ్యంలో లబ్ధిదారులను లాటరీ పద్ధతిలో ఎంపిక చేసేందుకు కలెక్టర్ ఇప్పటికే సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
తహసీల్దార్లకు లబ్ధిదారుల ఎంపిక బాధ్యత
వచ్చేనెలాఖరు వరకు అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయించనున్నారు. అర్హుల ఎంపికలోనూ ఎలాంటి అవకతవకలు జరుగకుండా పూర్తిగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. లబ్ధిదారుల ఎంపికలోనూ, ఇండ్ల కేటాయింపులోనూ లాటరీ పద్ధతిలోనే ఎంపిక చేయనున్నారు. ఇప్పటివరకు నిర్మాణం పూర్తైన డబుల్ బెడ్రూం ఇండ్లను వచ్చేనెలాఖరు వరకు కేటాయించేందుకు చర్య లు చేపట్టారు. లబ్ధిదారుల ఎంపిక బాధ్యత అంతా ఆయా మండలాల తహసీల్దార్లకు అప్పగించారు. మండలాలతోపాటు మున్సిపాలిటీల్లోనూ ఆయా మండలాల తహసీల్దార్లే ఎంపిక చేయనున్నారు. అయితే జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 2.50 లక్షల దరఖాస్తులు అందినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి ప్రభుత్వం ఆధార్ కార్డుల వివరాలతో దరఖాస్తుదారులకు ఇంతకు ముందు ఇల్లు మంజూరైందా, కారు ఉందా, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబమేనా తదితర వివరాలు సేకరించి నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. అయితే దరఖాస్తుదారులు తప్పనిసరిగా తెల్లరేషన్ కార్డు కలిగి ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ అనర్హులకు డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపు జరుగకూడదనే ఉద్దేశంతో ఈ ప్రక్రియ అంతా పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. ఆయా నియోజకవర్గాల్లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లలో స్థానికులతోపాటు స్థానికేతరులకు నిర్దేశించిన కోటా ప్రకారం ఇండ్లు ఇవ్వనున్నారు. ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం, మైనార్టీలకు 7 శాతం, ఇతరులకు 43 శాతం లెక్కన డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించనున్నారు.
రూ.26 కోట్లతో మౌలిక వసతులు
గూడులేని ప్రతి పేదవాడి సొంతింటి కలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా జిల్లాలో ఇప్పటికే పూర్తైన డబుల్ బెడ్రూం ఇండ్లకు సంబంధించి మౌలిక వసతులు కల్పించేందుకు రూ.26 కోట్ల నిధులు మంజూరు చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన ఈ నిధులతో విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాలు కల్పించే పనులు చేపట్టారు. మరోవైపు ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 2600 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తయ్యాయి. జిల్లాలో పూర్తైన ఇండ్లలో 1880 ఇండ్లు షాద్నగర్ నియోజకవర్గానికి సంబంధించినవి. జిల్లాకు 6777 ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేయగా, చేవెళ్ల నియోజక వర్గానికి 1060 ఇండ్లు, కల్వకుర్తి 738 ఇండ్లు, ఇబ్రహీంపట్నం 1239 ఇండ్లు, షాద్నగర్ నియోజకవర్గానికి 3100 ఇండ్లు, రాజేంద్రనగర్కు 240, మహేశ్వరం నియోజకవర్గానికి 400 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరయ్యాయి. ఇప్పటికే 6383 ఇండ్లకు సంబంధించి టెండర్లు పూర్తయ్యాయి.