బాటసింగారం తాత్కాలిక పండ్ల మార్కెట్ను శుక్రవారం మంత్రులు నిరంజన్రెడ్డి, సబితారెడ్డి ప్రారంభించనున్నారు. వ్యాపారులు, విక్రయదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సకల సౌకర్యాలను ఏర్పాటు చేశారు. నేడు నిర్వహించే కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. మార్కెట్ ప్రారంభం అనంతరం కోహెడలోని పర్మినెంట్ పండ్ల మార్కెట్ నిర్మాణ పనులకు మంత్రులు శంకుస్థాపన చేయనున్నారు.
ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 14 : రంగారెడ్డిజిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం బాటసింగారంలో నేటి నుంచి పండ్ల మార్కెట్లో క్రయవిక్రయాలు ప్రారంభం కానున్నాయి. దసరా పండుగను పురస్కరించుకుని మంత్రులు నిరంజన్రెడ్డి, సబితారెడ్డి, ఎమ్మెల్యేలు కిషన్రెడ్డి, సుధీర్రెడ్డిల ఆధ్వర్యంలో క్రయవిక్రయాలను ప్రారంభించనున్నారు. గడ్డిఅన్నారం మార్కెట్ స్థలంలో ప్రభుత్వం అత్యాధునిక వసతులతో కూడిన దవాఖానను నిర్మించాలని సంకల్పించింది. అందులో భాగంగానే ఈ మార్కెట్ను కోహెడలో 178 ఎకరాల్లో ప్రారంభించాలని నిర్ణయించింది. కోహెడలో తాత్కాలిక షెడ్లను ఏర్పాటు చేసి మార్కెట్ను ప్రారంభించినప్పటికీ గాలివానకు మార్కెట్ పూర్తిగా ధ్వంసమైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం బాటసింగారం సమీపంలోని లాజిస్టిక్ పార్కులో తాత్కాలిక మార్కెట్ను ఏర్పాటు చేసింది. ఈ మార్కెట్లో సరైన వసతులు లేవంటూ కొంతమంది వ్యాపారులు కోర్టును ఆశ్రయించారు. దీంతో మంత్రులు మహమూద్అలీ, నిరంజన్రెడ్డి, సబితారెడ్డి జోక్యం చేసుకొని వ్యాపారులతో చర్చలు జరుపగా బాటసింగారంలో క్రయవిక్రయాలు జరుపడానికి అంగీకరించారు. ఇదే సమయంలో అత్యాధునిక వసతులతో కోహెడలో మార్కెట్ను ప్రారంభించాలని కోరారు.
బాటసింగారంలో ఏర్పాట్లు పూర్తి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని బాటసింగారం సమీపంలోని లాజిస్టిక్ పార్కులో ఏర్పాటు చేసిన తాత్కాలిక మార్కెట్లో రైతులు, వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. లక్ష ఎస్ఎఫ్టీ సామర్థ్యం గల రెండు షెడ్లతో పాటు ఓపెన్ మార్కెట్లో బొప్పాయ, వాటర్మెలన్, బత్తాయి తదితర పండ్లను విక్రయించడానికి ఎనిమిది ఎకరాల స్థలాన్ని ప్రత్యేకంగా కేటాయించారు. మార్కెట్లో రైతులు, వ్యాపారులకు విశ్రాంతి భవనంతోపాటు తాగునీరు, మరుగుదొడ్లు వంటి అన్ని సౌకర్యాలు పూర్తిచేశారు.
క్రయవిక్రయాలను ప్రారంభించనున్న మంత్రులు
బాటసింగారం లాజిస్టిక్ పార్కులో ఏర్పాటు చేసిన మార్కెట్లో దసరా నుంచి క్రయ విక్రయాలు జరుపడానికి మార్కెటింగ్ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. శుక్రవారం 10గంటలకు మంత్రులు నిరంజన్రెడ్డి, సబితారెడ్డి, ఎమ్మెల్యేలు కిషన్రెడ్డి, సుధీర్రెడ్డి ఆధ్వర్యంలో మార్కెట్ను అధికారికంగా ప్రారంభించనున్నట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ ముత్యంరెడ్డి తెలిపారు. ఆ తర్వాత కోహెడ సమీపంలో పండ్ల మార్కెట్ ఏర్పాటుకు పూర్తిస్థాయి షెడ్ల నిర్మాణం పనులకు కూడా మంత్రులు శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకోసం వ్యవసాయశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది.