శంకర్పల్లి, అక్టోబర్ 13 : ఇంద్రారెడ్డి మృతిచెంది 21 సంవత్సరాలు అవుతున్నా ఆయనను స్మరించుకుంటూ క్రీడా పోటీలు నిర్వహించడం సంతోషకరమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం శంకర్పల్లి మండలంలోని సంకెపల్లి గ్రామంలో మూడు రోజుల పాటు స్వర్గీయ ఇంద్రారెడ్డి మెమోరియల్ కబడ్డీ పోటీలను సంకెపల్లి సర్పంచ్ ఇందిర నిర్వహించారు. ముగింపు కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడుతూ.. ఎంతో రాజకీయ అవకాశాలున్న తరుణంలో అకస్మాత్తుగా అందరి నుంచి దూరమైన ఇంద్రారెడ్డిని ప్రజలు నేటికీ స్మరించుకోవడం వారి జీవితానికి సార్థకత లభించిందన్నారు. ప్రజలందరి ఆశీర్వాదాలతోనే నేడు తాను ఈ స్థాయిలో ఉన్నానని మంత్రి అన్నారు. ఇంద్రారెడ్డి ఆశయ సాధన కోసం కృషి చేస్తానని తెలిపారు. కబడ్డీ పోటీల్లో 32 జట్లు పాల్గొనడం అభినందనీయమన్నారు. విజేతలకు అభినందనలు తెలిపిన మంత్రి.. ఓడినవారు క్రీడా స్ఫూర్తిని చాటుతూ మరలా గెలవడానికి ప్రయత్నించాలని కోరారు. ఓటమి గెలుపునకు నాంది కావాలన్నారు.
పల్లె ప్రగతితో గ్రామాల్లో సమూల మార్పులు
కేసీఆర్ కూడా ఆత్మైస్థెర్యంతో పోరాడి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారన్నారు. పల్లె ప్రగతితో గ్రామాల్లో సమూల మార్పులు జరుగుతున్నాయన్నారు. పట్టణాల్లో ఉండే పార్కులవలే నేడు పల్లె ప్రకృతి వనాల రూపంలో గ్రామాల్లో కూడా దర్శనమిస్తున్నాయన్నారు. ఎక్కడపడితే అక్కడ చెత్త వేయకుండా డంపింగ్ యార్డులు అందుబాటులోకి వచ్చాయన్నారు. తెలంగాణాలో బతుకమ్మ పండుగ జరుపుకునేలా విశ్వవ్యాప్తంగా పేరు వచ్చేలా సీఎం కేసీఆర్ కృషి చేశారని తెలిపారు. ప్రభుత్వం బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహిస్తూ మహిళలందరికీ చీరలు పంపిణీ చేస్తున్నదని తెలిపారు. చిన్న పిల్లలకు కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైతే మన రాష్ట్రం సంపూర్ణంగా విజయం సాధించినట్లు అవుతుందన్నారు.
ఇంద్రారెడ్డి అందరికీ ఆదర్శప్రాయుడు
చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ.. ఇంద్రారెడ్డి అందరికీ ఆదర్శప్రాయులన్నారు. తాను ఇంద్రారెడ్డి నుంచి రాజకీయంగా అనేక విషయాలు తెలుసుకున్నానని చెప్పారు. ఎంతోమందిని రాజకీయనాయకులుగా తయారుచేసిన మహోన్నత వ్యక్తి ఇంద్రారెడ్డి అని.. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు.
కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్రెడ్డి, ఎంపీటీసీ మేఘన, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపాల్, శంకర్పల్లి మున్సిపల్ అధ్యక్షుడు వాసుదేవ్కన్నా, మండల యూత్ అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి, మిర్జాగూడ సర్పంచ్ రవీందర్గౌడ్, శంకర్పల్లి ఏఎంసీ చైర్మన్ బుచ్చిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ శశిధర్రెడ్డి, గౌరవ అధ్యక్షుడు గోవర్దన్రెడ్డి, సీఐ మహేశ్గౌడ్, ఎంపీడీవో సత్తయ్య, ఎస్ఐలు సంజీవ్, లక్ష్మీనారాయణ, నాయకులు గోపాల్రెడ్డి, బాలకృష్ణ, లింగంముదిరాజ్, వార్డు సభ్యులున్నారు.