రైతుబంధు అన్నదాత అప్పులబాధ తీర్చితే, రైతుబీమా కొండంత ఆర్థిక భరోసా కల్పిస్తున్నది.. కల్యాణలక్ష్మి ప్రతి ఆడబిడ్డ ఇంటా కల్యాణ కాంతులు వెదజల్లుతున్నది.. ఆసరా పింఛన్ వృద్ధులకు ఊతకర్రగా మారి ముందుకు నడిపిస్తుండగా.. దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళల గౌరవాన్ని పెంచుతున్నది.. నిరుపేదలకు ‘డబుల్ ’ ఇండ్లు.. ఇలా ఎన్నో ప్రతిష్టాత్మక పథకాలను ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. వాటిని పకడ్బందీగా అమలు చేస్తూ అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నది. ప్రభుత్వ ఫలాలు ఉమ్మడి జిల్లాలోని ప్రతి గడపకూ చేరుతున్నాయి. పార్టీలకతీతంగా పథకాలు అమలు చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
మచ్చుకు కొన్ని..
రంగారెడ్డి జిల్లాలో
ఈ వానకాలం సీజన్కుగాను రైతుబంధు కింద 2,82,094 మంది రైతుల ఖాతాల్లో రూ.343.41 కోట్లు జమ
2020-21 సంవత్సరానికిగాను 1001 మంది రైతు కుటుంబాలకు రూ. 50.05 కోట్ల రైతు బీమా అందజేత
ఆసరా పింఛన్ల కోసం 1,63,407 మందికి ప్రతినెలా 38.21 కోట్లు ఖర్చు
కల్యాణలక్ష్మి కింద ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 3474 మందికి రూ.34.75 కోట్లు, షాదీ ముబారక్ పథకం కింద 1257 మందికి రూ.12.56 కోట్ల ఆర్థిక సాయం
వికారాబాద్ జిల్లాలో
ఈ వానకాలంలో రైతుబంధు కింద 2,22,132 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.296.64కోట్లు జమ
2018 నుంచి ఇప్పటివరకు 2,687 మందికి రైతుబీమా కింద రూ.134.35కోట్లు అందజేత
94,474 మందికి ప్రతినెలా రూ.22.02కోట్లు ఆసరా పింఛన్ పంపిణీ..
ఇప్పటివరకు కల్యాణలక్ష్మి పథకం కింద 20,476 మందికి, షాదీముబారక్ కింద 4,513 మంది లబ్ధిదారులకు ఆర్థికసాయం అందజేత
రంగారెడ్డి, అక్టోబర్ 8, (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం సబ్బండ వర్ణాల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలుచేస్తున్నది. దేశంలోని ఏ రాష్ట్రంలో లేనివిధంగా సంక్షేమ పథకాలు అమలుచేస్తూ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తున్నది. తెలంగాణలో వరుసగా రెండోసారి అధికారం చేపట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం పథకాలు అమలుచేస్తూ ప్రజలందరి నుంచి హర్షాతిరేకాలు పొందుతున్నది. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే పేదల ప్రభుత్వంగా పేరు తెచ్చుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వం నిరుపేదలను ఆదుకునేందుకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, అమలు చేస్తున్నది. ప్రధానంగా రైతు సంక్షేమానికి అమలుచేస్తున్న కార్యక్రమాలతో దేశమంతా రాష్ట్రం వైపు చూస్తున్నది. గతంలో వ్యవసాయానికి గంట, రెండు గంటలు మాత్రమే సరఫరా అయ్యే విద్యుత్ను టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచితంగా 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేస్తున్నది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకంతో తాగునీటి కష్టాలు దూరమయ్యాయి. పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లకు ఆర్థిక సాయమందించేందుకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం అమలుచేస్తూ పేదలకు పెద్దన్నలా సాయం అందిస్తున్నారు. పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు రంగారెడ్డి జిల్లాలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం వేగంగా జరుగుతున్నది. అభాగ్యులకు అండగా ఉంటూ ఆసరా పథకాన్ని అమలుచేస్తూ, దేశంలోని ఏ రాష్ట్రంలో లేనివిధంగా అధిక పింఛన్ను టీఆర్ఎస్ సర్కార్ అందిస్తూ ప్రజలందరి మన్ననలు పొందుతున్నది.
సంక్షేమానికి పెద్దపీట..
సబ్బండ వర్ణాల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్నది. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు ఇచ్చిన మాట ప్రకారం వ్యవసాయానికి 9 గంటల విద్యుత్తును సరఫరా చేసిన రాష్ట్ర ప్రభుత్వం, రెండేండ్లలోనే 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తును సరఫరా చేస్తున్నది. మరోవైపు రైతులు అప్పుల ఊబిలో చిక్కుకోకుండా పంట సాగు చేసేందుకు రైతుబంధు పథకంతో పెట్టుబడి సాయాన్ని అందజేస్తున్నది. జిల్లాలో రైతుబంధు పథకంలో భాగంగా వానకాలం సీజన్కు 2,82,094 మంది రైతులకు రూ.343.41 కోట్ల సాయాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా ప్రభుత్వం జమచేసింది. రైతు మరణిస్తే సంబంధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు రూ.5 లక్షల బీమాను ప్రభుత్వం అందజేస్తున్నది. జిల్లాలో 2020-21కి 1,141 దరఖాస్తులురాగా 1001 మంది మృతి చెందిన రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.50.05 కోట్లు అందజేసింది. వృద్ధులు, వితంతులు, దివ్యాంగులకు అండగా నిలిచేందుకు ఆసరా పథకాన్ని తీసుకొచ్చి రూ.200ల పింఛన్ను రూ.2016కు, దివ్యాంగులకు రూ.1500ల నుంచి రూ.3016లకు పెంచి, పంపిణీ చేస్తున్నది. జిల్లాలోని 1,63,407 మంది లబ్ధిదారులకు ఆసరా పింఛన్ల పంపిణీ నిమిత్తం ప్రభుత్వం ప్రతినెలా రూ.38.21 కోట్లు ఖర్చు చేస్తున్నది. పేదింటి ఆడపిల్లల పెండ్లిళ్లకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో ఆర్థిక చేయూతనందిస్తున్నది. ఏడేండ్లలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద రూ.120 కోట్లకుపైగా ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందజేసింది.
తల్లికి పెన్షన్.. కొడుకుకు రైతుబంధు, మనుమరాలికి కల్యాణలక్ష్మి..
ఒకేఇంట్లో మూడు సంక్షేమ పథకాలు పొందిన లబ్ధిదారులు..
కేసీఆర్ పాలనపై జనం హర్షం
ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 8 : స్వరాష్ట్రంలో గడగడపకూ ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయి. ఇంతవరకు ఏదో ఒక రకంగా లబ్ధిపొందని కుటుంబమంటూ లేదు. అంతేకాదు ఒకే కుటుంబంలో ఇద్దరుముగ్గురికి సైతం సంక్షేమ కార్యక్రమాల నుంచి లబ్ధి చేకూరుతున్నది. రంగారెడ్డిజిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి సంక్షేమ ఫలాలు అందాయి. స్థానికంగా నివాసముండే చెనమోని శ్రీనివాస్ది పేద కుటుంబం. ఆయనకున్న ఎకరం వ్యవసాయ భూమికి ప్రతి సీజన్కు రూ.5వేల రైతుబంధు పొందుతున్నాడు. అలాగే, ఆయన తల్లి రత్నమ్మకు ప్రతినెలా రూ.2వేల వృద్ధాప్య పింఛన్ అదుతున్నది. ఇక శ్రీనివాస్ కూతురు అనూషకు ఇటీవల వివాహం జరుగగా… కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకోవడంతో రూ.1,00,116 ఆర్థిక సాయం అందింది. ఇలాంటి కుటుంబాలు మరెన్నో ఉన్నాయి. సమైక్య రాష్ట్రంలో ఒక పథకం పొందాలంటే పైరవీలతోపాటు ఎంతోకొంత లంచం ముట్టజెప్పాల్సి వచ్చేదని, అలాంటిది సీఎం కేసీఆర్ హయాంలో ప్రతి లబ్ధిదారుడికి నేరుగా ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు..
టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మిషన్ భగీరథతో జిల్లా ప్రజలకు సీఎం కేసీఆర్ అపర భగీరథుడయ్యారు. గతంలో గుక్కెడు నీటికోసం కిలోమీటర్ల మేర వెళ్లాల్సి వచ్చేది. మూడేండ్ల నుంచి మిషన్ భగీరథ పథకంలో భాగంగా ఇంటింటికీ నల్లాల ద్వారా తాగు నీరందించడం తో జిల్లాప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వానికి నీరాజనాలు పలుకుతున్నారు. జిల్లా ప్రజలకు తాగు నీరందించేందుకు రూ.1396 కోట్లతో పనులు పూర్తి చేసి 1062 ఆవాసాలకు, ఎనిమిది మున్సిపాలిటీలకు తాగు నీరందిస్తున్నారు. శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్ వాటర్ నుంచి ఎల్లూరు రిజర్వాయర్ ద్వారా జిల్లాకు తాగునీటిని తీసుకొస్తున్నారు. జిల్లాలోని 1062 ఆవాసాలకు ముచ్చెర్ల, అంతారం, కమ్మదనం, కల్వకుర్తి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ద్వారా ఇంటింటికీ తాగు నీటిని అందిస్తున్నారు.
2221 డబుల్ బెడ్రూం ఇండ్లు పూర్తి…
నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇండ్ల పనులు జిల్లాలో వేగవంతంగా కొనసాగుతున్నాయి. జిల్లాలో ఇప్పటికే 2,221 ఇండ్లు పూర్తికాగా, పేదలకు కేటాయించేందుకు కసరత్తు చేస్తున్నారు. జిల్లాకు 6,777 ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేయగా, చేవెళ్ల నియోజకవర్గానికి 1060 ఇండ్లు, కల్వకుర్తికి 738 ఇండ్లు, ఇబ్రహీంపట్నంకు 1239 ఇండ్లు, షాద్నగర్ నియోజకవర్గానికి 3100 ఇండ్లు, రాజేంద్రనగర్కు 240, మహేశ్వరం నియోజకవర్గానికి 400 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరయ్యాయి. అయితే 6,383 ఇండ్లకు సంబంధించి ఇప్పటికే టెండర్లు పూర్తికాగా, 2,757 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం ప్రారంభమై, వివిధ దశల్లో కొనసాగుతున్నాయి.
అన్ని వర్గాల సంక్షేమం
పరిగి, అక్టోబర్ 8: తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, దేశంలోనే అన్ని రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచింది. తెలంగాణలో ఏదో ఒక సంక్షేమ పథకం అందని కుటుంబం లేదంటే అతిశయోక్తి కాదని చెప్పవచ్చు. ఒక్కో కుటుంబానికి రెండు, మూడు సంక్షేమ పథకాలతో లబ్ధి చేకూరుతున్నది. వికారాబాద్ జిల్లా ఏర్పాటు తర్వాత గ్రామాల్లో అర్హులైన వారికి ఎలాంటి పైరవీలకు తావు లేకుండానే పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయి. వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్ కిట్ ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ పథకాలు అత్యంత సమర్థవంతంగా అమలవుతున్నాయి.
94,474 మందికి ఆసరా పింఛన్లు
వికారాబాద్ జిల్లాలో 94,474 మందికి ఆసరా పింఛన్లు అందుతున్నాయి. ఈ మేరకు దివ్యాంగులకు నెలకు రూ.3,016, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, బోదకాలు బాధితులకు నెలకు రూ.2,016 అందజేస్తున్నారు. జిల్లాలో 94,474 మందికి ప్రతినెల రూ.22.02 కోట్లు పింఛన్లు అందజేస్తున్నారు. ఇందులో వృద్ధులు 30,213 మంది, దివ్యాంగులు 12,224 మంది, వితంతులు 46,658 మంది, చేనేత కార్మికులు 159 మంది, గీత కార్మికులు 434 మంది, ఒంటరి మహిళలు 4,535 మంది, బీడీ కార్మికులు 40 మంది, ఏఆర్టీ 1013 మంది, బోదకాలు బాధితులు 211 మందికి ప్రతినెలా పింఛన్లు అందుతున్నాయి.
27,685 మందికి కేసీఆర్ కిట్లు..
జిల్లా పరిధిలో కేసీఆర్ కిట్ 2017 జూన్ 2న ప్రారంభమైంది. ఇప్పటివరకు 27,685 మంది బాలింతలకు కేసీఆర్ కిట్లు అందజేశారు. జిల్లాలోని సర్కారు దవాఖానల్లో మొత్తం 51,730 ప్రసవాలు జరిగాయి. అందులో అర్హులు 27,685 మందికి కేసీఆర్ కిట్లు అందజేశారు. కేసీఆర్ కిట్ కార్యక్రమంలో భాగంగా ఒకటో, రెండో కాన్పుకు ఆడ శిశువు జన్మిస్తే రూ.13వేలు, మగ శిశువు జన్మిస్తే రూ.12 వేలు ఇస్తున్నారు. ఇప్పటివరకు లబ్ధిదారులకు రూ.28.07 కోట్లు అందజేశారు.
కల్యాణలక్ష్మి 20,476 మంది, షాదీముబారక్ 4,513 మంది..
కల్యాణలక్ష్మికి 24,908 దరఖాస్తులు రాగా అందులో 20,476 మందికి చెక్కులు అందజేశారు. షాదీముబారక్ పథకం కింద 5,525 దరఖాస్తులు రాగా 4,513 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఒక ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలకు వివాహమైతే ఇరువురికి ఈ పథకం కింద డబ్బులు మంజూరు చేస్తున్నారు.
రైతుబంధు రూ.311.57 కోట్లు ..
వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడంతోపాటు రైతును రాజును చేయడానికి సర్కారు అనేక సంస్కరణలు తీసుకొచ్చింది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రైతుబంధు పథకాన్ని అమలుచేస్తున్నారు. ఎకరాకు రూ.10వేలు అందిస్తున్నారు. ఈసారి వానకాలంలో రైతుబంధు కింద జిల్లాలోని 2,39,926 మంది రైతులకు రూ.311.57కోట్లు మంజూరయ్యాయి. ఇందులో ఇప్పటివరకు 2,22,132 మంది రైతులకు సంబంధించిన బ్యాంకు ఖాతాల్లో రూ.296.64 కోట్లు జమయ్యాయి. రైతు ఏ కారణంతోనైనా చనిపోతే రూ.5లక్షలు బీమా సదుపాయాన్ని కల్పించారు. 2018 నుంచి ఇప్పటివరకు జిల్లాలో 2,793 మంది రైతులు చనిపోయారు. ఇందులో 2,687 మందికి రూ.134.35 కోట్లు రైతు బీమా డబ్బులు విడుదలయ్యాయి. రైతుల కోసం ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతుబీమా రెండు కార్యక్రమాలు ఐక్యరాజ్య సమితి గుర్తింపు పొందడం గమనార్హం.
నా పెండ్లి భారం కాలేదు
నా పెండ్లికి మా అమ్మ నాన్న చాలా కష్టపడ్డారు. కొన్ని డబ్బులు అప్పు కూడా చేశారు. ఈ అప్పులు తీర్చడానికి ఇబ్బందులు పడకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి పథకం కింద లక్షానూట పదహారు రూపాయలు అందాయి. దీంతో అప్పులు కూడా ముట్టిపోయినయ్. ఇప్పుడు మా అమ్మానాన్నల మీద ఎలాంటి అప్పుల భారం లేదు. నా పెండ్లి సాఫీగా జరిగింది. మా అమ్మానాన్న, నా తరుఫున టీఆర్ఎస్ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్ సారుకు ప్రత్యేక కృతజ్ఞతలు.
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం
ముఖ్యమంత్రి కేసీఆర్కు మా కుటుంబం రుణపడి ఉంటుంది. మా కుటుంబంలో 11 మంది సభ్యులం. నాకు, మా తమ్ముడికి చెరో మూడెకరాల పొలం ఉంది. ప్రతి ఏడాది మాకు రైతుబంధు రూ.60 వేలు వస్తున్నాయి. మానాన్నకు ప్రతి నెలా రూ.2016 వృద్ధాప్య పింఛన్ వస్తున్నది. నా కూతురి పెండ్లికి కల్యాణలక్ష్మి డబ్బులు వచ్చినయ్. నా కూతురు కాన్పుకు కేసీఆర్ కిట్టు అందజేసిండ్రు. నిరుపేదల సంక్షేమం కోసం కృషి చేస్తున్న కేసీఆర్లాంటి ముఖ్యమంత్రి మరొకరు రాడు. మా కుటుంబమంతా ఎల్లప్పుడు కేసీఆర్కు అండగా ఉంటాం.
సీఎం సారూ సల్లంగా ఉండాలి
సీఎం కేసీఆర్ సారు సల్లంగా ఉండాలి. కేసీఆర్ సారూ నాలాంటి వితంతులకు రూ.2వేల పింఛన్ ఇచ్చి ఆదుకుం టున్నడు. నా బిడ్డకు పెండ్లి చేసినందుకు కల్యాణలక్ష్మి పథకం కింద లక్షానూటపదహారు రూపాయల చెక్కు ఇచ్చిండ్రు. నాకు 2.7 గుంటల భూమి ఉంది. ప్రతి ఏటా పంట పెట్టుబడి సహాయం కింద రైతు బంధు డబ్బులు కూడా వస్తున్నది. నా చిన్న కొడుకుకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ.10 వేలు వచ్చాయి. ఇన్ని మంచి పనులు చేస్తున్న సీఎం సారూ సల్లంగా ఉండాలి.
టీఆర్ఎస్తోనే సంక్షేమ పథకాలు
టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతనే ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. మా నాన్న హమీద్ షరీఫ్కు ప్రభుత్వం నుంచి వృద్ధాప్య పింఛన్, రైతు బంధు వస్తున్నది. నా భార్యకు షాదీముబారక్ పథకంలో లక్షా నూటపదహారు రూపాయలు వచ్చాయి. గతంలో ఏ ప్రభుత్వంలో కూడా ఒక ఇంటికి ఇన్ని పథకాలు ఇవ్వలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే ప్రతి ఇంటికి అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తున్నది. ఇలా సంక్షేమ పథకాలు అందజేయడం అభినందనీయం.
కల్యాణలక్ష్మి అందింది
నాలుగేండ్ల కిందట నా భర్త మృతి చెందాడు. దీంతో పెండ్లిడుకొచ్చిన నా కూతురికి అప్పోసప్పో చేసి లగ్గం చేసినం. ఆ తర్వాత కల్యాణలక్ష్మి కింద రూ.లక్షా 116లు అందించి సీఎం కేసీఆర్ మేనమామగా ఆదుకున్నారు. పేదల కోసం నిరంతరం పాటుపడుతున్న సీఎం కేసీఆర్ సారుకు రుణపడి ఉంటాం. ఆసరా పథకం ద్వారా నాకు నెలకు రూ.2వేల పింఛన్ ఇస్తున్నారు. దీంతో ఆర్థికంగా కాస్త ఊరట లభిస్తున్నది.
కేసీఆర్ కిట్ అందింది..
ప్రభుత్వ దవాఖానల్లో ఇస్తున్న కేసీఆర్ కిట్ చిన్నారులకు ఎంతో ఉపయోగపడుతున్నది. ఇందులో అన్ని రకాల వస్తువులు ఉంచడం సంతోషం. ప్రభుత్వ దవాఖానల్లో కాన్పులు చేసి, ఆడపిల్ల పుడితే రూ.13వేలు, మగపిల్లాడు పుడితే రూ.12వేలు అందించడం సంతోషం. కాన్పుల కోసం ప్రైవేట్లకు వెళ్లి ఇబ్బందులు పడకుండా సీఎం కేసీఆర్ ప్రభుత్వ దవాఖానల్లో అన్ని సౌకర్యాలు కల్పించడం మంచి నిర్ణయం.
పంట కొనుగోలుతో రైతులకు మేలు
రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిం ది. రైతులకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి పంటను కొనుగోలు చేస్తుండటంతో భరోసా పెరిగింది. మా గ్రామంలో వరి, మొక్కజొన్న, పత్తి కొనుగోలు కేంద్రాలు ఉండటంతో రైతులకు మేలు జరిగింది. 24గంటల కరెంట్, ఎరువులు, విత్తనాలు అందుతున్నాయి. గతంలో కంటే తెలంగాణ వచ్చిన తర్వాతనే రైతులు బాగుపడుతున్నారు.