16 సంవత్సరాలుగా మట్టి వినాయక విగ్రహాల ఏర్పాటు
పర్యావరణ పరిరక్షణే ధ్యేయం
సొంత డబ్బులతో పంపిణీ
చేవెళ్లటౌన్, సెప్టెంబర్ 8 : పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రచారం చేస్తుండడమే కాకుండా తాను స్వయంగా మట్టి వినాయకులను పంపిణీ చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు చేవెళ్ల గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు రామకృష్ణారావు. పర్యావరణ పరిరక్షణకు 16 ఏండ్ల నుంచి కృషి చేస్తున్నారు. ప్రతి సంవత్సరం తనకు తోచిన విధంగా అవగాహన కల్పిస్తున్నారు. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే పర్యావరణ పరిరక్షణకు పాటు పడుతున్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో తయారు చేసే విగ్రహాల వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని తన వంతు ప్రచారం 16ఏండ్లుగా కొనసాగుతున్నది. మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తూ అవగాహన కల్పిస్తున్నారు. ఈ ఏడాది కూడా వెయ్యి విగ్రహాలను పంపిణీ చేస్తున్నారు.
ప్రజల్లో మార్పు వస్తుంది..
ప్రజల్లో చాలా మార్పు వచ్చింది. 16ఏండ్లుగా పర్యావరణ పరిరక్షణ పైన చేసిన పోరాటం వల్ల ప్రజల్లో మార్పు వస్తుంది. మొదట్లో పర్యావరణం పై అవగాహన కల్పించేందుకు సమావేశాలు ఏర్పాటు చేశాం. ప్రతి సంవత్సరం ప్రజల్లో మార్పు కనిపిస్తున్నది. ఇప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా మట్టి వినాయకులను ప్రతిష్టించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. సొంత డబ్బులతో విగ్రహాలను కొని పంపిణీ చేస్తున్నాను. మొదట 100 విగ్రహాలతో మొదలు పెట్టి ఇప్పుడు రెండు వేల విగ్రహాలను పంపిణీ చేస్తున్నాను.