సిటీబ్యూరో, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ ) : ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా తెరిచిన ఉస్మాన్సాగర్ (గండిపేట ) జలాశయం గేట్లను వరద ఉధృతి తగ్గడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గురువారం మధ్యాహ్నం 2 గంటలకు మూసివేశారు. భారీ వర్షాల కారణంగా ఉస్మాన్సాగర్ జలాశయానికి వరద నీటి ప్రవాహం పెరుగడంతో ఈ నెల 4న నాలుగు గేట్లను ఎత్తి నీటిని మూసీ నదిలోకి వదలడం ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే వారం రోజులుగా వర్షాలు తగ్గడంతో జలాశయానికి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. ఈ క్రమంలో ఒకో గేటును మూసేసిన అధికారులు, రిజర్వాయర్ నీటి మట్టం 1788.75 అడుగుల వద్దకు రాగానే చివరి గేటు మూసివేశారు. ఈ ఏడాది రెండుసార్లు ఉస్మాన్సాగర్ గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు వదిలినట్లు అధికారులు పేర్కొన్నారు. మొదటిసారి జూలై 22న గేట్లు తెరిచి వరద ఉధృతి తగ్గడంతో 25న మూసివేశారు. రెండోసారి సెప్టెంబర్ 4న గేట్లు తెరిచి ఈ నెల 16న చివరి గేటు మూసివేశారు. కాగా హిమాయత్సాగర్కు స్వల్పంగా వరద నీరు చేరుతున్నందున ఒక గేటు ద్వారా 350 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు అధికారులు ఈ సందర్భంగా చెప్పారు.
జంట జలాశయాల వివరాలు
హిమాయత్సాగర్
హిమాయత్సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం : 1763.50 అడుగులు
ప్రస్తుత నీటి స్థాయి : 1762.50 అడుగులు
రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం : 2.968 టీఎంసీలు
ప్రస్తుత సామర్థ్యం : 2.697 టీఎంసీలు
ఇన్ ఫ్లో : 500 క్యూసెకులు
అవుట్ ఫ్లో : 350 క్యూసెకులు
మొత్తం గేట్ల సంఖ్య : 17
ఎత్తిన గేట్ల సంఖ్య : 1
ఉస్మాన్సాగర్
ఉస్మాన్సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం : 1790 అడుగులు
ప్రస్తుత నీటి స్థాయి : 1788.75 అడుగులు
రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం : 3.90 టీఎంసీలు
ప్రస్తుత సామర్థ్యం : 3.614 టీఎంసీలు
మొత్తం గేట్ల సంఖ్య : 15
ఎత్తిన గేట్ల సంఖ్య : 0