రూ.848 కోట్లతో త్వరలో పనులు చేపడుతాం
లోతట్టుప్రాంతాల్లో నీరు నిల్వకుండా చర్యలు
విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి
ఎమ్మెల్యేలతో సమీక్షా సమావేశం
రంగారెడ్డి, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): భారీ వర్షాలు, వరదల వల్ల హైదరాబాద్ నగర పరిధిలో ప్రజలు ముంపు ముప్పుకు గురికాకుండా ఉండేందుకు రూ. 848 కోట్లతో శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపట్టనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డి వెల్లడించారు. మంగళవారం తన కార్యాలయంలో రాజేంద్రనగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, ఎల్.బి.నగర్ నియోజకవర్గాల సమస్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…రోడ్లపై వరదనీరైనా, కాలనీలను మంచెత్తే వర్షపు నీటినైనా ఎప్పటికప్పుడు తొలగించేందుకు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నగరంలో 5 నుంచి 10 సెంటీమీటర్ల వర్షం కురిసినా ఎలాంటి విపత్కర పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. చినుకు పడితే రోడ్లపై గంటల తరబడి ట్రాఫిక్ జామ్ కాకుండా, కాలనీలు రోజులు తరబడి వరద ముంపునకు గురికాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోబోతున్నామని చెప్పారు.
వర్షం పడితే నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి, సమస్యకు పరిష్కారాన్ని చూపబోతున్నామని తెలిపారు. వర్షాకాలం సమీపించగానే వరద తాకిడికి గురై పలు ప్రాంతాలు జలమయమవుతుండటంతో, భవిష్యత్లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. హైదరాబాద్ నగరంలోని చెరువులను అనుసంధానం చేస్తూ ఈ వర్షపు నీటిని త్వరితగతిన చెరువుల్లోకి చేరే విధంగా నగరంలోని పనులన్నింటినీ 15 ప్యాకేజీలుగా రూపొందించనున్నట్లు చెప్పారు. లోతట్టు ప్రాంతాల్లోని వర్షపునీటిని సమీపంలోని చెరువుల్లోకి వెళ్ళే విధంగా నిర్మాణాలను చేపట్టబోతున్నామన్నారు.వచ్చిన నీటిని వచ్చినట్లే వదులుతుండటం వల్ల ప్రమాదాలను నివారించేందుకు గొలుసుకట్టు చెరువులను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్రెడ్డి, సుధీర్రెడ్డి, ప్రకాశ్గౌడ్, ఇఎన్సి లెక్స్ సురేశ్కుమార్, ఎస్ఎన్డీపీ చీఫ్ ఇంజనీర్ వసంత, సూపరింటెండెంట్ ఇంజినీర్ మురళీకృష్ణ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
భార్యను కొట్టాననే మనస్థాపంతో భర్త ఆత్మహత్య
ఉచిత విద్యుత్ అందుకోనున్న 25వేల క్షౌరశాలలు
సీఎం కేసీఆర్ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ శుభాకాంక్షలు