హాజరైన ఎమ్మెల్సీ వాణీదేవి, జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీధర్, ఎమ్మెల్యేయాదయ్య పోటీ పరీక్షల దృష్ట్యా విద్యార్థుల సౌకర్యార్థం పాఠశాలకో గ్రంథాలయం ఏర్పాటు చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. గురువారం చేవెళ్ల మండలం కౌకుంట్లలో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్సీ వాణీదేవి, జడ్పీ చైర్ పర్సన్ అనితారెడ్డి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీధర్, ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణాలకు దీటుగా గ్రామాలను అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. అలాగే నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పెద్ద ఎత్తున జాబ్మేళాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
చేవెళ్ల రూరల్, సెప్టెంబర్ 23 : గ్రామాల్లో అభివృద్ధి విషయంలో ఎంత అవకాశముంటే అంతగా అభివృద్ధి చేయాలన్న సీఎం కేసీఆర్ సంకల్పానికి చేవెళ్ల మండల పరిధిలోని కౌకుంట్ల గ్రామం వేదిక కావడం.. గొప్ప కార్యక్రమాలను చేపట్టడం హర్షించదగ్గ విషయమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు.
అభివృద్ధి కార్యక్రమాలు..
రంగారెడ్డి జిల్లా పరిధి చేవెళ్ల నియోజకవర్గంలోని చేవెళ్ల మండల పరిధి కౌకుంట్ల గ్రామంలో రూ.20 లక్షలతో పల్లె ప్రకృతి వనం, పిల్లల ఆట స్థలం, రూ.6.5 లక్షలతో కంటైనర్ గ్రంథాలయం, రూ.6 లక్షలకు పైబడి నిధులతో సీసీ కెమెరాలు, రూ.25 లక్షలతో గుంతలను పూడ్చి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు, రూ.5లక్షలతో ఓపెన్ జిమ్ను మంత్రి సబితారెడ్డి జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, ఎమ్మెల్సీ సురభివాణీదేవి, ఎమ్మెల్యే యాదయ్యతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ.. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి పాఠశాలకో గ్రంథాలయాన్ని కేటాయించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రూ.10 కోట్లతో జిల్లావ్యాప్తంగా గ్రంథాలయాల ఏర్పాటులో భాగంగా పైలట్ ప్రాజెక్ట్ కింద కౌకుంట్ల గ్రామాన్ని ఎంపిక చేశామన్నారు. జిల్లాలోని పలు ప్రైవేట్ పరిశ్రమల్లో 11వేల ఉద్యోగ అవకాశాలు కల్పించామని తెలిపారు.
పోటీ పరీక్షల విద్యార్థులకు ప్రయోజనం
గ్రామీణ ప్రాంతాల్లో చదువుతున్న, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు గ్రంథాలయాలతో ప్రయోజనం ఉంటుందని రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ ఆయాచితం శ్రీధర్ అన్నారు. సీఎం కేసీఆర్ విద్యాభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు తమకు కావాల్సిన పుస్తకాలు పొందేందుకు రాష్ట్ర గ్రంథాలయ కార్యాలయానికి లెటర్ ద్వారా తెలిపిన వారం రోజుల్లో పుస్తకాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు.
విజ్ఞాన భాండాగారాలు..
గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. చేవెళ్ల నియోజకవర్గంలో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో కంటైనర్ గ్రంథాలయం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు.
జాబ్ మేళాకు విశేష స్పందన
కౌకుంట్లలో ఏర్పాటు చేసిన జాబ్ మేళాను మంత్రి సబితారెడ్డి ప్రారంభించారు. మేళాలో నేరుగా 221 మంది ఉద్యోగాలు పొందారు. వీరికి మంత్రి అర్హత పత్రాలు అందజేసి అభినందించారు. జిల్లాలో ఇప్పటివరకు 2351 మంది నియమితులు కాగా.. శిక్షణలో 340 మంది ఉన్నారు. జాబ్ మేళాకు 405 మంది అభ్యర్థులు హాజరుకాగా.. 221 మందిలో గుడ్టైమ్స్ (హైదరాబాద్)లో 30 మంది, అమెజాన్ 25, రిలయన్స్ ట్రెండ్స్ 20, గూగుల్ 15, టెలీ పెర్ఫామెన్స్ 22, జెన్ప్యాక్ట్ 18, యాక్సిస్ బ్యాంక్ 15, హెచ్డీఎఫ్సీ 23, ఈడబ్లూఆర్సీ 21, రెస్టీలో 32 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు.కార్యక్రమంలో రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల గ్రంథాలయాల సంస్థల చైర్మన్లు పాండురంగారెడ్డి, మురళీకృష్ణ, డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి, ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ మాలతి, వైస్ ఎంపీపీ ప్రసాద్, డీఆర్డీఏ పీడీ ప్రభాకర్, ఎంపీడీవో హరీశ్కుమార్, కౌకుంట్ల సర్పంచ్ గాయత్రి, ఎంపీటీసీ సుజాత, ఉప సర్పంచ్ నాయత్అలీ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రభాకర్, అంతారం సర్పంచ్ సులోచన, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.