రెండుమూడు రోజుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
జిల్లావ్యాప్తంగా 30 సెంటర్లు..
వారం రోజుల్లో కేంద్రాలకు రానున్న ధాన్యం
కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు
45 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడమే లక్ష్యంగా అధికారులు ముందుకు
రంగారెడ్డి, ఏప్రిల్ 15,(నమస్తే తెలంగాణ): జిల్లాలో యాసంగి సీజన్కు సంబంధించి ధాన్యం సేకరించేందుకు జిల్లా యంత్రాంగం అంతా సిద్ధం చేసింది. కరోనా దృష్ట్యా గతేడాది మాదిరిగానే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా గ్రామస్థాయిలోనే ధాన్యం కొనుగోలు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే జిల్లాలో వరి సాగవుతున్న గ్రామాలను బట్టి ఆయా గ్రామాల పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. ఒకేరోజు రైతులందరూ ధాన్యం కొనుగోలు కేంద్రానికి రాకుండా రోజుకు 1000 క్వింటాళ్లు ధాన్యాన్ని సేకరించేలా నిర్ణయించారు. ఈ ప్రకారమే రైతులు కొనుగోలు కేంద్రాలకు వచ్చేలా చర్యలు తీసుకున్నారు. జిల్లావ్యాప్తంగా 35,333 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. మరోవైపు కరోనా వైరస్ దృష్ట్యా కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు గుమిగూడకుండా సామాజిక దూరం పాటించే విధంగా, కొనుగోలు కేంద్రాల వద్ద నీటితోపాటు సబ్బు, శానిటైజర్ను ఏర్పాటు చేసేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అదేవిధంగా ధాన్యాన్ని విక్రయించిన రైతులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే ప్రభుత్వం ఆన్లైన్ ద్వారా జమ చేయనున్నది.
30 కేంద్రాలు…
జిల్లావ్యాప్తంగా మరో రెండు, మూడు రోజుల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభంకానుండగా.. మొత్తం 30 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. పీఏసీఎస్ ఆధ్వర్యంలో 15, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో 8, ఏఎంసీ ఆధ్వర్యంలో 3, పీఎస్సీఎస్ ఆధ్వర్యంలో 4 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. మొదట 26 కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినప్పటికీ పలు గ్రామాల రైతులు ధాన్యాన్ని దూరం తీసుకురావాల్సి వస్తుందన్న దృష్ట్యా కొనుగోలు కేంద్రాల సంఖ్యను మరో నాలుగుకు పెంచారు. యాసంగి సీజన్కుగాను 45 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడమే లక్ష్యంగా జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు ముందుకెళ్తున్నారు. ఏ గ్రామాల్లో అయితే వరి సాగు విస్తీర్ణం అధికంగా ఉందో సంబంధిత గ్రామాల పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు అధికారులు నిర్ణయించారు. తక్కువ విస్తీర్ణంలో సాగైన గ్రామాల రైతులు పక్క గ్రామానికి ధాన్యాన్ని తీసుకువచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ప్రభుత్వ సూచనల ప్రకారం ధాన్యాన్ని ఆరబెట్టిన అనంతరమే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాల్సి ఉంటుంది. ఒకేరోజు రైతులందరూ ధాన్యం కొనుగోలు కేంద్రానికి రాకుండా కొనుగోలు కేంద్రం వద్ద ఐదుగురు చొప్పున రైతులుండేలా అధికారులు జాగ్రత్తలు తీసుకోనున్నారు. రోజుకు 50 మంది రైతుల నుంచి 1000 క్వింటాళ్ల ధాన్యాన్ని సేకరించే విధంగా అధికారులు నిర్ణయించారు. మరోవైపు ప్రతి రైతు నుంచి కనీస మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టింది. ఏ గ్రేడ్ క్వింటాలుకు రూ.1888, సాధారణ గ్రేడ్ క్వింటాలుకు రూ.1868ల కనీస మద్దతు ధర రైతులకు చెల్లించి ధాన్యాన్ని సేకరించనున్నారు. ఈ ఏడాది ధాన్యం మద్దతు ధరను ప్రభుత్వం పెంచుతూ నిర్ణయించింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.51లను పెంచుతూ నిర్ణయించింది.