వీణవంక, మే 16: టీఆర్ఎస్ సర్కారు ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దుతున్నదని ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ వాల బాలకిషన్రావు పేర్కొన్నారు. మండలంలోని చల్లూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అభివృద్ధి పనులను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సర్కారు విద్యకు ప్రాధాన్యమిస్తూ బడుల్లో మౌలిక వసతులు మెరుగు పరుస్తున్నదన్నారు.
వాటిని కార్పొరేట్ సంస్థలకు దీటుగా తీర్చిదిద్దేందుకే మన ఊరు- మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమం అందుబాటులోకి వస్తుందని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ పొదిల జ్యోతి-రమేశ్, ఎంపీటీసీ ఎలవేన సవిత-మల్లయ్య, ఎంఈవో నర్సింహారెడ్డి, హెచ్ఎం చంద్రకళ, వార్డు సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.