ఉమ్మడి జిల్లాలో 4 వేల ఎకరాల సంరక్షణ
బోర్డులు పాతి, అక్రమ నిర్మాణాల కూల్చివేత
రిజిస్ట్రేషన్ కాకుండా రెవెన్యూకు సమాచారం
మరో 473 ఎకరాల సంరక్షణకు సన్నద్ధం
వరంగల్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : దేవుడి భూముల రక్షణకు ప్రభుత్వం నడుం బిగించింది. ఇన్నాళ్లూ వాటిని సొంతం చేసుకుని అనుభవిస్తున్న వారికి దేవాదాయ శాఖ చెక్ పెడుతున్నది. ఆలయ భూముల పరిరక్షణ కోసం చేపట్టిన స్పెషల్ డ్రైవ్ సత్ఫలితాలనిస్తున్నది. ఇప్పటికే నాలుగు దశలుగా ఈ ప్రక్రి య కొనసాగుతుండగా, చివరి దశకు చేరింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 299 ఆలయాలు ఉండగా, వీటి పరిధిలో 5004 ఎకరాల భూమి ఉంది. ఇందులో 4,531 ఎకరాల 38 గుంటలు తమ ఆధీనంలో ఉన్నట్లు దేవాదాయ శాఖ బోర్డులు ఏర్పాటు చేసింది. మరో 473 ఎకరాల సంరక్షణకు సన్నద్ధమవుతున్నది.
రాష్ట్ర ప్రభుత్వం 2016లో చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళనతో దేవాదాయ శాఖ భూ ముల పరిరక్షణకు ముందడుగు పడింది. రికార్డుల ప్రకారం ఆ శాఖ భూములే అయినా.. ఏండ్లుగా ఇతరుల కబ్జాలో ఉన్న భూములపై అధికారికంగా స్పష్టత వచ్చింది. ప్రభుత్వ విధాన నిర్ణయంతో ఆలయ భూములను ఆ శాఖ పేరుతోనే కొత్త పాసు పుస్తకాలు జారీ అయ్యాయి. వీటి ఆధారంగా భూముల పరిరక్షణ కోసం దేవాదాయ శాఖ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. ఆ శాఖ వరంగల్ అసిస్టెంట్ కమిషనర్ పరిధిలో ప్రస్తుతం ఆరు జిల్లాలు ఉన్నా యి. ప్రత్యేక బృందాలుగా ఆలయాల వారీగా అధికారులు భూముల వివరాలను సేకరించారు. అనంతరం కబ్జా లో ఉన్న వాటిని గుర్తించి వాటి వద్ద బోర్డులను ఏర్పాటు చేసే ప్రక్రియను మొదలుపెట్టారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నాలుగు దశల్లో 542 బోర్డుల ను ఏర్పాటు చేశారు. కోర్టు విచారణలు, తుది ఉత్తర్వులు పెండింగ్లో ఉన్న కారణంగా మరో 473 ఎకరాల భూముల వద్ద బోర్డుల ఏర్పాటు ప్రక్రియ పెండింగ్లో ఉంది. త్వరలోనే ఈ ప్రాంతాల్లోనూ బోర్డులను ఏర్పాటు చేసేలా దేవాదాయ శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
స్పెషల్ డ్రైవ్తో సాధ్యమైంది
దేవాదాయ భూముల పరిరక్షణ కోసం ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికి నాలుగు దశల్లో ఈ ప్రక్రియ జరిగింది. ఆరు జిల్లాల్లో కలిపి 5 వేల ఎకరాలకు 633 బోర్డులను ఏర్పాటు చేయాలని గుర్తించాం. 542 బోర్డు లను ఏర్పాటు చేశాం. కోర్టుల ఆదేశాల కోసం మరో 91 బోర్డులు పెండింగ్లో ఉన్నాయి. దేవాలయ భూములు కబ్జాలకు గురికాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాం. ప్రస్తుతం ఈ భూముల్లో కొందరు ఉన్నా వారికి ఎలాంటి అధికారిక రికార్డులు ఉండవు. ఎప్పటి కైనా అవి దేవాదాయ శాఖకు చెందినవే.