శంషాబాద్ రూరల్: మండలంలోని రషీద్గూడ గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 78-8లో ఉన్న ప్రభుత్వ భూమిలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. ఆక్రమణదారులు ప్రభుత్వ భూమిలో డైరీ ఫాం ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు ఉన్నతాధికారులకు నివేదిక అందజేసి అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఈ సందర్భంగా రెవెన్యూ అధికారులు మాట్లాడుతూ ప్రభుత్వ భూములను కబ్జా చేయడానికి యత్నిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. నిర్మాణాలు చేపడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కూల్చివేతలలో ఆర్ఐ సంజీవ, పలువురు అధికారులు ఉన్నారు.