దోమకొండ, సెప్టెంబర్ 2 : పేదల ప్రజల సంక్షేమం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పేర్కొన్నారు. దోమకొండ మండల కేంద్రంలోని జేఎస్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం నిర్వహించిన ఆసరా పింఛన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రాష్ట్ర ప్రజల సంక్షేమానికి కేసీఆర్ కట్టుబడి ఉన్నాడని అన్నారు. దేశంలో ఎనిమిది రాష్ట్రాల్లో బీడీకార్మికులుంటే ఒక్క తెలంగాణాలోనే బీడీ పింఛన్లను పంపిణీ చేస్తున్నట్లు గుర్తు చేశారు. బీజేపీ నాయకులు మతవిధ్వేషాలను రెచ్చగొట్టేలా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారని ఆగ్ర హం వ్యక్తం చేశారు. ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరపడ్డాయని అన్నారు.
మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో రైతులకు 9 గంటల కరెంటు ఇచ్చి బిల్లులు వసూలు చేస్తున్నారని ఆదే తెలంగాణలో 24 గంటల ఉచిత కరెంటు సరఫరా చేస్తూ రైతుల పక్షపాతిగా నిలిచారని అన్నారు. నిన్నవచ్చిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పాలు, పెరుగుపై జీఎస్టీ వేస్తూ సామాన్యులకు భారంగా నిలిచిందన్నారు. లక్షల కోట్లు అప్పు లు చేసి దేశం వదిలి పారిపోతుంటే మోదీ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల పక్షమని అన్నారు.
అనంతరం లబ్ధిదారులకు ఆసరా పింఛన్కార్డులను ప్రభుత్వవిప్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబుద్దీన్, మార్కెట్కమిటీ చైర్మన్ కుంచాల శేఖర్, జడ్పీటీసీ తిర్మల్గౌడ్, ఎంపీపీ శారద, సర్పంచ్ అంజలి, రైతుబంధు సమితి అధ్యక్షుడు నర్సారెడ్డి, సింగిల్విండో చైర్మన్లు నాగరాజురెడ్డి, తిరుపతిగౌడ్, పార్టీ మండలాధ్యక్షుడు గండ్ర మధుసూదన్రావు, నాయకులు శ్రీనివాస్, శేఖర్, నాగరాజు, ఎంపీడీవో చిన్నారెడ్డి, తహసీల్దార్ శాంత, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
దోమకొండ మండల కేంద్రంలోని సీహెచ్సీని వందపడకల దవాఖానగా మార్చాలని కోరుతూ ప్రభుత్వవిప్ గంపగోవర్ధన్కు జడ్పీటీసీ తిర్మల్గౌడ్, ఎంపీపీ శారద వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… వైద్యం కోసం కామారెడ్డి, హైదరాబాద్కు వెళ్లాల్సి వస్తోందన్నారు. జిల్లాకు మంజూరైన వందపడకల దవాఖానను దోమకొండ మండలానికి కేటాయించాలని, దవాఖానలో గైనిక్ వైద్యురాలిని నియమించాలని కోరారు.
బీబీపేట్, సెప్టెంబర్ 2 : మండల కేంద్రంలోని ఎస్ఆర్ఎం గార్డెన్లో కొత్తగా మంజూరైన పింఛన్ కార్డులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో మొత్తం 770 మందికి కొత్తగా పింఛన్లు మంజూరయ్యాయని తెలిపారు. ఇప్పటికీ అర్హులై ఉండి పింఛన్ రాని వాళ్లు ఉంటే వారికి కూడా వచ్చేలా చూస్తామని చెప్పారు. కేంద్రం ప్రభుత్వ తీరుపై విప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమీలేదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక అసత్య ఆరోపణలు చేస్తున్నాయని అన్నారు. అనంతరం మండలంలోని వీఆర్ఏలు తమ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వ విప్నకు వినతి ప్రతాన్ని అందజేశారు.
తల్లి ప్రాణం బాగా లేకున్నా మా కోసం వచ్చి పింఛన్ కార్డు అందజేసిన ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ను భగవంతుడు ఆయురారోగ్యాలతో సల్లంగా చూడాలని లబ్ధిదారులు ఆశీర్వదించారు. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ తల్లి ఆరోగ్యం గురించి ఆయనను టీఆర్ఎస్ నాయకులు, స్థానికులు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ పరికి ప్రేమ్కుమార్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, ఎంపీపీ బాలామణి, సర్పంచ్ లక్ష్మి, వైస్ ఎంపీపీ రవీందర్రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు, టీఆర్ఎస్ నాయకులు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, లబ్ధిదారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.