సంక్షేమానికి పెద్దపీట వేస్తూ.. వ్యవసాయ, అనుబంధ రంగాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రగతి పథంలో దూసుకుపోతున్నది. అన్ని రంగాల్లో స్పష్టమైన ప్రగతి సాక్షాత్కరిస్తున్నది. ప్రజల మనుగడకు అవసరమైన మార్పు, కూర్పుల మేళవింపుతో పురోగతి సాధిస్తున్నది. 75 ఏండ్ల స్వేచ్ఛా భారతంలో నిజమైన స్వాతంత్య్ర స్ఫూర్తిని చాటుతున్న తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అభివృద్ధి పరుగులు పెడుతున్నది. ఆసరా పింఛన్లు, మిషన్ భగీరథ, కేసీఆర్ కిట్, నిరంతర విద్యుత్, హరితహారం, రైతుబంధు, రైతుబీమాలాంటి మరెన్నో అద్భుతమైన సంక్షేమ పథకాలతో సీఎం కేసీఆర్ సగర్వంగా తలెత్తుకునేలా చేశారు. ఎనిమిదేండ్ల కాలంలో కేసీఆర్ పరిపాలన తీరుతెన్నులతో సాకారమైన పలు అద్భుత ఘట్టాలపై వజ్రోత్సవ వేళ ప్రత్యేక కథనం.
నిజామాబాద్, ఆగస్టు 14(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
కరువు చీకట్ల నుంచి వెలుగు వాకిట్ల వరకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రస్థానం ప్రగతి పంథాలో సాగుతున్నది. స్వతంత్ర భారత వజ్రోత్సవ వేళ అన్ని రంగాల్లో అభివృద్ధిని అక్కున చేర్చుకుంటున్నది. పల్లె వాకిట్లో కనిపిస్తున్న మార్పులకు తోడుగా పట్టణ వీధుల్లోనూ అసలైన వికాసం దరి చేరుతున్నది. అక్షర చైతన్యం అండగా నిలబడుతూ ఉజ్వల భవితకు వారధి వేస్తున్నది. పాలనా సౌలభ్యం కోసం జరుగుతున్న వికేంద్రీకరణ ఫలాల్ని అందిస్తున్నది.
ప్రజల మనుగడకు అవసరమైన మార్పు, కూర్పుల మేళవింపుతో పురోగతి ముందడుగు వేస్తున్నది. అంచెలంచెలుగా రెండు జిల్లాల ఖ్యాతి వృద్ధి పథాన పయనిస్తున్నది. స్వాతంత్య్రం కోసం పోరుసల్పిన నాటి పరిస్థితులు… నేటి పరిస్థితుల్లో కనిపిస్తున్న మార్పుల సమాహారం సీఎం కేసీఆర్ కృషికి తార్కాణంగా నిలుస్తున్నది. 75 ఏండ్ల స్వేచ్ఛా భారతంలో నిజమైన స్వాతంత్య్ర స్ఫూర్తిని చాటుతున్న సముజ్వల తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రగతిలో పరుగులు తీస్తున్నది. ఎనిమిదేండ్లలో కేసీఆర్ పరిపాలన తీరుతెన్నులతో సాకారమైన పలు అద్భుత ఘట్టాలపై స్వతంత్ర భారత వజ్రోత్సవ వేళ ప్రత్యేక కథనం.
స్వరాష్ట్రంలో ప్రభుత్వ దవాఖానల రూపురేఖలు మారాయి. కేసీఆర్ కిట్ పథకం ద్వారా ప్రసవాలు ప్రభుత్వ దవాఖానల్లో భారీగా పెరిగాయి. ఉచిత ప్రసవాలను గణనీయంగా పెంచిన ప్రభుత్వమే ఇప్పుడు మహిళల ఆరోగ్యంపై ఫోకస్ పెట్టింది. ఇప్పుడు ప్రభుత్వ దవాఖానల్లో ప్రైవేటు దీటుగా ప్రసవాలు జరుగుతున్నాయి. ప్రసవాలు చేయించుకున్న వారికి రూ.2వేలు విలువ చేసే కేసీఆర్ కిట్ అందుతున్నది. 2021-22లో జరిగిన ప్రసవాలు చూస్తే ఆశ్చర్యపోవడం తప్పదు. ప్రభుత్వ దవాఖానల్లో 10,992 కాన్పులు, ప్రైవేటులో 13,499 ప్రసవాలు జరిగాయి.
ఎనిమిదేండ్లుగా నిరాటంకంగా అమలవుతున్న పింఛన్లతో పేద కుటుంబాల్లో ఆనందం వ్యక్తమవుతున్నది. పెరిగిన పింఛన్ డబ్బులను మూడున్నరేండ్లుగా రూ.1000 నుంచి రూ.2016 కు, ఇక దివ్యాంగుల పింఛన్లు సైతం రూ.1500 నుంచి రూ.3016 చొప్పున అందిస్తున్నారు. వారంతా సంతోషం వెలిబుచ్చుతున్నారు. మొత్తం గా పింఛన్ను డబుల్ చేయగా… అర్హత వయస్సును 57ఏండ్లకు తగ్గించడంతో మరెంతో మందికి ఈ ప్రయోజనం దరి చేరబోతున్నది. స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా నేటి నుంచి కొత్త వారికి సైతం పింఛన్లు మంజూరు కానున్నాయి. ఉభయ జిల్లాల్లో సుమారుగా 50వేల మందికి ప్రయోజనం దక్కనున్నది.
బిందెలు ఎత్తుకొని సుదూరాలకు వెళ్లి యాతన పడాల్సిన ఖర్మకు చెక్ పెట్టారు. జుక్కల్ లాంటి వెనుకబాటుకు గురైన ప్రాంతాల్లో మండుటెండల్లోనూ దప్పిక తీర్చే ఏర్పాట్లు జరగడం కేసీఆర్ గొప్పతనమే. ఉభయ జిల్లాలకు మిషన్ భగీరథ నీరు సింగూర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల నుంచి సరఫరా అవుతున్నాయి. నిజామాబాద్లో రూ.381.67కోట్లతో 2,859.27 కిలో మీటర్ల పైప్లైన్ ద్వారా 805 ఆవాసాలకు మిషన్ భగీరథ చేరింది. 2లక్షల 97వేల 964 నల్లాలు బిగించి ఇంటింటికీ స్వచ్ఛమైన నీరు అందిస్తున్నారు. కామారెడ్డిలో రూ.312.19 కోట్లతో 2,251కి.మీ పైప్లైన్ ద్వారా 876 ఆవాసాల పరిధిలో 2లక్షల 54వేల722 నల్లాలు బిగించి తాగునీరు సరఫరా చేస్తున్నారు.
తరిగిపోతున్న అడవులను 33శాతానికి పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం ఎనిమిదో విడుత హరితహారం ముమ్మరంగా సాగుతున్నది. నిజామాబాద్ జిల్లాలోని 29 మండలాల్లో 530 గ్రామ పంచాయతీలు, కామారెడ్డి జిల్లాలో 22 మండలాల్లో 526 జీపీల్లో వేలాది మొక్కలను నాటుతున్నారు. అటవీ భూములు, ప్రైవేటు కార్యాలయాలు, విద్యా సంస్థలు, రహదారులు, పొలం, కాలువ గట్లు, ఆలయాలు, ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటేలా కార్యాచరణ సాగుతున్నది. నిజామాబాద్ జిల్లాలో 86,904.55 హెక్టార్లు, కామారెడ్డి జిల్లాలో 82,190.48 హెక్టార్ల విస్తీర్ణంలో అడవులున్నాయి.
ఎనిమిదేండ్ల కాలంలో సీఎం కేసీఆర్ రాగద్వేషాలకు అతీతంగా, సమానత్వమే పరమావధిగా పరిపాలనను అందిస్తున్నారు. పరమత సహనంతో అన్నిమతాలను గౌరవిస్తూ అందరి మనోభావాలకు అనుగుణంగా నడుచుకుంటున్నారు. రంజాన్, క్రిస్మస్, బతుకమ్మ పండుగలను ప్రభుత్వమే ఘనంగా నిర్వహిస్తూ కానుకలు అందిస్తూ ప్రజలను కంటికి రెప్పలా సీఎం కేసీఆర్ చూసుకుంటున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాన్ని సంరక్షిస్తూ భావి తరాలకు మన గొప్పతనం తెలిసేలా ప్రోత్సహిస్తున్నారు.
హైదరాబాద్కే పరిమితమైన ఐటీ పరిశ్రమలను గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు విస్తరించారు. స్థానిక యువతకు ఉపాధి మార్గాలను చూపించాలని తలచి ఐటీ మంత్రి కేటీఆర్ చొరవతో నిజామాబాద్లో ఐటీ టవర్ ఏర్పాటైంది. నిజామాబాద్ బైపాస్ రోడ్డుకు ఆనుకొని ఉన్న 3.5 ఎకరాల ప్రభుత్వ భూమిలో రూ.50కోట్లతో నిర్మించారు. 2018, ఆగస్టు 1వ తారీఖున భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయగా ప్రారంభానికి సిద్ధమైంది. సుమారు 15 ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాలు నిర్వహించుకునేలా మౌలిక సదుపాయాలు కల్పించారు. దాదాపు 1500 నుంచి 2వేల మందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి.
కులవృత్తులు ఆధారంగా చేసుకొని బతుకీడ్చే అభాగ్యులను పట్టించుకున్న వాళ్లే లేరు. గ్రామీణ జీవన వ్యవస్థలో భాగమైన ఆయా కుల వృత్తులకు ప్రోత్సాహం అందించాలని కేసీఆర్ నిర్ణయించి ప్రభుత్వమే గొల్ల కుర్మలకు భారీ రాయితీలతో గొర్రెల యూనిట్లను అందిస్తున్నారు. మత్స్యకారుల అభివృద్ధికి చెరువుల్లో ఉచితంగా చేపపిల్లలను వదులుతున్నారు. క్షౌర వృత్తిలో కొనసాగుతున్న వారికి 250యూనిట్ల పరిధిలో ఉచిత కరెంట్తో కొండంత అండగా నిలవడం ఏడు దశాబ్దాల్లో ఇదే తొలిసారి. కేసీఆర్ ఆలోచనతో ఉమ్మడి జిల్లాలో వేలాది మంది రజక, నాయీ బ్రాహ్మణ వర్గాలకు లబ్ధి జరుగుతోంది. 4వేల సెలూన్లు ఉండగా 3వేల మందికి ప్రయోజనం చేకూరుతున్నది.
జాతీయ సగటు విద్యుత్ వినియోగం 1122 మెగావాట్స్ కాగా, రాష్ట్రంలో సగటు విద్యుత్ వినియోగం 1505 మెగావాట్స్గా ఉంది. ఇది ప్రజల జీవన విధానంలో మెరుగుపడిన పరిస్థితికి అద్దం పడుతున్నది. జాతీయ సగటు విద్యుత్ వినియోగంతో పోలిస్తే రాష్ట్రంలో సగటు విద్యుత్ వినియోగమే ఎక్కువగా ఉండడం సాధారణ విషయమేమీ కాదు. గతంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో త్రీఫేజ్ విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా ఉండేది.
పేరుకు తొమ్మిది గంటల విద్యుత్తు సరఫరా, బోరుబావుల్లో సమృద్ధిగా నీరున్నా పంటలకు అందక రైతులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కోకొల్లలు. రైతులకు కరెంట్ కష్టాలు తొలగించేందుకు ప్రభుత్వం 2018, జనవరి 1వ తారీఖు నుంచి సాగుకు నిరంతరం విద్యుత్ సరఫరా మొదలుపెట్టింది. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 7లక్షల 73 వేల విద్యుత్ కనెక్షన్లలో 1,75,765 వ్యవసాయ కనెక్షన్లున్నాయి. కామారెడ్డి జిల్లాలో మొత్తం 3లక్షల 74వేల 46 విద్యుత్ కనెక్షన్లలో 95,901 వ్యవసాయ కనెక్షన్లున్నాయి. ఉమ్మడి జిల్లాలో 2లక్షల 71వేల 666 వ్యవసాయ కనెక్షన్లకు ఉచిత కరెంట్ అందుతున్నది.
వ్యవసాయం అంటే 8 ఏండ్ల క్రితం నరకయాతన. ఇప్పుడదీ పండుగ వాతావరణం. నాట్లు వేసిన రోజు నుంచి పంటను అమ్ముకునే దాకా అన్నింటా కేసీఆర్ అండగా నిలిచి రైతును నష్టాల ఊబి నుంచి బయట పడేస్తున్నారు. రైతుబీమా, రైతుబంధు, సాగుకు నీళ్లు, సకాలంలో ఎరువులు, విత్తనాలు కల్పించడంతో ఇబ్బందులనేవి నామరూపాల్లేకుండా పోయాయి. 2018 వానకాలం నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా రైతుబంధు పథకం ద్వారా పంపిణీ చేసిన మొత్తం విలువ 50వేల కోట్ల రూపాయలు. ఇందులో ఉమ్మడి జిల్లా వాటా ఏకంగా రూ.4వేల కోట్లపైమాటే. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో రైతుబంధు ద్వారా 5లక్షల 48వేల 140 మంది రైతులకు మేలు చేకూరుతున్నది. రైతుబీమా ద్వారా రెండు జిల్లాలో 6వేల కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం అందింది.