ఇందూరు, ఆగస్టు 10 : స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంతో పాటు అన్ని మున్సిపల్, మండలకేంద్రాల్లో జాతీయస్ఫూర్తిని చాటేలా గురువారం ఫ్రీడం రన్ నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. కలెక్టరేట్లోని ప్రగతిభవన్లో వివిధ శాఖల అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించి ఫ్రీడం రన్ ఏర్పాట్లపై చర్చించారు. ఉదయం ఆరు గంటలకు జిల్లాకేంద్రంలోని పూలాంగ్ చౌరస్తా వద్ద ర్యాలీ ప్రారంభమవుతుందని, కలెక్టరేట్ వరకు ర్యాలీ కొనసాగుతుందని తెలిపారు.
ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పోలీసుసిబ్బంది, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ వలంటీర్లు విద్యార్థులు, వివిధ సంస్థల ప్రతినిధులు, యువత పెద్దసంఖ్యలో పాల్గొనాలని కోరారు. ర్యాలీ ముగిసిన అనంతరం కలెక్టరేట్ మైదానంలో యోగా, ఉషూ ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. సమావేశంలో డీసీపీ అరవింద్బాబు, నిజామాబాద్ ఏసీపీ వెంకటేశ్వర్లు, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి ముత్తెన్న, కలెక్టరేట్ ఏవో ప్రశాంత్ పాల్గొన్నారు.
ఇందూరు, ఆగస్టు 10 : స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఈనెల 16వ తేదీన కలెక్టరేట్లోని ప్రగతిభవన్లో కవి సమ్మేళనం నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. త్యాగధనుల స్ఫూర్తిని కొనియాడేలా 20 నుంచి 25 లైన్ల వరకు కవులు తమ కవితలు రచించాలని పేర్కొన్నారు. దేశ గౌరవానికి భంగం కలిగించకుండా వ్యతిరేక, వ్యంగ్యాత్మక భావన రానీయకుండా రచన ఉండాలని స్పష్టంచేశారు.
కవితలను ఈనెల 13 వరకు టీయూ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ డాక్టర్ వంగరి త్రివేణి 9951444803 నంబర్కు వాట్సాప్ చేయాలని సూచించారు. నిర్దేశించిన సమయంలోగా కవితలు పంపాలని, లేకపోతే కవి సమ్మేళనంలో పాల్గొనే అవకాశం ఉండదని పేర్కొన్నారు. జిల్లా కవులు తమ కవితలు పంపి కవి సమ్మేళనంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.