గులాబ్ తుఫాన్ గర్జనకు ఉమ్మడి జిల్లా వణికిపోయింది. భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవడంతో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు అల్లాడిపోయాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా జక్రాన్పల్లిలో 22 సెం.మీ. ధర్పల్లిలో 20.15 సెం.మీ వర్షం పడింది. సోమవారం సాయంత్రం నుంచి 13 గంటలపాటు ఏకధాటిగా కురిసిన వానలకు వాగులు, వంకలు పొంగిపొర్లాయి. పలుచోట్ల చెరువు కట్టలు తెగిపోగా, రహదారులు ధ్వంసమయ్యాయి. వేల ఎకరాల్లో పంటనష్టం వాటిల్లింది. వరదల్లో కొట్టుకుపోయి ముగ్గురు మృత్యువాతపడ్డారు. భారీవర్షాలకు తోడు ఎగువన ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో మంజీర, గోదావరి నదుల్లో ప్రవాహ ఉధృతి ప్రమాదకరస్థాయికి చేరింది. మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, అధికారులు, ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు వరద సహాయక చర్యలను సమీక్షిస్తున్నారు.
నిజామాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) :గులాబ్ తుఫాన్ ఉమ్మడి జిల్లాలను అతలాకుతలం చేసింది. సోమ, మంగళవారాల్లో కురిసిన అతి భారీ వర్షాలతో తీవ్రమైన నష్టాలను మిగిల్చింది. కుండపోత వానలతో ఉభయ జిల్లాల్లో అనేక చెరువులు, కుంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆర్అండ్బీ, పంచాయతీ రాజ్ రహదారులు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. పలు గ్రామాల్లో ఇండ్లు కూలడంతో ఆస్తి నష్టం సంభవించగా భారీ వర్షంతో రెండు జిల్లాల్లో ముగ్గురు మృత్యువాత పడ్డారు. ప్రభుత్వ హెచ్చరికలతో పునరావాస ఏర్పాట్లతో జనాలకు ఇక్కట్లు లేకుండా యంత్రాంగం చర్యలు చేపట్టింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో సుమారు లక్ష ఎకరాల పొలాలు నీట మునిగినట్లుగా వ్యవసాయాధికారులు గుర్తించారు. నిజామాబాద్ జిల్లాలో 10వేల ఎకరాల్లో పంట నష్టం సంభవించినట్లుగా వెల్లడించారు.
జక్రాన్పల్లిలో రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 51 మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. జక్రాన్పల్లి మండలంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 22.89 సెం.మీటర్లు మేర వాన కురిసింది. ధర్పల్లిలో 20.15 సెం.మీ, ఇందల్వాయిలో 19.48 సెం.మీ, రెంజల్లో 18.46 సెం.మీ, డిచ్పల్లిలో 17.36 సెం.మీ, నిజామాబాద్ నగరంలో 17.23 సెం.మీ, సిరికొండలో 17.32 సెం.మీ, నవీపేటలో 17.11 సెం.మీ, మాక్లూర్లో 16.25 సెం.మీ, ఆర్మూర్లో 16.23 సెం.మీ, బోధన్లో 15.97 సెం.మీటర్ల వాన పడినట్లుగా అధికారులు వెల్లడించారు. కుండపోత వానలు జిల్లా వ్యాప్తంగా ఏకకాలంలో నమోదు కావడం పదేండ్లలో ఇదే తొలిసారి అని నిజామాబాద్ అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు.
తెగిన రోడ్లు…స్తంభించిన జనజీవనం…
ఇందల్వాయి మండలం గౌరారం వద్ద బీటీ రోడ్డు కుంగిపోయింది. డిచ్పల్లి మండలం నడిపల్లి వద్ద నిజామాబాద్ – హైదరాబాద్ ప్రధాన రోడ్డుపైకి మోకాలు లోతు నీళ్లు చేరడంతో కొన్ని గంటల పాటు రాకపోకలు స్తంభించాయి. మాక్లూర్ మండలం అమ్రాద్ తండాకు వెళ్లే మార్గంలో బీటీ రోడ్డు కోతకు గురైంది. కమ్మర్పల్లి మండలం పులిగండి కుంట కట్ట తెగడంతో స్థానికులే మరమ్మతులు చేపట్టారు. వేల్పూర్ మండలంలోని మోతె వంతెనపై నుంచి వరద నీరు పారడంతో రాకపోకలు స్తంభించాయి. సిరికొండ మండలం తూంపల్లి – పాకాల రోడ్డులో బీటీ రోడ్డు కోతకు గురైంది. ఇదే ప్రాంతంలో కల్వర్టు కొట్టుకుపోయింది. పెద్ద వాల్గోట్లో నూతనంగా నిర్మించిన శ్మశాన వాటిక కుప్పకూలింది. జక్రాన్పల్లి మండలం సికింద్రాపూర్ -కేశ్పల్లి మధ్య బీటీ రోడ్డు తెగిపోయింది. ధర్పల్లి – వాడి మధ్య వాడి వాగు ఉగ్రరూపంతో రాకపోకలు నిలిచాయి. ధర్పల్లి పెద్ద చెరువు అలుగు పారడంతో సీతాయిపేట – ధర్పల్లి మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. బోధన్ మండలం లంగ్డాపూర్లో వాగు ఉప్పొంగడంతో దారులు మూసుకు పోయాయి. భీంగల్ – బెజ్జోరకు మధ్య వాగు నీటితో రాకపోకలు నిలిచాయి.
రాత్రంతా వానే..
తుపాన్ ప్రభావంతో నిజామాబాద్ జిల్లా కేంద్రంతోపాటుగా చుట్టు పక్కల ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం 6గంటల నుంచి మొదలైన వాన మంగళవారం తెల్లవారేదాకా కురిసింది. నగరంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. కొత్త కలెక్టరేట్ సమీపంలో వరద నీరు భారీగా నిలవడంతో అటు వైపు వాహనాలు వెళ్లనీయకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. నగరం మధ్యలో నుంచి వెళ్లే ఫూలాంగ్ వాగు ఉధృతంగా ప్రవహించింది.
నీటముగిన పంట పొలాలు
కామారెడ్డి/కామారెడ్డి టౌన్, సెప్టెంబర్ 28: గులాబ్ తుఫాన్ నేపథ్యంలో కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షంతో పంటలు నీటమునిగాయి. సింగూర్ జలాలు వస్తుండడంతో నాగిరెడ్డిపేట మండలంలోని ఏడు గ్రామాల్లో 400 ఎకరాల వరి పంట నీట మునిగింది. చెరువులు, కుంటలు నిండడంతో కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. రాజంపేట, శివాయిపల్లి గ్రామాలను సందర్శించి వర్షంపై ఆరా తీశారు. అత్యవసర పరిస్థితుల్లో కంట్రోల్ రూం నంబర్లు 94906 17633, 08468 226633 సంప్రదించాలని సూచించారు. జిల్లాలో సరాసరి వర్షపాతం 88.6మిల్లీమీటర్లుగా నమోదయ్యింది. లింగంపేట్ మండలంలో 70.2మి.మీ., బాన్సువాడలో 87.2మి.మీ, తాడ్వాయిలో 66.8మి.మీ, ఎల్లారెడ్డిలో 58.4మి.మీ., గాంధారిలో 63.2మి.మీ, నాగిరెడ్డిపేట్లో 102.8 మి.మీ, పిట్లంలో 78.2 మి.మీ., బిచ్కుందలో 73.6మి.మీ., బీర్కూర్లో 70మి.మీ., సదాశివనగర్లో 64.6మి. మీ., జుక్కల్ 149.6మి.మీ., నిజాంసాగర్లో 129.8మి.మీ., భిక్కనూర్లో 97మి.మీ, మద్నూర్లో 87మి.మీ., కామారెడ్డిలో 91.2మి.మీ., దోమకొండలో 120మి.మీ., మాచారెడ్డి మండలంలో 97.4మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం రాంపూర్ వాగుతో మండల కేంద్రానికి రాకపోకలు నిలిచాయి.
ముగ్గురు మృతి
డిచ్పల్లి/ కామారెడ్డి రూరల్, సెప్టెంబర్ 28: రెండు రోజులపాటు కురిసిన భారీ వర్షానికి ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మృత్యువాతపడ్డారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోని సుద్దపల్లి తండాకు చెందిన అజ్మీరాబాబు (30) సోమవారం సాయంత్రం చేపలు పట్టేందుకు వెళ్లి సామ్ చెరువులో పడి మృతి చెందా డు. యానంపల్లి తండాకు చెందిన భూక్యా మోతీలాల్(52) మంగళవారం ఉదయం పంట పొలం వద్దకు వెళ్లగా ఒక్కసారిగా వాగులో వరద పోటెత్తడంతో కాలువలో పడి మృతి చెందాడు. కామారెడ్డి జిల్లా లింగాపూర్ గ్రామానికి చెందిన భగవాన్రెడ్డి(55) మంగళవారం ఉదయం బైక్పై వస్తుండగా గ్రామ చెరువు అలుగు ప్రవాహంలో కొట్టుకుపోయాడు. గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని బయటికి తీశారు.
వరదలో చిక్కుకున్న వాహనాలు..
భీమ్గల్ / నిజామాబాద్ రూరల్ / మాచారెడ్డి / సదాశివనగర్, సెప్టెంబర్ 28 : నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం గోన్గొప్పుల,సికింద్రాపూర్ గ్రామాల మధ్య ఉన్న ఒర్రెలో మంగళవారం ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో గ్యాస్ సిలిండర్ల లోడుతో వెళ్తున్న లారీ వరదలో చిక్కుకున్నది. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై ప్రభాకర్ తన సిబ్బందితో కలిసి వరదలో చిక్కుకున్న డ్రైవర్ను రక్షించారు. నిజామాబాద్ రూరల్ మండలంలోని ముత్తకుంట గ్రామశివారులో ఉన్న బాలమ్మ వాగులో టైల్స్ లోడ్తో వెళ్తున్న లారీ ఉదయం 7గంటలకు చిక్కుకున్నది డ్రైవర్తోపాటు మరో ఆరుగురు కూలీలు కేకలు వేశారు. వాగు పక్కనే నివాసముంటున్న మల్లాగౌడ్ సర్పంచ్కు సమాచారం అందించారు. సర్పంచ్ జలందర్గౌడ్ నేతృత్వంలో యువకులు 8 గంటలకు చేరుకొని తాడు సాయంతో ఒక్కొక్కరినీ సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. మాచారెడ్డి మండలం ఫరీద్పేట వద్ద ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఆటో పెద్దవాగులో చిక్కుకున్నది. స్థానికుల సహాయంతో ట్రాక్టర్కు తాడు కట్టి ఆటోను ఒడ్డుకు చేర్చారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డి వాగులో ఉదయం 6 గంటలకు టాటాసుమో చిక్కుకున్నది. సుమోలోని మేస్త్రీలు సందీప్, మాధవ్, డ్రైవర్ సందీప్ వాహనంపైకి ఎక్కి కేకలు వేశారు. గమనించిన అడ్లూర్ గ్రామస్తులు ట్రాక్టర్ సహాయంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురితోపాటు టాటాసుమోను ఒడ్డుకు చేర్చారు.