నిజామాబాద్ రూరల్, సెప్టెంబర్ 26: పేద, మధ్య తరగతి ప్రజల రవాణాకు సేవలను అందిస్తున్న ఆర్టీసీని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటుపరం చేసే ఆలోచన సీఎం కేసీఆర్కు లేదని టీఎస్ ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ స్పష్టం చేశారు. ఆర్టీసీ చైర్మన్గా నియమితులైన అనంతరం తొలిసారి ఆదివారం నిజామాబాద్ జిల్లాకు వచ్చిన ఆయన నగర శివారులోని రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆర్టీసీ అధికారులతో సమీక్షించారు. అనంతరం విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి మాట్లాడారు. కొన్ని దుబారా ఖర్చులు ఉండడంతో ఆర్టీసీ నష్టాల బాటలో నడుస్తున్నదని అన్నారు. ఒకే రూట్లో ఎక్కువ బస్సులు తిరగడం కూడా నష్టాలకు కారణమని తెలిపారు. హైదరాబాద్లో సిటీ బస్సులతో నెలకు రూ.మూడు కోట్ల నష్టం, గ్రామీణ ప్రాంతాల్లో పల్లె వెలుగు బస్సులు నడపడం ద్వారా కూడా ఆశించిన స్థాయిలో ఆదాయం రావడం లేదన్నారు. కరోనాకు ముందు ఆర్టీసీకి నెలకు రూ.14కోట్ల ఆదాయం వచ్చేదని, ప్రస్తుతం నెలకు రూ.మూడు కోట్ల ఆదాయం మాత్రమే వస్తుందని చెప్పారు. కరోనా నేపథ్యంలో ప్రజలు బస్సుల్లో ప్రయాణించడం తగ్గిందని.. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం డీజిల్ ధరలు పెంచడంతో ఆర్టీసీ ఆదాయానికి గండి పడిందని తెలిపారు. ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు సీఎం కేసీఆర్ ఏడాదికి రూ.మూడు వేల కోట్లను కేటాయిస్తున్నారని చెప్పారు. కార్గో బస్సులతో ఆర్టీసీకి లాభం వస్తున్నదని, మరో వెయ్యి బస్సులను కొనుగోలు చేసి నడిపించేందుకు కృషిచేస్తానని బాజిరెడ్డి తెలిపారు. వాస్తవ పరిస్థితులను తెలుసుకోకుండా విపక్ష నేతలు ఇష్టారీతిన మాట్లాడడం తగదన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ తనపై నమ్మకంతో బాధ్యతలను అప్పగించారని, సంస్థకు నష్టం వాటిల్లకుండా తగు చర్యలు తీసుకుంటానని చెప్పారు. తనకు ఘన స్వాగతం పలికిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ వీజీగౌడ్, నగర మేయర్ దండు నీతూకిరణ్, ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, జడ్పీ వైస్ చైర్మన్ రజితాయాదవ్, ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, కేసీఆర్ సేవాదళ్ రూరల్ నియోజకవర్గ కన్వీనర్ కొర్వ దేవేందర్ తదితరులు ఉన్నారు.