32 వరద గేట్ల ద్వారా మిగులు జలాల విడుదల
మెండోరా, సెప్టెంబర్ 26 : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ నుంచి లక్షా 18వేల క్యూసెక్కుల వరద చేరుతున్నదని ఈఈ చక్రపాణి తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టంతో నిండుగా ఉండడంతో మిగులు జలాలను దిగువకు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. గోదావరిలోకి 32 వరద గేట్ల ద్వారా 99,840 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల నుంచి 1,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఈఈ వివరించారు. కాకతీయ కాలువకు 6 వేలు, లక్ష్మీ కాలువకు 50, సరస్వతీ కాలువకు 800, వరద కాలువకు 10,056 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతున్నదని తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు (90.313 టీంఎసీలు) కాగా, ఆదివారం సాయంత్రానికి 1090.90 అడుగులు (89.763 టీఎంసీల) నీటి నిల్వ ఉందన్నారు. ఈ సీజన్లో ప్రాజెక్ట్లోకి ఇప్పటివరకు 350.111 టీఎంసీల వరద నీరు వచ్చినట్లు ఈఈ తెలిపారు.
త్రివేణి సంగమం వద్ద ఉధృతంగా ప్రవాహం..
రెంజల్, సెప్టెంబర్ 26 : మండలంలోని కందకుర్తి సమీపంలో త్రివేణి సంగమం నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఎగువ ప్రాంతాల నుంచి ఆదివారం భారీగా వరద రావడంతో అంతర్రాష్ట్ర వంతెనను తాకుతూ ప్రవహించింది. నదిలోని పురాతన శివాలయం పూర్తిగా నీటమునిగింది. వీఐపీ పుష్కర ఘాట్కు వేళ్లే రోడ్డు పక్కన ఉన్న పొలాల్లోకి వరద నీరు చేరుతున్నది.