హుస్నాబాద్ ప్రాంత మెట్ట భూములను గోదావరి జలాలతో తడిపి సస్యశ్యామలం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గౌరవెల్లి రిజర్వాయర్ను నిర్మిస్తున్నది. సమైక్య రాష్ట్రంలో 1.141 టీఎంసీల సామర్థ్యంతో ఈ రిజర్వాయర్కు 2009లో శంకుస్థాపన చేశారు. కానీ, ఏండ్లు గడిచినా నిర్మాణ పనులు పునాదుల్లోనే నిలిచిపోయాయి. అప్పటి పాలకులు ఈ రిజర్వాయర్పై తీవ్ర వివక్ష చూపారు. 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ స్వయంగా గౌరవెల్లి రిజర్వాయర్ను సందర్శించారు. రీడిజైన్ చేసి మరిన్ని టీఎంసీల గోదావరి జలాలను ఈ ప్రాంతానికి తెచ్చి కరువును దూరం చేసేందుకు పూనుకున్నారు. అందులో భాగంగా 90శాతం పనులు పూర్త్తి చేయించారు. నిర్వాసితులకు పరిహారం అందించారు. కాగా, నిబంధనలకు విరుద్ధ్దంగా ఈ రిజర్వాయర్ నిర్మాణం చేస్తున్నారని కొందరు భూ నిర్వాసితులు జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ)లో పిటిషన్ వేశారు. దీంతో బుధవారం కేంద్ర త్రిసభ్య కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలించగా, వారికి అధికారులు పక్కా సమాచారంతో అన్ని వివరాలు తెలియజేశారు. ఈ రిజర్వాయర్ పూర్తయితే మెట్ట ప్రాంతంలో కరువు కాటకాలకు ఆస్కారమే ఉండదు. కానీ, ప్రతిపక్షాలు అడ్డుకోవడానికి కుట్ర చేస్తున్నాయి.
అక్కన్నపేట, సెప్టెంబర్ 22 : జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఏర్పాటు చేసిన కేంద్ర త్రిసభ్య కమిటీ బుధవారం సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని గౌరవెల్లి ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో పరిశీలించింది. గౌరవెల్లి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లేవని, ప్రాజెక్టును 1.141 టీఎంసీల నుంచి 8.23 టీఎంసీల సామర్థ్యానికి పెంచి నిబంధనలకు విరుద్ధ్దంగా నిర్మాణం చేస్తున్నారని కొందరు(ఐదారుగు) భూ నిర్వాసితులు ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో భాగంగా బుధవారం కమిటీ సభ్యులు పీఎస్ కూటియాల్, రమేశ్ కుమార్, అరోకియా లెనిన్ గౌరవెల్లి ప్రాజెక్టు ఇరిగేషన్ అధికారులతో పాటు భూ నిర్వాసితులు, పిటిషన్దారులతో మాట్లాడారు. కమిటీకి ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై ఇరిగేషన్ ఈఎన్సీ శంకర్ ఆధ్వర్యంలో పవర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనల మేరకు అన్ని అనుమతులు తీసుకొని ప్రాజెక్టు నిర్మిస్తున్నట్లు తెలిపారు. డీపీఆర్తో పాటు ఇతరత్రా ఆధారాలు చూపించారు. ఇప్పటికే ప్రాజెక్టు పనులు 90శాతం పూర్తయి తుది దశకు చేరుకున్నాయని చెప్పారు. ప్రాజెక్టు ముంపు ప్రాంతం, పరిసరాలు, కట్ట నిర్మాణం, పంపుహౌస్, అండర్ టన్నెల్, డెలివరీ సిస్టమ్ గేట్ల్లతో పాటు ప్రాజెక్టుకు సంబంధించి అన్ని అంశాలను కమిటీ సభ్యులు క్షుణ్ణంగా పరిశీలించారు. తాజాగా ఇండ్లు ముంపునకు గురయ్యే నిర్వాసితులతో మాట్లాడారు. తమకు పూర్తి స్థాయిలో పరిహారం చెల్లిస్తే తాము వెళ్లిపోతామని వారు కమిటీ సభ్యుల దృష్టికి తీసుకువచ్చారు. పిటిషన్దారులు మినహా మిగతా భూ నిర్వాసితులందరూ ప్రాజెక్టు నిర్మాణంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కమిటీ సభ్యుల ముందు స్పష్టం చేశారు. ప్రాజెక్టు నిర్మాణంతో అడవులు, గుట్టలు, జంతువులు మునగవని, పర్యావరణానికి ఎలాంటి ముప్పువాటిల్లడం లేదని కమిటీ సభ్యులకు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం 80 ఇండ్లు ముంపునకు గురైతున్నాయని, భూ నిర్వాసితులకు ప్రభుత్వ పరంగా అన్నివిధాలా పరిహారం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. బృందం వెంట ఎస్ఈ సుమతిదేవి, హుస్నాబాద్ ఆర్డీవో జయచంద్రారెడ్డి, ఈఈలు రాములు, రమేశ్, వెంకటేశ్వర్లు, హుస్నాబాద్ ఏసీపీ సతీశ్, సీఐ రఘు, శ్రీనివాసరెడ్డి, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు, భూ నిర్వాసితులు, పిటిషన్దారులు ఉన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ హయాంలో ఇందిరమ్మ వరద కాల్వలో భాగంగా గౌరవెల్లి రిజర్వాయర్ సామర్ధ్యాన్ని 1.141 టీఎంసీలుగా పేర్కొంటూ 2009లో శంకుస్థాపన చేశారు. కానీ, ఏండ్లు గడిచినా నిర్మాణ పనులు పునాదుల్లోనే నిలిచిపోయాయి. 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు, స్థానిక ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ గౌరవెల్లి ప్రాజెక్టును సందర్శించారు. అనతి కాలంలోనే సీఎం కేసీఆర్ స్వయంగా గౌరవెల్లి ప్రాజెక్టును సందర్శించి మెట్టప్రాంతాన్ని గోదావరి జలాలతో సస్యశ్యామలం చేసేందుకు రిజర్వాయర్ సామర్థ్యం పెంచి రీడిజైన్ చేస్తున్నట్లు ప్రకటించారు. గౌరవెల్లి రిజర్వాయర్ ప్రధాన ముంపు గ్రామమైన గూడాటిపల్లికి చెందిన కొంతమంది భూ నిర్వాసితులు(కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు) నిర్మాణ పనులను ప్రాజెక్టు రీడిజైన్ చేసినప్పటి నుంచి వివిధ కారణాలను చూపుతూ అడ్డుకుంటున్నారు. కోర్టుల్లో కేసులు వేసి మూడేండ్ల పాటు పనులు పూర్తిగా నిలిచిపోయేలా చేశారు. తర్వాత కోర్టు నుంచి అనుమతి రావడంతో తిరిగి పనులు మొదలయ్యాయి. జిల్లా మంత్రి హరీశ్రావు, స్థానిక ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్, కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి పలుమార్లు భూ నిర్వాసితులతో సమావేశాలు నిర్వహించారు. పార్టీలకతీతంగా ప్రాజెక్టు పనులకు సహకరించాలని కోరారు. భూ నిర్వాసితులు కోరుకున్న పరిహారం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. దీంతో ప్రాజెక్టు పనులు రాత్రిబంవళ్లు కొనసాగి ప్రస్తుతం 90శాతం మేర పూర్తయ్యాయి. చివరికి గూడాటిపల్లి సర్పంచ్ బద్దం రాజిరెడ్డి(కాంగ్రెస్), సహా కొంతమంది ప్రాజెక్టు తుదిదశ పనులను అడ్డుకునేందుకు కుట్ర చేశారు. ఇందులో భాగంగా గౌరవెల్లి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లేవంటూ, ప్రాజెక్టు సామర్థ్యం పెంచి నిబంధనలకు విరుద్ధంగా పనులు చేస్తున్నారని ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేశారు.బుధవారం త్రిసభ్య కమిటీ పరిశీలనకు రావడం, అధికారులు సమర్థవంతంగా అన్ని వివరాలు తెలియజేయడంతో ప్రాజెక్టుకు అడ్డంకులు తొలుగుతాయని అందరూ ఆశిస్తున్నారు.