ఖలీల్వాడి, సెప్టెంబర్ 20 : రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై మరింత దృష్టి సారించింది. స్పెషలిస్టు డాక్టర్లతో వైద్యసేవలు అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో టెలీ మెడిసిన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇక పల్లె ప్రజలు వైద్య సేవలు పొందేందుకు గ్రామాలను వీడి ఇక పట్టణాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. గ్రామాల్లోనే వైద్యం అందిం చనున్నది. కరోనా నేపథ్యంలో వైద్యం కోసం దవాఖానకు వెళ్లాలంటే నేటికీ చాలామంది వెనుకడుగు వేస్తున్నారు. అత్యవసరమైతే తప్ప వెళ్లడం లేదు. కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నా ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో పల్లె వాసులు పట్టణాలకు పరిగెత్తే అవసరం లేకుండా పీహెచ్సీల్లోనే ప్రత్యేక వైద్యులు సేవలందించేందుకు టెలీ మెడిసిన్ విధానాన్ని తీసుకువచ్చింది.
జిల్లాలో ప్రయోగాత్మకంగా ప్రారంభం..
టెలీమెడిసిన్ పద్ధతిని రాష్ట్ర ప్రభుత్వం 14 జిల్లాల్లో ప్ర యోగాత్మకంగా ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా నిజా మాబాద్ను ఎంపిక చేసింది. వైద్య సేవలు అవసరమైన వారు పీహెచ్సీలకు వెళ్తే సరిపోతుంది. కరోనా విజృంభణ సమయంలో ఫోన్లో డాక్టర్లతో మాట్లాడి చికిత్స అందించారు. దీన్ని కాస్త మెరుగుపర్చేందుకు ఆన్లైన్ వీడియోకాల్ విధానాన్ని సైతం ప్రారంభించారు. డాక్టర్లు రోగి సమస్య విని అవసరమైన వైద్యం అందిస్తారు. పీహెచ్సీ పరిధిలో సేవలు అవసరమైన వారిని గుర్తించి ఒక తేదీ చెప్పి ఆ రోజు వచ్చేలా చూస్తారు. ఇలా రోజుకొక డాక్టర్ అందుబాటులో ఉంటారు. ఇప్పటికే దీనిపై పీహెచ్సీ వైద్యులు, సిబ్బందికి శిక్షణ తరగతులు పూర్తి చేశారు. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్య..
ఈ టెలీ మెడిసిన్ సేవలు మధ్యాహ్నం 12 నుంచి 2గంటల అందుబాటులో ఉంటాయి. ఈ సమయంలో హైదరాబాద్లోని గాంధీ, నిమ్స్, ఉస్మానియా, నిజామాబాద్ వైద్య కళాశాల, బోధన్, ఆర్మూర్ దవాఖానలతో పాటు ఇతర జిల్లాల్లోని ప్రత్యేక డాక్టర్లు ఆన్లైన్లో సిద్ధంగా ఉంటారు. రెండు రోజులుగా టెలీ మెడిసిన్ విధానం పై ట్రయల్ రన్ చేశారు. మొదటి రోజు కిసాన్ నగర్లో ముగ్గురికి చికిత్స అందించారు. రెండో రోజు కమ్మర్పల్లి, మోర్తాడ్, నవీపేట్, సిరికొండ, సాలూరా పీహెచ్సీ పరిధిలోని రోగులకు సేవలను అందించారు. జిల్లాలో సీహెచ్సీలు 8, యూపీహెచ్సీలు 10, పీహెచ్సీలు 22 ఉన్నాయి.
సద్వినియోగం చేసుకోవాలి
మొట్టమొదటి సారిగా జిల్లాలోని ప్రభుత్వ దవాఖానలో టెలీ మెడిసిన్ విధానం అందుబాటులోకి వచ్చింది. జిల్లాలోని ప్రజలకు ఎలాంటి వ్యాదులు ఉన్నా వారికి టెలీ మెడిసిన్ ద్వారా వైద్య సేవలు అందిస్తారు. జిల్లాలోని ప్రజలందరూ ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలి.
-ప్రతిమారాజ్,
ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్
డాక్టర్లు అందుబాటులో ఉండే రోజులు..
సోమవారం స్త్రీ వైద్య, చర్మవ్యాధి వైద్యులు
మంగళవారం చెవి, ముక్కు, గొంతు, కన్ను
బుధవారం జనరల్ మెడిసిన్
గురువారం జనరల్ సర్జన్, పిల్లల వైద్యులు
శుక్రవారం స్త్రీ వైద్య నిపుణులు
శనివారం ఎముకల వైద్యులు