ఖలీల్వాడి, సెప్టెంబర్ 19 : కరోనా కట్టడికి సీఎం కేసీఆర్ ఆదేశాలతో అధికార యంత్రాంగం మరో అడుగు ముందుకేసింది. కొవిడ్ నుంచి రక్షణకు వ్యాక్సినేషన్ ఉత్తమమైన మార్గం కావడంతో వంద శాతం పూర్తి చేసేందుకు ప్రభుత్వం జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది. నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశాల మేరకు వైద్యారోగ్యశాఖ, మున్సిపల్, పంచాయతీ శాఖల సమన్వయంతో 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ టీకా వేసేలా ఏర్పాట్లు చేశారు. మాస్ వ్యాక్సినేషన్ పేరిట ప్రతి గ్రామం, పట్టణంలో టీకాల పంపిణీ ప్రారంభమైంది. ప్రభుత్వ ఆదేశాలతో ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు సైతం ఇందులో పాల్గొంటూ ప్రజలు టీకా వేసుకునేలా ప్రోత్సహిస్తున్నారు. పల్స్ పోలియోను తలపించేలా గ్రామ స్థాయిలో సబ్ సెంటర్ను యూనిట్గా, పట్టణంలో వార్డును యూనిట్గా తీసుకుని వ్యాక్సినేషన్ చేపడుతున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా రెండు బృందాలను ఏర్పాటు చేశారు. గ్రామ స్థాయిలో ఆశ, అంగన్వాడీ కార్యకర్త, పంచాయతీ సిబ్బంది, పట్టణాల్లో ఏఎన్ఎం, ఆశ, మెప్మా సిబ్బంది ఉంటారు. ఈ సిబ్బందికి అదనంగా అంగన్వాడీ, వీఏవో, బుక్ కీపర్ లేదా సీసీఎస్లతో కూడిన మరో నలుగురు సహాయకుల బృందం సభ్యులుగా ఉంటారు. సహాయకులు బృందం ఇంటింటికీ తిరిగి టీకాలు వేయించుకోని వారిని గుర్తించి అవగాహన కల్పిస్తారు. ప్రతి ఇంటికీ స్టిక్కర్లను అతికిస్తున్నారు. ప్రభుత్వ శాఖల్లోని సిబ్బందికి కచ్చితంగా టీకాలు ఇప్పించేలా మండల స్థాయి అధికారులకు కలెక్టర్ నుంచి ఆదేశాలు జారీ చేశారు. ప్రతి మండలంలోని ప్రత్యేక అధికారికి బాధ్యతలు కేటాయించారు. కలెక్టరేట్లో టోల్ ఫ్రీ నంబర్ను కూడా ఏర్పాటు చేశారు. 15 రోజుల్లో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయడమే లక్ష్యంగా నిర్ణయించారు. ఒక్క రోజే వేల సంఖ్యలో వ్యాక్సిన్ వేస్తున్నట్లు అధికారులు తెలుపుతున్నారు. కరోనాతో ప్రాణాలు కోల్పోకూడదని, ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదని ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నది. ప్రతి రోజూ వేసే టీకా వివరాలను అదే రోజు ఆన్లైన్లో ప్రభుత్వానికి నివేదించాల్సి ఉంటుంది. మొత్తం మీద కరోనాను నియంత్రించేందుకు గ్రామాలు, పట్టణాల్లో వ్యాక్సినేషన్ వేయించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పకడ్బందీగా వ్యాక్సినేషన్
కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశాల మేరకు గ్రామాలు, పట్టణాల్లో శిబిరాలను ఏర్పాటు చేసి వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటు న్నాం. టీకా తీసుకోని వారికి అవగాహన కల్పిస్తు న్నాం. ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా వ్యాక్సిన్ తీసుకోవాలి.
-బాల నరేంద్ర,జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి
జిల్లాలో ఇప్పటి వరకు టీకా తీసుకున్న వారి వివరాలు
18 ఏండ్లు పైబడిన వారు 3,39,302
60 ఏండ్లు నిండిన వారు 1,21,066
45 ఆపై వయస్సు గల వారు 2,38,713
మొత్తం 6,99,081