ఉమ్మడి జిల్లాలో భువన్ సర్వే చురుగ్గా సాగుతున్నది. భవనాల వివరాలను ఉపగ్రహ ఆధారిత వ్యవస్థ సాయంతో భువన్ యాప్లో పొందుపర్చేందుకు క్షేత్రస్థాయిలో సమాచారం సేకరించే పనిలో మున్సిపల్ సిబ్బంది నిమగ్నమయ్యారు. ఇంటి కొలతలు సరిచూసి భువన్ యాప్లో పొందుపరుస్తున్నారు. భవిష్యత్తులో యజమాని తన ఆస్తుల వివరాలను ఎక్కడి నుంచైనా సులువుగా చెక్ చేసుకునేందుకు వీలుగా భువన్ యాప్లో పొందుపరుస్తున్నారు. మున్సిపాలిటీల్లో ఇండ్లు, వ్యాపార సంస్థలకు సంబంధించిన సమగ్ర సమాచారం అంతా ఆన్లైన్లో నిక్షిప్తం చేస్తున్నారు. వివరాల నమోదుతోపాటు రెండేండ్ల క్రితం ఇండ్లకు సంబంధించిన ఫొటోలను మున్సిపాలిటీ రికార్డుల్లో పొందుపర్చగా.. ఈ రెండింటినీ అనుసంధానం చేసేలా భువన్ యాప్ను రూపొందించారు. సమగ్ర సమాచారం సేకరించి యాప్లో నమోదు చేసేందుకు రెవెన్యూ, పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు చేపట్టిన ఇంటింటి సర్వే చురుగ్గా సాగుతున్నది. నిజామాబాద్ నగరపాలక సంస్థ పరిధిలో మొత్తం 74,385 భవనాలున్నట్లుగా అధికారులు గుర్తించి, ఇప్పటివరకు 65,175 బంగ్లాల సర్వే పూర్తి చేశారు.
నిజామాబాద్, సెప్టెంబర్ 18, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మున్సిపాలిటీల్లో ఇండ్లు, వ్యాపార సంస్థలకు సంబంధించిన సమగ్ర సమాచారం ఒకే యాప్లో నిక్షిప్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో నాలుగు, కామారెడ్డి జిల్లాలో మూడు మున్సిపాలిటీలున్నాయి. వివరాల నమోదు ప్రక్రియ జోరుగా సాగుతోంది. రెండేండ్ల క్రితం పురపాలికల పరిధిలోని ఇండ్లకు సంబంధించిన ఫొటోలు మున్సిపాలిటీల్లో నిక్షిప్తం చేశారు. ఈ రెండింటినీ అనుసంధానం చేసేలా భువన్ యాప్ను రూపొందించారు. తాజాగా పురపాలికల్లోని సమగ్ర సమాచారం సేకరించి యాప్లో నమోదు చేసేందుకు అధికారులు సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. మున్సిపాలిటీల్లోని రెవెన్యూ, పట్టణ ప్రణాళిక విభాగం అధికారుల సమన్వయంతో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో మున్సిపల్ సిబ్బంది బృందాలుగా విడిపోయి పర్యటిస్తున్నారు. ఇండ్లు వ్యాపార సంస్థల భవనాలకు అనుమతులు, నిర్మాణాలను పరిశీలిస్తున్నారు. పురపాలక సంఘాల నుంచి పొందిన అనుమతుల మేరకు భవనాన్ని నిర్మించారా? నిబంధనలు ఉల్లంఘించారా? అనే కోణంలో వివరాలు ఆరా తీస్తున్నారు. ఒకవేళ మున్సిపల్ రికార్డులకు, క్షేత్ర స్థాయి పరిస్థితులకు తేడాలుంటే సవరించి సంబంధిత భవన యజమానికి సమాచారం ఇస్తున్నారు.
అనుమతులు, నిర్మాణాల్లో భారీ తేడాలు…
నిజామాబాద్ నగరం, ఆర్మూర్, బోధన్, భీమ్గల్ పట్టణాల్లో భవన నిర్మాణాలు చురుగ్గా జరుగుతున్నాయి. పాత ఇండ్ల స్థానాల్లో కొంగొత్త కట్టడాలు వెలుస్తున్నాయి. గ్రామాలు సైతం ప్రస్తుతం పట్టణీకరణకు గురవుతోంది. ఈ పరిస్థితిలో కాలానుగుణంగా నిర్మాణాలు పెరగడంతోపాటు పాత భవనాల్లో పైఅంతస్తులు నిర్మిస్తున్నారు. నిర్మాణ శైలిలోనూ మార్పులు చేర్పులు చేస్తున్నారు. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు మున్సిపాలిటీల్లో ప్రస్తుతం లేకపోవడంతో స్వీయ మదింపునకు సెల్ఫ్ అసెస్మెంట్కు ప్రభుత్వం అవకాశం కల్పించింది. సర్కారు ఇచ్చిన ఈ అవకాశాన్ని పట్టణ వాసులు ఉపయోగించుకోలేదు. దీంతో పురపాలికల్లో భారీగా ఆస్తి పన్ను నష్టపోవాల్సి వస్తుందని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం 2016లోనే భువన్ యాప్ ద్వారా ప్రత్యేక సర్వేను చేపట్టి అమలు చేసింది. రాష్ట్రంలోని వివిధ పురపాలికల్లో చేపట్టిన భువన్ యాప్ సర్వేతో ఆదాయం పెరగడంతో అంతటా భువన్ సర్వే చేపట్టాలని నిర్ణయించి అమలు చేస్తున్నారు. ఆస్తి పన్నును ఎగ్గొడుతున్న భవన యజమానులకు భువన్ యాప్తో అడ్డుకట్ట పడనున్నది. మరోవైపు అక్రమాలకు తావు లేకుండా పక్కాగా ఆస్తి పన్ను మదింపు జరుగుతుండడం విశేషం.
నిజామాబాద్ నగరంలో వేగంగా…
నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలో భువన్ సర్వే వేగంగా జరుగుతోంది. మొత్తం 74,385 భవనాలున్నట్లుగా మున్సిపల్ అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు 65,175 బంగ్లాలను సర్వే పూర్తి చేసి భువన్ యాప్లో సమగ్ర వివరాలను నమోదు చేశారు. ఇంకా 9212 భవన నిర్మాణాల వివరాల నిర్దిష్ట కొలతలు స్వీకరించాల్సి ఉన్నట్లుగా సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. పురపాలక శాఖ ఆదేశాల మేరకు నిజామాబాద్ కార్పొరేషన్లో భువన్ సర్వే జెట్ స్పీడ్తో నిర్వహిస్తున్నారు. డివిజన్లకు ప్రత్యేక అధికారులను నియమించి సర్వేను చేపడుతున్నారు. కొంత కాలంగా నిజామాబాద్ నగర విస్తీర్ణం భారీగా విస్తరించింది. మొన్నటి పురపాలక ఎన్నికలకు ముందు పలు గ్రామాలను కార్పొరేషన్లో విలీనం చేశారు. ఆయా గ్రామాల్లోని నివాసాలు సైతం ఇందులోనే కలవడంతో పరిధి భారీగా పెరిగింది. పెరిగిన పరిధిని దృష్టిలో పెట్టుకుని ప్రతి భవనాన్ని భువన్ యాప్లో నమోదు చేస్తున్నారు. భవిష్యత్తులో ఇంటి యజమాని తన ఆస్తుల వివరాలను ఎక్కడి నుంచైనా సులువుగా చెక్ చేసుకునేందుకు వీలుగా భువన్ యాప్లో ఏర్పాట్లు చేస్తుండడం విశేషం.
ప్రతి భవనానికీ జియో ట్యాగింగ్
గ్రామ పంచాయతీ, పురపాలికల్లో ఆస్తి పన్ను విధించేందుకు సిబ్బందే కొలతలు చేపట్టి నిర్ణయించే వారు. అది కాస్తా పూర్తి స్థాయిలో నిష్పక్షపాతంగా జరగకపోవడంతో పెద్ద పట్టణాలు ఉన్నా ఆదాయం అంతంత మాత్రంగానే ఉండేది. ప్రస్తుతం భువన్ యాప్లో పురపాలికను బట్టి నాలుగు నుంచి ఆరు డివిజన్లుగా విభజించారు. ఇందులో స్థానిక సబ్ రిజిస్ట్రార్ల ప్రకారం పురపాలికల్లో ప్రాంతాన్ని బట్టి, స్థలాన్ని ధరలను పరిగణలోకి తీసుకుని పన్ను నిర్ణయించారు. సర్వేలో భాగంగా ఇంటి నిర్మాణం, ఎన్ని అంతస్తులు, సౌకర్యాలు, విస్తీర్ణం, గృహం, వ్యాపా ర, వాణిజ్య సముదాయామా అనే వివరాలు నమో దు చేయడంతోపాటు భవనానికి సంబంధించిన ఫొటోలను అప్ లోడ్ చేసి జియో ట్యాగింగ్ చేస్తున్నారు. సర్వే పూర్తి చేసిన తర్వాత అందుకు సంబంధించిన వివరాలు ఆన్లైన్లోనూ కనిపించనున్నా యి. ఈ క్రమంలో ఇప్పటికే నమోదు చేసిన వివరాల ఆధారంగా ఆస్తి పన్ను విధించే అవకాశం ఉం ది. పట్టణాల్లో కొందరు ఇంటి నిర్మాణానికి ఒకటి, రెండు అంతస్తుల వరకే అనుమతి తీసుకుని అంతకు మించి నిర్మాణాలు చేపట్టినట్లుగా భువన్ సర్వేలో బహిర్గతమవుతున్నది. ఇప్పటి వరకు అదనపు నిర్మాణానికి అనుమతులు లేకపోవడంతో చాలా మంది పన్ను చెల్లించడం లేదు. పురపాలక అధికారులు ఇప్పుడు నేరుగా ఇంటికే వెళ్లి కొలతలు తీసుకోవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిర్మాణ వాస్తవ పరిస్థితికి అనుగుణంగా ఆస్తి పన్నును విధించేందుకు పురపాలక అధికారులు చర్యలు చేపడుతున్నారు.
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం భువన్ సర్వే
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం భువన్ సర్వే కొన సాగుతోంది. కొద్ది రోజు ల్లోనే నిజామాబాద్ నగరంలో నివాసాలు, వాణిజ్య సముదాయాల వివరాల సేకరణ పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నాము. ఇప్పటికే మెజార్టీ భాగం పూర్తయినందున మిగిలిన భాగాన్ని త్వరగా భువన్ యాప్లో నమోదుకు ప్రయత్నిస్తున్నాం.