గలగలా గోదారి కదిలిపోతుంటే…చెక్డ్యామ్లు పొంగిపొర్లుతుండగా..
12 వ రోజూ గోదావరి జలాల ప్రవాహం
శనివారం వెల్దుర్తిలో నిండిన రెండు చెక్డ్యామ్లు
వెల్దుర్తి, ఏప్రిల్ 17 : కొండపోచమ్మ సాగర్ నుంచి సంగారెడ్డి కెనాల్ ద్వారా గోదావరి జలాలు పన్నెండో రోజూ శనివారం పరుగులు తీశాయి. మెదక్ జిల్లాలోని హల్దీవాగులోకి బిరబిరా వస్తున్న గోదావరి జలాలతో చెక్డ్యాములు నిండుతున్నాయి. 12వ రోజైన శనివారం వెల్దుర్తి మండలంలో రెండు చెక్డ్యాములు నిండాయి. శనివారం గోదావరి జలాలు కిలోమీటరున్నర ప్రవహించాయి. అపర భగీరథుడు, సీఎం కేసీఆర్ ఈనెల 6న సిద్దిపేట జిల్లా అవుసులపల్లి వద్ద సంగారెడ్డి అప్టెక్ తూం వద్ద గోదావరి జలాలను వదిలిన సంగతి తెలిసిందే. మరో నాలుగైదు రోజుల్లో కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టుకు గోదావరి జలాలు చేరనున్నాయి. హల్దీవాగుపై 32 చెక్డ్యామ్లకు గాను శనివారం వరకు 24 నిండాయి. మొత్తం నాలుగు చెరువులు నిండి మత్తళ్లు దుంకాయి.
హల్దీవాగు ప్రాజెక్టుకు జలకళ…
మెదక్ జిల్లాలోని హల్దీవాగు ప్రాజెక్టు పొంగిపొర్లుతుండడంతో గోదావరి జలాలు వెల్దుర్తి మండలంలో గలగలా పారుతున్నాయి. శుక్రవారం సాయంత్రానికి వెల్దుర్తి చెక్డ్యామ్ను తాగిన గోదావరి నీళ్లతో శనివారం తెల్లవారుజామున వెల్దుర్తి శివారు వెల్దుర్తి-తూప్రాన్ రోడ్డు పక్కన, గంగమ్మ దేవాలయం సమీపంలో ఉన్న చెక్డ్యాం మత్తడి దూకింది. మత్తడి దూకిన జలాలు పరవళ్లు తొక్కుతూ పాత చక్కెర ఫ్యాక్టరీ వెనుక భాగంలో ఉన్న మరో చెక్డ్యామ్లోకి చేరుకున్నాయి. శనివారం సాయంత్రం వెల్దుర్తి-2 చెక్డ్యాం సైతం అలుగు ప్రారంభం కావడంతో వెల్దుర్తి-మెదక్ ప్రధాన రహదారి ఉప్పులింగాపూర్ గ్రామసమీపంలో ఉన్న బ్రిడ్జిని తాకుతూ ఉప్పులింగాపూర్ చెక్డ్యాంలోకి గోదావరి జలాలు చేరుతున్నాయి. ఎండాకాలంలో వాగునిండా నీళ్లతో ప్రవహిస్తుంటే పరీవాహక ప్రాంత రైతుల ఆనందానికి ఆవధులు లేకుండా పోయాయి. మండుటెండల్లో వాగు నిండుగా పారుతూ చెక్డ్యామ్లు మత్తళ్లు దుంకుతుండడంతో అన్నివర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. వచ్చే రోహిణి కార్తెలో వరి తుకాలు పోసి నాట్లు వేసేందుకు రైతన్నలు సమాయత్తం అవుతున్నారు. చెక్డ్యామ్లు మత్తళ్లు దుంకుతుండడంతో నేడు ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు గోదావరి జలాలకు పూజలు చేయనున్నట్లు తెలిసింది.