గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు, ఆర్థిక సాధికారత సాధించేందుకు, వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు సర్కారు స్వయం సహాయక సంఘాల (ఎస్ఎస్జీ)ను ఏర్పాటు చేసింది. ఇప్పటికే వేలాది సంఖ్యలో ఎస్హెచ్జీలు ఉండగా.. ఓటరు జాబితా ఆధారంగా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న 18-35 ఏండ్ల వయస్సు గల వారితో కొత్త గ్రూపులను కూడా ఏర్పాటు చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 5,666 ఏర్పాటు కాగా.. ఇందులో 2,860 గ్రూపులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మ్యాచింగ్ గ్రాంట్ కింద ఒక్కో గ్రూపునకు రూ.15 వేల చొప్పున రూ.4.29 కోట్లు వారివారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేశాయి. ఈ డబ్బులను సంఘాల సభ్యులు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు.
నిర్మల్ టౌన్, సెప్టెంబర్ 18 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాలు ఉండగా.. 2020 అక్టోబర్ నుంచి 2021 మర్చి వరకు కొత్త సంఘాలను ఏర్పాటు చేశారు. గ్రామ సమైక్య సంఘాల్లో సభ్యులుగా ఓటరు జాబితా ఆధారంగా 18-35 ఏండ్ల మధ్య వయసు వారికి అవకాశం కల్పించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 5,666 కొత్త సంఘాలు ఏర్పాటు చేయగా.. ఒక్కో సంఘంలో పది మంది సభ్యుల చొప్పున మొత్తం 56,660 మందికి అవకాశం కల్పించారు. ఆదిలాబాద్ జిల్లాలో 1,537, కుమ్రం భీం ఆసిఫాబాద్లో 984, మంచిర్యాలలో 1,310, నిర్మల్లో 1,835 గ్రూపులు ఏర్పాటు చేశారు. ఇందులో ఆదిలాబాద్ జిల్లాలోని 170, కుమ్రం భీం ఆసిఫాబాద్లో 898, మంచిర్యాలలో 947, నిర్మల్లో 845 గ్రూపులకు ఒక్కో గ్రూపునకు రూ.15 వేల చొప్పున మ్యాచింగ్ గ్రాంటు కింద నిధులు వారి ఖాతాల్లో జమ అవుతున్నాయి. ఈ డబ్బులను సంఘ అభివృద్ధికి వినియోగించుకోవచ్చని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ఈ డబ్బులను ప్రభుత్వానికి తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. సంఘంలోని సభ్యులు ఇంటి అవసరాల కోసం వినియోగించుకొని తిరిగి వడ్డీతో సంఘంలో చెల్లించే అవకాశం ఉంది. ఈ నిధులను కేంద్రం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం ఇస్తున్నాయి.
డబ్బులు జమ అవుతున్నాయి..
ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని జిల్లాలో స్వయం సహాయక సం ఘాలను ఏర్పాటు చేశాం. 18-35 ఏండ్లు నిండిన వారు, ఇది వరకు సంఘంలో లేనివారిని గుర్తించి సంఘంలో చేర్చా రు. ఒక్కొక్క సంఘంలో పది మంది సభ్యులు చేరారు. కొత్తగా ఏర్పాటైన సంఘాలను ప్రోత్సహించడానికి మ్యాచింగ్ గ్రాంట్ కింద రూ.15 వేల చొప్పున నెల రోజులుగా ఖాతాల్లో జమ చేస్తున్నది.
అన్ని పథకాలు వస్తాయి..
ప్రభుత్వం మహిళా సంఘ సభ్యులను ప్రోత్సాహిం చేందుకు పెద్ద ఎత్తున వివిధ పథకాలను అమలు చేస్తున్న ది. సబ్సిడీ సిలిండర్తో పాటు బ్యాంకుల ద్వారా స్త్రీనిధి రుణాలు, పావలా వడ్డీకే రుణాలు, స్వయం ఉపాధి కుటీర పరిశ్రమల కోసం బ్యాంకుల ద్వారా లోను మహిళా సంఘా లకు అందిస్తుండడంతో కొత్త సంఘంలో సభ్యులు గా చేరాం. గతంలో సభ్యత్వం లేకపోవడంతో ఐకేపీ ద్వారా ఏ పథకం అమలైనా సభ్యులుగా తాము లేమని పథకాలు వచ్చేవి కావు. ఇప్పుడు ఆ పథకాలన్నింటికీ అర్హత సాధించాం.
నెలనెలా రూ.100 పొదుపు చేస్తున్నాం..
మా గ్రామంలో ఎస్హెచ్జీ గ్రూపులో సభ్యత్వం లేని వారందరం కలిసి కొత్త సంఘంగా ఏర్పాటు చేసుకున్నాం. మా సంఘంలో పది మంది కొత్త సభ్యులతో అంజలి స్వయం సహాయక సంఘంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. సంఘంలోని పది మంది సభ్యులు ప్రతినెలా రూ.100 పొదుపు పాటిస్తూ ప్రతినెలా సమావేశాలు నిర్వహించుకుంటూ సంఘ సభ్యులుంతా ఐక్యతతో ముందుకెళ్తున్నాం. ప్రభుత్వం కొత్త సంఘాలకు మ్యాచింగ్ గ్రాంటు కింద రూ.15 వేలు జమ చేసినందుకు సంతోషంగా ఉంది.