గ్రామాల్లో రోజురోజుకూ పెరుగుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య
తాత్కాలికంగా పనుల నిలిపివేత
నిర్మల్ టౌన్, ఏప్రిల్ 12: జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకానికి కరోనా దెబ్బ తగులుతున్నది. వారం రోజుల నుంచి నిర్మల్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గ్రామాల్లో స్వచ్ఛందంగా లాక్డౌన్ నిర్వహించడం, జనసమూహాలు ఉండకూడదన్న నిబంధనలు పెట్టుకోవడంతో ఉపాధిహామీ పనులను నిర్వహించకుండా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు నిర్ణయించుకుంటున్నాయి. ఇప్పటికే నిర్మల్ జిల్లాలో ఏప్రిల్ 1 నుంచి ఉపాధిహామీ పనులు ప్రారంభం కాగా.. మొదటి వారంలో పనులకు కూలీలు భారీ సంఖ్యలో వెళ్లారు. ప్రారంభంలో 10వేల మంది కూలీలు పాల్గొనగా, ఐదు రోజుల్లోనే 30వేల మంది వరకు హాజరయ్యారు. రెండో వారంలో 80వేల వరకు కూలీలు హాజరైనట్లు అధికారులు పేర్కొంటున్నారు. అయితే వారం నుంచి జిల్లా లో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతు న్నందున గ్రామాల్లో పనులను నిలిపివేశారు. ఇప్పటివరకు జిల్లాలో 396 గ్రామ పంచాయతీల్లో పనులను నిర్వహించాలని అధికారులు నిర్ణయించగా.. 370 గ్రామపంచాయతీల్లో పనులు ప్రారంభమైనట్లు తెలిపారు. వారం రోజుల నుంచి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రోజురోజుకూ గ్రామాల్లో కరోనా కట్టడిలో భాగంగా ఉపాధిహామీ పనులకు వెళ్లవద్దని డప్పుచాటింపు చేయడంతో ఎవరూ పనికి వెళ్లడం లేదు. జిల్లాలో పని చేసే కూలీల సంఖ్య రెండురోజులుగా పడిపోయింది. శుక్ర, శనివారాల్లో 70వేల నుంచి 80వేల వరకు పనికి వెళ్లగా.. సోమవారం మాత్రం ఆ సంఖ్య 60వేల లోపే ఉందని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో కరోనా సమయంలో ఉపాధిహామీ పనులు నిర్వహిస్తే వైరస్ సోకిన వారి నుంచి మరికొందరికి వ్యాప్తి చెందే ప్రమాదం ఉండడంతో సాధారణ కూలీలు కూడా ఉపాధిహామీ పనులకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు.
నిబంధనలు పాటిస్తూ పనుల నిర్వహణ..
జిల్లాలో వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో కొవిడ్ నిబంధనలు పాటిస్తూనే పనులు చేపట్టడానికి అనుమతిస్తామని అధికారులు చెప్పడంతో కొన్ని గ్రామాల్లో పనులను నిర్వహిస్తున్నారు. 90శాతం చెరువుల్లో మట్టితీత పనులను చేపడుతున్నారు. చెరువు విశాలంగా ఉండడం తో భౌతికదూరం పాటిస్తూ, మాస్కులు ధరించి పనులు చేస్తున్నారు. దూరందూరంగా గ్రూపులను ఏర్పాటు చేసి పనులను నిర్వహించేలా గ్రామపంచాయతీ కార్యదర్శులు చూస్తున్నారు.
ఇవి కూడా చదవండి
జాతీయ రహదారికి నెంబర్ కేటాయింపు.. మంత్రి హర్షం
వకీల్ సాబ్ నిర్మాత దిల్ రాజుకు కరోనా పాజిటివ్