మాచారం సర్పంచ్ పెద్దిరాజు
అమ్రాబాద్, మే 16: తనపై తప్పుడు ఆరోపణలు చేసి తన ప్రతిష్టను భంగపరిచేలా అటవీశాఖ అధికారులు వ్యవహరిస్తున్నారని మాచారం చెంచు సర్పంచ్ పెద్దిరాజు అన్నారు. ఆదివారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమ్రాబాద్ రేంజ్ పరిధిలోని మాచారం గ్రామంలో తాను 14ఎకరాలు అటవీ భూమిని అక్రమంగా కబ్జా చేశానని ఎఫ్ఆర్వో అర్చన పత్రికల్లో ఇవ్వడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను 20 ఏండ్ల కిందట ఐటీడీఏ నిబంధనలకు అనుగుణంగా రెండెకరాల అటవీ భూమిని సాగుచేస్తున్నానన్నారు. దానిని పోడుభూమిగా గుర్తించి పట్టాలు ఇస్తామని తమకు ప్రభుత్వం భరోసా ఇచ్చిందని.. కానీ ఎఫ్ఆర్వో అర్చన 14 ఎకరాలు అంటూ తనపై పత్రికల్లో కథనాలు ఇవ్వడం బాధాకరమన్నారు. సర్పంచ్గా ఉన్న తనపై నిందలు మోపి తన ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరించిన అర్చనపై చర్యలు తీసుకోవాలని.. ఈ విషయమై కోర్టుకు సైతం వెళ్లనున్నట్లు ఆయన తెలిపారు. తనకు రెండెకరాలు తప్ప ఒక్క సెంటు ఎక్కువ ఉన్నా ఎలాంటి విచారణకైన సిద్ధమేనని స్పష్టం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా నాయకుడు చెన్నకేశవులు, మార్కెట్ డైరెక్టర్ రాజు, ఆదివాసి రాష్ట్ర నాయకులు నిమ్మల శ్రీనివాసులు, గురువయ్య, పెంటమ్మ, సుధాకర్ పాల్గొన్నారు.