పేదలను దోచుకుంటున్న అంబులెన్స్ నిర్వాహకులు
భయాన్ని సొమ్ము చేసుకుంటున్న వైనం
కల్వకుర్తి నుంచి హైదరాబాద్కు రూ.18వేలు వసూళ్లు
కల్వకుర్తి, జూన్ 4: కరోనా వేళ కొందరు మానవతావాదులు మానవత్వాన్ని చాటుకుంటుంటే.. కొందరు అంబులెన్స్ల నిర్వాహకులు సిండికేట్గా మారి కాసులకు కక్కుర్తి పడుతున్నారు. కల్వకుర్తి నుంచి హైదరాబాద్కు పేషంట్ను తరలించేందుకు రూ.18వేలు నిర్ణయించారు. సిండికేట్లో ధర నిర్ణయించడంతో సీరియల్ ప్రకారం వచ్చే అంబులెన్స్కు హైదరాబాద్ వెళ్లాలంటే రూ.18వేలు ఇవ్వాల్సిందే. కొవిడ్కు ముందు పేషంట్ను తీసుకెళ్లే అంబులెన్స్ హైదరాబాద్ వెళ్లడానికి రూ.2800 నుంచి గరిష్టంగా రూ.3500 చెల్లించేవారు. కొవిడ్ వచ్చిన తర్వాత క్రమక్రమంగా పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. పులిని చూసి నక్క వాతపెట్టుకున్నట్లు కార్పొరేట్ దవాఖానల దోపిడీని చూసి అంబులెన్స్ల నిర్వాహకులు తమ కొత్త దందాకు తెరలేపారు. కల్వకుర్తి నుంచి హైదరాబాద్కు 88 కిలోమీటర్లు, హైదరాబాద్లో ఏ దవాఖానకు వెళ్లాలన్నా.. 120 కిలోమీటర్ల దూరం కంటే ఎక్కువ ఉండదు. పెట్రోల్కు రూ.1000 నుంచి రూ.1500 ఖర్చు అవుతుంది. మరి రూ.18వేలు అంటే ఎంత దుర్మార్గమో అర్థమవుతుంది.
సామాన్యులు కూడా తనవంతుగా..
కొవిడ్ విపత్తు వేళలో చాలా మంది సామాన్యులు కూడా తమవంతుగా కొవిడ్ వచ్చిన వారికి ప్రత్యక్షంగా, పరోక్షంగా చేయూతనందిస్తున్నారు. కల్వకుర్తికి చెందిన ఖాదర్ అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి కరోనా మృతదేహాలకు కులమతాలకు అతీతంగా ఆచార వ్యవహారాలకు అనుగుణంగా అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు. కరోనా బాధితులకు తమకు చేతనయినంత ఆర్థికసాయం అందిస్తున్నారు. ఖాదర్ మిత్ర బృందం అతి సామాన్యులు, చిన్న చితక వ్యాపారాలతో తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. సత్యసాయి ట్రస్ట్ కరోనా బాధితులకు ఉచితంగా భోజనం అందిస్తుంది. యూత్ ఫర్ సేవా ఆధ్వర్యంలో విద్యార్థులు ఆక్సిజన్ అవసరం ఉన్నవారి ఇండ్లకు వెళ్లి ఆక్సిజన్ కాన్సంటేటర్లు అందజేస్తున్నారు. దాతలు సహాయం చేస్తుంటే.. అపత్కాలంలో రోగులను దవాఖానకు చేర్చాల్సిన అంబులెన్స్లు కాసులకు కక్కుర్తి పడడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.